Monday, September 1, 2014

జ్ఞాన జ్యోతి - నిజ జీవితానికి సాయి బోధలు


షిర్డీ సాయి సాకారుడిగా శరీరంలో ఉన్నప్పుడు ఎన్నో చమత్కారాలు చేసి మన మనస్సులను మార్చే ప్రయత్నం చెసారు. సాయి నిరాకారుడుగా మన అందరి హృదయాలలో ఉండి మనకు ఎన్నో అనుభూతులను, చమత్కారాలను చూపిస్తూనే ఉంటారు. ఈ సత్యాన్ని మనం ఎప్పటికి మరవకూడదు. 

మనకు కష్టం వచ్చినప్పుడు మాత్రమే సాయిని తలవటం కాదు, మన మనస్సే సాయి నిలయం కావాలి. అప్పుడు కష్టం గురుంచిన ఆలోచనే మనకు రాదు. ఒక వేళ వచ్చినా అది అంతగా మనలను బాధ పెట్టదు. మనం ఈ కష్టాల వలయం వద్దని కోరుకుంటాము, కాని మనం ఆ వలయంలోనే జీవించి ఉండాల్సి ఉంది. మనము ఈ క్షణికమైన జీవితాన్ని, ఈ వలయాన్ని దాటి పరమాత్మ తత్త్వం అనే సత్యాన్ని అర్థం చేసుకోవాలని సాయి తపన పడుతూనే ఉంటారు. శ్రద్ధ సహనాలనే మంత్రాలతో ఈ సత్యాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలని మనకు బోధ చేసారు. 

బాబా చేసిన చమత్కారాలలో ఉండే ఆధ్యాత్మిక బోధలను మనం అర్ధం చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి. వాటిని అర్థం చేసుకుంటే మానవ జన్మ లక్ష్యం ఏమిటో మనకు అవగతం అవుతుంది. ఈ లక్ష్యాన్ని చేరటానికి కావాల్సిన సాధనాసామాగ్రిని మనకు ఇచ్చి, బాబా మన దగ్గరే ఉండి మనలను అనుగ్రహిస్తారు. అటువంటి ఆధ్యాత్మిక అర్ధం ఉన్న చమత్కారమే నీటితో దీపాలను వెలిగించిన సన్నివేశం. కాని దీన్నీ ఒక చమత్కారంలాగా మాత్రమె చూడకుండా దాన్లో ఉన్న అర్ధాన్ని గ్రహించాలి.

ఈ నీటి దీపాల గురించి సాయి సచ్చరితలో ఇలా చెప్పబడింది. 

మొదట్లో సాయి సమర్ధులకు దీపొత్సవమ్ అంటే చాలా ప్రీతి. అందుకోసం వారు స్వయంగా దుఖాణదారుల వద్దకు వెళ్లి నూనెను అడిగేవారు. రేకు డబ్బా పుచ్చుకొని నూనె తెచ్చి దీపాలను వెలిగించెవారు. అలా కొన్ని రోజులు ఆగకుండా ఈ ప్రక్రియ సాగింది. దీపారాదన అన్నబాబాకు బహుప్రేమ. దీపావళి వలె దీపోత్సవాన్ని చేసేవారు. చింకి గుడ్డలతో వత్తులు చేసి మసీదులో దీపాలను వెలిగించేవారు. 

రోజూ ఉచితంగా నూనె అడిగి తెచ్చేవారు. దాంతో వ్యాపారుల మనస్సులో దురాలోచన కలిగింది. అందరూ కలిసి బాబాకు నూనె ఇవ్వకూడదని అనుకోని బాబా వచ్చినప్పుడు నూనె లేదని చెప్తారు. బాబా మౌనంగా తిరిగి వస్తారు. అప్పుడు బాబా ఏమిచేస్తారో అని వాళ్ళందరు వింతగా చూడసాగారు. బాబా మసీదులో ఉన్న రేకు డబ్బాను తీసుకోని దాంట్లో ఉన్న కొంచం నూనేను తాగేశారు. ఆ విధంగా బ్రహ్మాఅర్పణ చేసి ఒట్టి నీటిని ప్రమిదలలో పోశారు. తరువాత ఆ నీటిలో పొడి వత్తులను తడిపి అగ్గిపుల్లను గీచి దీపాలను వెలిగించారు. నీటితో దీపాలు వెలగటం చూసి వర్తకులు ముక్కు మీద వేలు వేసుకున్నారు. మేము బాబాతో అబద్దం చెప్పామని వారిలో వారు అనుకున్నారు. కొంచమైన నూనె లేకుండా నీటితో దీపాలు రాత్రంతా వెలగటం చూసి వర్తకులు సాయి అనుగ్రహానికి పాత్రులు కారని అందరు అనుకొన్నారు. బాబా యొక్క సామర్ద్యం తెలియక తప్పు చేసామని వర్తకులు పశ్చాత్తాప పడ్డారు. కాని బాబా మనసుని జయించిన వారు. వారికి రాగద్వేషాలు ఉండవు. వారికి శత్రువులు మిత్రులూ అంటూ లేరు. వారికి అన్ని ప్రాణులు సమానమే. 


ఈ సన్నివేశం లోని అర్థం


ఈ కథలోని అర్ధాన్ని మనం అర్ధం చేసుకోవాలంటే మనం కాకడ ఆరతి గుర్తు చేసుకోవాలి. మనం ఈ అరతిలో ఈ విధంగా పాడుకొంటాము. 

కాకడ ఆరతి కరీతో సాయి నాథ దేవా!చిన్మయ రూపా దాఖవి ఘేవుని బాలక లఘు సేవా!!

హే సాయి ప్రభూ: నీకు కాకడ హారతి అర్పిస్తున్నాను! పసివాడను అయిన నా సేవను ప్రేమతో స్వీకరించి, నీ చిన్మయరూపం నాకు ద్యోతకం అయ్యేటట్టు చేయి దేవా!!





కామ క్రోధ మద మత్సర - ఆటుని కాకడ కెలా!
వైరాగ్యాచే తూప కాడుని మీతో బిజవీలా!  
సాయి నాథుని గురు భక్తి జ్వలినేతోమీ పేటవిలా! 
తద్ వృత్తి జాలునీ గురునే - ప్రకాశపాడిలా!! 

ద్వైతతమా నాసునీ- మిళవీ తత్స్వరూపి జీవా!!!

అరిషడ్ వర్గాలతో ఉన్న నా మనస్సును ఒత్తిగా చేసి,
వైరాగ్యం అనే నేతితో తడిపి, 
నీ ఫైనున్న అనన్య భక్తి అనే జ్యోతిని వెలిగించాను. 
ఆ కాంతిలో నా గురు దేవుడు ప్రకాశవంతంగా కనిపించారు. 
ద్వైతభావం నశించి, తత్స్వరూపిగా జీవుడు మిగిలాడు.  


ఆధ్యాత్మిక భావం

సాయి మనలను అడుగుతున్నది ఏమిటి?

ఈ జీవన వ్యాపారం చేసే వర్తకులం అయిన మననుంచి సాయి అడిగే తైలం ఏమిటి?

ఈ కథలో లాగా మనమందరమూ నూనె వర్తకులమే. ఇక్కడ నూనె అంటే వైరాగ్యము.

బాబా అడిగేది శ్రద్దా సబూరి మాత్రమే. కాని మనం కూడా ఆ వ్యాపారుల లాగా బాబా అడిగిన దాన్ని ఇవ్వము. 

కాకడ అరతిలో చెప్పినట్లుగా కామ క్రోధ లోభ మోహ మద మాత్స్యర్యములను అరిషడ్ వర్గములను వదులుకోలేము. ఈ ఆరింటిని ఒక వత్తిలాగా చేసి, వైరాగ్యం అనే నేతిలో ముంచి, భక్తి అనే భావనతో ఉన్నప్పుడు సాయి సమర్ధులు ఈ దీపాన్ని వెలిగిస్తారు. ఈ దీపం వెలిగించితే, ఇక అజ్ఞానమనే అంధకారం తోలిగిపోతుంది. అప్పుడు మన జీవితం జ్ఞానవంతం అవుతుంది. అప్పుడు జీవుడికి ద్వైత భావన తొలిగిపోయి తనే పరమాత్మననే అనుభూతిలో ఉండిపోతాడు. 

మనం బాబా అడిగిన శ్రద్ద సబూరిలను ఇవ్వక పోయినా సాయి మనలను ఎప్పుడూ క్షమిస్తూనే ఉంటారు. 

ఆయన అపర దయామూర్తి. 

అయన కరుణా పూర్వకమైన చూపులే చాలు మనలను జాగృతం చేయడానికి. 

అయన మనలను అనుగ్రహించే ప్రక్రియలో చూపించే సహనం అద్వితీయం. 

ఒక్కసారి మనం కనుక అయన అడిగింది ఇవ్వడం ప్రారంబిస్తే ఇక సాయి అనుగ్రహానికి అంతే ఉండదు. 
సాయి మనలను మన గమ్యానికి చేర్చిందాక వదలరు. 

సాయి ఎలాగైతే నీటితో దీపాలను వెలిగించారో అలానే ఏ అష్టాంగ సాధనల అవసరం లేకుండా  మనకు ఆత్మసాక్షాత్కారం కలగ చేస్తారు. మనకు కావాల్సిందల్లా సాయిఫై అపారనమ్మకం. 

మనలో ఆ తైలం కాస్తంత తగ్గినా, లేకపోయినా కేవలం నీటితోనే మనలో ఆ దీపాన్ని వెలిగిస్తారు. 

అటువంటి నమ్మకాన్ని మనం కలిగిఉందాము. 

ఎన్ని అడ్డంకులు వచ్చినా ఈ గురు మార్గంలోనే నడుద్దాం. 

సాయి అనే తారక మంత్రాన్ని గట్టిగా పట్టుకుందాం. 



ఓం శ్రీ సాయి రామ్ !      


                                       
   

No comments:

Post a Comment