Saturday, June 20, 2020

భగవద్గీత 4. 1 జ్ఞాన యోగం - సర్వం విష్ణుమయం



ఎన్నో జీవ రాసులుగా జన్మలు తీసుకున్న తరువాత మానవ జన్మ వస్తుందని మన శాస్త్రాలు చెప్తాయి. అలానే ఇలాంటి మానవ జన్మలు కూడా ఎన్నో మనం ఇంతకూ ముందు తీసుకొని ఉండవచ్చు. మనం ఈ శరీరాన్ని వదిలివేయడాన్ని చనిపోవడం అని పిలుస్తాము. శరీరం వదిలివేస్తే మనతో ఏమి తీసుకు పోతాము అనే విషయాన్ని మన శాస్త్రాలు చెప్పాయి. మనతో సూక్ష్మ, కారణ శరీరాలు వస్తాయి. వీటిలో మన పూర్వ జన్మ కర్మలు, సంస్కారాలు మరియు వాసనలు ఉంటాయి. వీటి ఆధారంగానే మనం ఎక్కడ, ఎలా, ఎవరికి పుట్టాలో నిర్ణయించబడుతుంది. కాని పరమాత్మ జన్మ తీసుకుంటే దాన్ని అవతారం అని పిలుస్తాము. ఇక్కడ వాసనలు కర్మలతో సంబంధం ఉండదు. పరమాత్మ తత్త్వం అంతటా ఉంటుంది, అందుకే ఆ తత్వాన్ని విష్ణువు అని పిలుస్తాము. ఈ విష్ణు తత్త్వం అంతటా ఉంటుంది కాబట్టి, ఎక్కడ అవసరం అయితే అక్కడ అవతార పురుషుల రూపంలో వ్యక్తం అవుతుంది. అందుకే మనం దేవుడు దిగివచ్చాడు అంటాము. అంటే ఈ త్రిగుణాత్మకమైన మానవ స్థాయికి ఈ విష్ణు తత్త్వం రావాలి. అప్పుడే మనం ఆ తత్వాన్ని చూడగలం.

మనకు ఇంతకూ ముందు ఎన్నో జన్మలు వచ్చి పోయాయి. అవన్ని గుర్తు ఉంటె మానవులుగా తట్టుకునే శక్తి మనకు లేదు. ఈ జన్మలోని బంధాలతోనే మనం కష్ట పడుతూ ఉంటె, ఇక అన్ని జన్మలలో ఉన్న సంబంధాలు ఎదురుగా కనపడుతూ ఉంటె అసలు తట్టుకోలేము. అందుకే మనకు పూర్వ జన్మల అనుభవం లేకుండా దేవుడు మంచి ఉపకారం చేసాడు. అలా అని మనకు ఏమి గుర్తు ఉండదు అని కాదు. మనం స్కూలులో ఒక్కో తరగతి తరువాత ఒక్కటి దాటి 
పైచదువులకు వెళ్తాము. కింది తరగతులలో చదివిన అన్ని పాఠాలు మనకు పూర్తిగా గుర్తు ఉండవు. వాటినుంచి నేర్చుకున్న జ్ఞానం ఏదైతో ఉందొ అది మాత్రం మనతో తీసుకు వెళ్తాము. అక్కడ నేర్చుకున్న వాటి వల్ల మనలో ఒక రకమైన ఎదుగుదల వస్తుంది. అది మనకు జీవితాంతం ఉపయోగపడుతుంది. అలానే మనం పూర్వ జన్మలలో చేసిన కర్మలు, పొందిన అనుభవాలు మన జీవితాన్ని తీర్చిదిద్దుతాయి. కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ విషయం మనకు అర్ధం అవుతుంది. అందుకే భగవానుడు ధర్మాన్ని అనుసరించమని, జీవితాన్ని కర్మ సిద్ధాంత పరంగా అర్ధం చేసుకోమని చెప్పడం జరిగింది. ఇలా చేస్తే మనం ఒక రోజు ఆ విష్ణు తత్వంలో ఐక్యం అవుతాము అని రాబోయే శ్లోకంలో చెప్తున్నారు.

జన్మ కర్మ చ మే దివ్యమేవం యో వేత్తి తత్వతః !
త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సః అర్జున !!

ఓ అర్జున ! నా అవతారములు, కర్మములు దివ్యములు. అనగా నిర్మలములు మరియు అలౌకికములు. ఈ తత్వ రహస్యం తెలుసుకున్న వారు తనువును చాలించిన పిమ్మట మరల జన్మించరు సరిగదా! వారు నన్నే చేరుకుందురు.

ఇక్కడ భగవంతుని కర్మలు దివ్యములు అని చెప్పారు. అంటే ఈ కర్మలు వాసనలకు సంబంధించినవి కావు. వీటిలో స్వార్ధం అనేదే ఉండదు. ఇక్కడ కర్త్రుత్వ భావన ఉండదు. మహానుభావులు కూడా దివ్య రూపులే. వారి కర్మలు ఫలాసక్తి రహితంగా ఉంటాయి. 

మనం ఈ రహస్యాన్ని అర్ధం చేసుకొని కర్మ యోగాన్ని అనుసరిస్తూ సాధన కొనసాగిస్తే మనం ఆ భగవంతుడిని తప్పక చేరుకుంటాము. అంటే మరల జన్మ కర్మబంధాలలో ఇరుక్కోము.


ఓం శ్రీ సాయిరాం!