Wednesday, April 1, 2015

జీవన విధానం



నానా! ఈ సంసారంలో ఎలా  వ్యవహరించాలో విపులంగా చెప్తాను జాగ్రత్తగా వినమని బాబా ఈ క్రింది విధముగా కొనసాగించడం జరిగింది.

దేహ ప్రారబ్ధం వలన ఏ స్థితి లభించిందో దాన్ని ఆనందంగా అనుభవించాలి. ప్రారబ్ధ వశంగా ఇతరులకు కల్గిన స్థితిగతుల కోసం ప్రాకులాడకూడదు. 

భార్యపుత్రులు, పుత్రికలు దాసదాసీజనులు మొదలైన వారందరు దేహప్రారబ్ధం వల్లనే ప్రాప్తించారు. వారితో  ప్రీతితో మెలగాలి. వీళ్ళందరు నా వాళ్ళు అన్న అభిమానం ఉండరాదు. అది జనన మరణాలకు కారణభూతమౌతుంది. ఎందుకంటే దేహ ప్రారబ్ధమంతా ఇక్కడే పూర్తి కావాలి. ఆ కీర్తి అంతా కేవలము ఆ జన్మ ప్రారబ్ధానిదే.

బందుమిత్రులు, బార్యాపుత్రులు  ఈ జన్మకు చెందినవారే, వారు ఏ జన్మలో వస్తే ఆ జన్మలోనే పోతారు. ముందు జన్మకు సంబంధించిన వారెవరు? ఎక్కడ? అంటే తెలియదు. కాని వాసన బలం మాత్రము మనలను విడవక బద్ధులను చేస్తుంది.  విషయ వాసనలే తర్వాత జన్మకు కారణం అందువల్లనే మనం కర్మలు యందు మోహాన్ని పెంచుకొనకుంటే తర్వాత అక్షయ సుభలాభాలు  చేకూరుతాయి.
ఎలగైతే ధర్మసత్రంలో బసచేసి, అవసరం తీరిన తరువాత దాని మీద ఏ విధమైన వ్యామోహము పెంచుకొనకుండా విడిచిపోతామో, అదే  విధముగా ఈప్రపంచం కూడా ధర్మసత్రం లాంటిది. తదనుగుణంగా మన కర్తవ్యమును నిర్వర్తించాలి. ఈ కర్తవ్యమును నిర్వర్తిస్తూ సచ్చిదానందుడైన ఈశ్వరుని గుర్తించాలి.

తన స్వంత పుత్రుడిని మరొకరి పుత్రుడిని సృస్టించేది ఒక్కడే. మనము మన పిల్లల భారాన్ని మోసినా కాని, నేనే వారి పాలన, పోషణ చూస్తున్నాను. నేను చదువు చెప్పిస్తున్నాను అనే అహంభావనను వదలాలి. మనం పనులను చేస్తూ ఈశ్వరునికి సమర్పించి నిర్లిప్తంగా వుండగలగాలి.  

పురుషార్ధం : మనకున్న పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రతివిషయం యొక్క మంచి చెడులను గురించి పూర్తిగాతెలుకోవాలి.
మంచి వాటిని గ్రహించి చెడువాటిని వదిలివేయాలి. సత్కార్యాలు చేపట్టి వాటిని ప్రయత్నంతో పూర్తి చేయాలి.
మరణించిన తరువాత కీర్తి రూపంలో ఈ ప్రపంచంలో ఉండాలి. కర్తృత్వము భావన లేకుండా కర్మ చేయగలగాలి. దీనినే పురుషార్ధం అంటారు.

కర్తృత్వము వలన కలిగిన అభిమానమును భగవంతునికి అర్పణా చేయాలి.
కర్తృత్వమునకు తగ్గ ఫలము లభించినపుడు అభిమానంతో వినమ్రతతో ఉండాలి.

అస్తిత్వము వున్నంత వరకు దేహాన్ని రక్షిస్తూ ఉండాలి. కాని మరణం గూర్చి వ్యధ చెందడం వృధా. పంచభూతముల నుండి అరువు తెచ్చుకొని ఈ దేహం ఏర్పడుతుంది. ప్రాణం పోగానే వాటిలో అవి కలిసిపోతాయి. వాయువు వాయువులో కలిసిపోతుంది. శరీరం పృద్థ్వి యొక్క భాగము. దాన్ని గురించి శోకించుట వ్యర్ధము. అలాగే జన్మించినప్పుడు కూడ హర్షమునొందరాదు. అది సృష్టి వ్యవహారము అని తెలిసికుని స్వస్థులై ఉండాలి.

భూమిలో బీజము ఉంది. మేఘము వర్షాన్నిస్తుంది. సూర్యుని వలన మొక్కలు మొలకెత్తుతాయి. అది చూచి భూమి, మేఘము, సూర్యుడు ఆనందంతో నాట్యం చేయవు కదా! చిన్న మొక్క పెద్ద మానుగా మారిన లేదా  కాలిపోయినా పంచభూతములు సంతోషంగాని దుఃఖం గాని వ్యక్తము చేయవు. సుజ్ఞానులు వీటికి అతీతంగా ఉంటారు. మనం కూడా అలాగే ఉండాలి. అప్పుడిక సుఖదుఃఖాలు ఎలా కలుగుతాయి. సుఖదుఃఖాల పట్ల ఆభావం ఏర్పడటమే ముక్తి స్థితి.

అన్నదానం మూడు రకాలు (విశేష, నిత్య మరియు కార్య కారణాలు)
1) విశేష కారణం :  కాలం అనుకూలించి ధనం బాగా సంప్రాప్తించినపుడు వేయిమందికైన అన్నదానం చేయాలి.
అన్నదానం చేసేటప్పుడు ఉచ్చనీచాలు, మంచిచెడులు చూడకూడదు. అన్నదానానికి అందరూ యోగ్యులే.
సత్రాలలో కూడా అలాగే యధాశక్తి అన్నధానం చేయాలి. అప్పుచేసి మాత్రం అన్నదానం చేయకూడదు.
2) నిత్యాన్నదానం  :  స్వీకరించుటకు యోగ్యులు ఎవరు అనేది కూడా నీకు చెప్తాను. బాటసారి, తాపసి, సన్యాసి, ఆకలిగొన్నవాడు. వీరందరూ నిత్యాన్నదానానికి యోగ్యులు.
3) కార్య కారణం : పెండ్లి, ఉపనయనము, ఆప్తులు, సఖులు, సగోత్రులు మొదలైన వారిని పిలిచి బహు ఆదరణంగా బోజనం పెట్టాలి.
వస్త్ర దానానికి కూడా ఇవే నియమాలు.

వీటిని కల్పాంతములో కూడ మరువవద్దు. శక్తి కొలది ఇతరుల బాధలను నివారించడంలో సాయిపడాలి.
సత్తా ఉన్నదని దాన్ని దుర్వినియోగించరాదు.
న్యాయస్థానంలో ఉన్నప్పుడు భ్రష్ఠాచారము చేయకూడదు.
అప్పచెప్పినటువంటి కార్యాన్ని ఉత్తమ రీతిలో పూర్తి చేయాలి.
ఎంత అవసరమో అంతవరకే దుస్తులు ధరించాలి. లోకులు చూస్తున్నారని అతి అలంకరణలకు పోరాదు.
దుష్టులను మనసు నుండే గుర్తించాలి.
               
కామాన్ని అదుపులో ఉంచాలి. దాని ప్రభావానికి లోనుకాకూడదు. ఇలా నడచినవాడు బుద్ధిమంతుడు. దేహప్రారబ్దాన్ని అనుభవించేటప్పుడు ఈ అరిషడ్వర్గాలు ఎంత మోతాదులో అవసరమో అంత వరకే ఉపయోగించాలి. ఎల్లప్పుడు హరినామాన్ని జపిస్తూ అవినీతి పైకి మనస్సును పోనీయక, అంతరంగాన మోక్షాసక్తి కలిగి, మనస్సును పరమార్ధము వైపు మళ్ళించాలి. దుష్ర్కత్యాల యందు విరక్తి కలిగి భక్తి భావముతో,  ఈశ్వరుని నీవాడిగా చేసుకోవాలి. మదానికి తానీయకూడదు. సత్పురుషుల కధాశ్రవణము, శుద్ధమైన మనస్సుతో జ్ఞానులను ఆదరించడం, తల్లిదండ్రుల యెడల గౌరవ భావం కలిగి ఉండటం అవసరం.

కొన్ని రోజుల తరువాత నానా మరల షిర్డి వచ్చి బాబాను దర్శించి, బాబా నాకు నీవు ఇంతకు ముందు ఏ బోధ చెయ్యదలచుకున్నావో దాన్ని ఇప్పుడు ఉపదేశించవలసినది అని ప్రార్ధించాడు.
 అప్పుడు బాబా  ఇలా  చెప్పారు : 
నేను చెప్పేదాని మీద లక్ష్యం ఉంచి విను. సుఖదుఃఖ రూపమైన సంసార బంధనాశనమే ముక్తి స్థితి. ఆ స్థితి కలిగేందుకు నేను చెప్పిన ప్రకారము నడుచుకో! దేహప్రారబ్ధము సంభవించినపుడు సద్విచారముతో సదా జాగృతిలో ఉండవలెను. దానిని ఎంత మాత్రము వదిలిపెట్టకూడదు. సహజస్థితిలో ఏమేమి జరుగుతాయో అవన్నీ అక్షరాల దేహప్రారబ్ధం కానేరదు. ఉదాహరణకు కొందరు దొంగతనము చేస్తారు. ఆ చేసిన పనికి శిక్షను అనుభవిస్తారు. ఆ అనుభవము దేహప్రారబ్ధము కాదు.

విషము పుచ్చుకుంటే మరణం సంభవిస్తుంది. ఇది చేసుకొన్న దాని ఫలితం. యజమానిని మోసగించి ఆ డబ్బుతో సేవకుడు తాను యజమాని కావచ్చు. ఇవి దేహ ప్రారబ్దానికి సంభందించినవి కావు. జీతగాడు ధనికుడైన తర్వాత వాడు ఆనందంతో బండ్లు కొనుక్కొని సుఖంగా ఉన్నాననుకుంటాడు. కానీ యజమానిని మోసగించిన కర్మ ఫలితం అతనిని వెంటాడుతుంది. ఆ సంచితాన్ని అతను వచ్చే జన్మలో అనుభవించక తప్పదు. సంచితము క్రియా రూపంలో ఉన్నప్పుడు జన్మనెత్తవలెను. బుద్దిమంతులైన వారు ఇది తెలుసుకుంటారు. మూర్ఖులు పట్టించుకోరు.

దేహప్రారబ్దము వలన అతనికి జీతగాడి వృత్తి లభించింది. అది మరో జన్మకు కారణ భూతమైనది. ఈ జన్మలో ఏం చేశాడయ్యా అంటే రాబోయే జన్మకు పీఠం వేశాడు. ఈ జనన మరణ యాత్ర ఎట్లా తప్పించుకుంటాము. కొందరు ఉన్నత పదవులలో ఉంటూ అదికారం చెలాయిస్తారు, కొందరు ప్రపంచమంతా తిరుగుతూ ప్రవచనాలు చేస్తుంటారు, కొందరు యోగులవుతారు, కొందరు దుకాణాలు పెడ్తారు, కొందరు ఉపాధ్యాయులై పాఠశాలలో పిల్లలను చదివిస్తారు.

ఉపాధ్యాయుడు, దుకాణము, యోగి, వ్యాఖ్యాత, అధికారి నిజానికి వీళ్ళంతా పదవీదారులే. అయినా, ఈ వేర్వేరు ఉద్యోగాలు ఎందుకు కలిగాయో చెప్పగలవా? 
ఇవన్నీ కూడా దేహ ప్రారబ్ధ్యోగమే. కర్మఫలం వలన లభించేవి కావు. 

అప్పుడు నానా ఇట్లడిగాడు.
దొంగతనం చేసి దొంగవుతాడు. అక్కడ మాత్రం కర్మఫలం అంటున్నారు. ఇక్కడ దేహ ప్రారబ్ధమంటున్నారు. దీన్ని కొంచెం విడమరచి చెప్పండి.
బాబా : నారాయణా! పిచ్చి కల్పనలు మాని ప్రశ్నించు.
కొందరు దొంగతనం చేసి, తెలివిగా ఆ నేరాన్నుండి బయటపడ్తారు. కొందరు కటకటాల్లోకి వెళ్తారు. మరికొందరు తప్పించుకుని పెద్దమనుషుల్లా తిరుగుతుంటారు. దీంట్లో కర్మఫలమంటే దొంగతనమే. ఒకడు బయట పడతాడు. ఒకడు శిక్షను అనుభవిస్తాడూ. దేహప్రారబ్ధము కర్మఫలానికి అతీతము. బయటపడ్డ దొంగను కర్మఫలం విడువదు. అది తరువాత జన్మకు కారణభూతమవుతుంది. అందువల్ల నీకు చెప్పేది ఏమంటే దేహప్రారబ్ధము అనుభవించేటప్పుడు జాగరూకుడై నీతిని పాటించాలి. అంటే ఏం చేయాలి? సజ్జనుల సాంగత్యము చెయ్యాలి. సంతుల సముఖంలో కూర్చోవాలి. దుష్టులు, దుర్జనులు, భక్తిలేని వాళ్ళ చాయకు కూడా పోగూడదు. అభక్ష్యములను భక్షించకూడదు. వాదాలకు, వంతులకు పోవద్దు. సత్యాన్ని అంటిపెట్టుకో దైవం సంప్రీతుడౌతాడు.
ఒక్కసారి ఎవరికైనా మాటిస్తే దానిని తప్పక నెరవేర్చు. మాట తప్పిన వారికి దైవం దూరం అయిపోతాడు.

ఈశావాశ్యోపనిషత్తులో ఈ విధంగా చెప్పబడుతుంది. 
మనము కర్మలు చేస్తూనే వందేళ్ళు బ్రతకాలి. వేరేదారే లేదు. ఈ శరీరం ఉన్నంత వరకు కర్మలు జరుగుతూనే ఉండాలి.

అయితే ఏ కర్మలు ఆచరించవచ్చు, ఎట్లా చేయవచ్చు.
మనము ఆగామి కర్మలు ఆచరించేటప్పుడు వెంటనే ఫలితాన్ని ఇచ్చే కర్మలు మనము చేయవచ్చు. తర్వాతి కాలంలో ఫలితాన్ని ఇచ్చే కర్మలపట్ల జాగ్రత్త తీసుకోవాలి. ఆగామి కర్మలను కర్మయోగం ద్వారా నిర్వర్తించాలి.

ప్రారబ్ధకర్మలను భక్తియోగం ద్వారా అనుభవించడం, సహించడం నేర్చుకోవాలి.

సంచిత కర్మలను మనము ఏమి చేయలేము. కాని గురుకృప ద్వారా జ్ఞానము ద్వారా వాటిని దూరం చేయవచ్చు.

మనం కర్మలాచరించినప్పుడు వాటిపై ఎటువంటి మోహం లేకుండా వాటిని పరమేశ్వరునికి సమర్పించి నిర్వర్తించినచో మనం వాటి నుంచి బయటపడవచ్చు.


No comments:

Post a Comment