Wednesday, October 29, 2014

మానసిక పరివర్తన



మన జీవితంలో మార్పు రావాలని మరియు మన నడవడిక  మారాలని బోధించే వారు బాబా. 
ఒక సారి దీక్షిత్కు బాబా ఈ విధంగా చెప్పారు.

 "నువ్వు వేరే వాళ్ళ గురుంచి చెడుగా మాట్లాడినా లేక వాళ్ళ తప్పులు ఎంచినా, నాకు అమితమైన బాధ కలగుతుంది" అని బాబా అనే వారు. 

అప్పట్లో దీక్షిత్ కు కూడా కోపం ఉండేది. తరువాత  కోపాన్ని నియంత్రించాడు. ఒక సారి వాడాలో క్రిస్టియన్ మతం 
గురుంచి మాట్లాడుతూ వారిని  విమర్శించాడు  దీక్షిత్. అదే రోజు బాబా దగ్గరకు వెళ్ళినప్పుడు, దీక్షిత్ తో బాబా మాట్లాడ లేదు. దీక్షిత్ తన తప్పు తెలుసుకొని, బాబా ను క్షమించమని మనసులోనే ప్రార్ధిస్తాడు.
అప్పుడు బాబా "ఎవరిని నిందించ వద్దు" అని ప్రేమతో చెప్తారు.

ఒకసారి  దీక్షిత్ రోజు తను చేసుకునే  పూజ చేసుకొని బాబాకు తాంబూలం ఇవ్వడం మరిచాడు. తరువాత బాబా దగ్గరకు వెళ్ళితే, బాబా వెంటనే "నాకు ఈ రోజు తాంబూలం ఇవ్వ లేదు " అని అంటారు. అప్పుడు దీక్షిత్ కు
సాయి యొక్క సర్వజ్ఞత అర్ధం అవుతుంది. ఇక నుంచి నేను మనస్పూర్తిగా బాబాకు పూజ చెయ్యాలి అని అనుకొంటాడు. ఎక్కడ పూజ చేసినా బాబానే స్వయంగా ఎదురుగా ఉన్నారు అన్న భావనతో ప్రార్ధన చేసేవాడు.

సాయి బంధువులారా! 
చూసారా దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. 

యద్భావం తద్భవతి అని అంటారు. సాయి ఎప్పుడూ మనలను ఒక కంట కనిపెట్టి  ఉంటారు. మనలో నమ్మకం దృడంగా ఉండాలి.

అలానే దీక్షిత్ కూతురు చనిపోయినప్పుడు, బాబా చావు పుట్టుకల గురించి చెప్పి, తనలో వ్యామోహం పోగొట్టారు. 

ఇంకోసారి దీక్షిత్  ఒక కేసు గెలిచి దాదాపు 1000 రూపాయలు ఒక ట్రంకు పెట్టెలో తెచ్చి, బాబాకు ఇదంతా నీదే బాబా అని చెప్పాడు. అప్పుడు బాబా ఆ డబ్బంతా క్షణాల్లో పంచి పెట్టారు.
కాని  దీక్షిత్ లో ఎటువంటి వ్యామోహం కనిపించదు. 

ఇలా బాబా ఒక్కో విషయంలో దీక్షిత్ లో మానసిక పరివర్తన తెచ్చి, మెల్లగా తనను ముక్తి పధం వైపు నడిపించారు. తరువాత అతనికి బాబా ఒక కఫిని కూడా ఇచ్చారు.  దీక్షిత్ ఆ కఫినీని షిర్డిలో ఉన్నప్పుడు ధరించేవాడు. 

మనం బాబాను పూర్తిగా నమ్మితే మనలో కూడా ఈ మానసిక పరివర్తన వస్తుంది.


        ఓం శ్రీ సాయి రాం

No comments:

Post a Comment