Wednesday, November 4, 2015

మహాల్సాపతి - 4 (జిజూరి యాత్ర మరియు దేహత్యాగము)



Play Audio




జిజూరి యాత్రలో సహాయం
ఒకసారి మహల్సాపతి మరియు ఆయన బృందం జిజూరి యాత్రకు గుర్రాలపై బయలుదేరారు. పోలీసులు వాళ్ళను మధ్యలో ఆపి అనుమతి పత్రం లేదని వారిలో ఒకరిని ఆపటం జరిగింది. అందుకని వారు ముందుకు వెళ్ళలేక పోయారు. ఆ అనుమతి పత్రంలేని వ్యక్తి ఆ ఊరు కరణం దగ్గరకు వెళ్ళి అనుమతి పత్రం కోరడం జరిగింది. ఆ కరణం వాళ్ళకి కట్టెలు కొట్టే పని అప్పచెప్పాడు.

            ఆయన ఎవరికి సహాయం చేసే వ్యక్తి కాదు. స్వార్ధంతో ఆ మనిషి చేత కట్టెలు కొట్టించాలని ఒక గొడ్డలని ఇచ్చాడు. కాని దాని కర్ర విరిగి పోయింది. అట్లా రెండు మూడు సార్లు విరిగింది. అప్పుడు ఆ కరణం "భగవంతుడు నిన్ను పని చేయనివ్వటం లేదు" అని అనుమతి పత్రం ఇచ్చి పంపించారు.

            ఇంకొకసారి మహల్సాపతి బృందం 150 మైళ్ళు నడిచి జిజూరి చేరారు. కాని అప్పుడే ప్లేగువ్యాధి ప్రభలిపోయి ఉంది. అలా వారు ఊరిలోకి వెళ్ళలేక దిగాలుగ పల్లకికి ఆనుకొని కూర్చున్నారు. ఇంతలో బాబా దర్శనం అవుతుంది. అప్పుడు ఆయనకు ధైర్యం కలిగి ఆ ఊరిలోకి ప్రవేశిస్తారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా మరల షిర్డికి తిరిగి వస్తారు. వచ్చిన తరువాత బాబాని కలిస్తే బాబా ఇట్లా అన్నారు. నువ్వు పల్లకిని ఆనుకొని కూర్చున్నావు. అప్పుడు నీకు ధైర్యం చెప్పాను.

            మహల్సాపతి ప్రతి సంవత్సరం జిజూరిలో ఉన్న ఖండోబా ఆలయానికి పల్లకి తీసుకుని 150 మైళ్ళు ఊరేగింపుగా వెళ్ళడం ఆనవాయితి . అట్లానే ఒక సంవత్సరం తన తోటి భక్తులతో కలిసి జిజూరి వెళ్ళడం జరిగింది. వాళ్ళు తిరిగి వచ్చేటప్పుడు మరొక బృందము కూడా వాళ్ళ వెనుక రావడం జరిగింది. ఆ బృందంలో మిలామి భగత్ పిల్కి అను భక్తుడు ఉన్నాడు. వాళ్ళకు మార్గం మధ్యలో కొందరు బందిపోటు దొంగలు ఎదురు పడటం జరిగింది. వాళ్ళ దగ్గర గండ్రగొడ్డళ్ళు ఉన్నాయి. వాళ్ళు ఈ బృందాలను దోచుకోవడానికి వచ్చారు. అప్పుడు మహల్సాపతి వాళ్ళపై తన దగ్గర ఉన్న రంగోలిని ప్రసాదంగా వాళ్ళపై జల్లడం జరిగింది. అప్పుడు వాళ్ళు ఏమి చేయకుండా చెట్లలోకి వెళ్ళడం చూసి ఈ బృందాలు మెల్లగా జారుకున్నాయి. కొంచం దూరం వెళ్ళిన తరువాత చూస్తే ఆ పల్లకిలో విగ్రహంలేదు. మనము దేవుడు లేని పల్లకి మోస్తున్నాము అనుకొన్నారు. ఆ రోజు ఆదివారం, వాళ్ళ ఆచారం ప్రకారం అయితే పల్లకిని ఆ రోజు మోయకూడదు. అప్పుడు ఖండోబా మహల్సా ఒంటి పైకి వచ్చి "ఈ రోజు పల్లకి మోయవద్దు. నేను ఈ రోజు కొండ మీద వేటకు వెళ్తున్నాను" అని ఖండోబా చెప్పారు. వేట అవ్వగానే నేను షిర్డికి వస్తాను, మీరు వెళ్ళండి అని ఖండోబా మహల్సాపతి ఒంటి మీద నుంచి వెళ్ళడం జరిగింది. వారు పల్లకితో  సహా షిర్డి వచ్చారు. శాఖారాం కండూకర్ మొదలైన వారు పల్లకి చూడడానికి వచ్చి పల్లకిలో అన్ని విగ్రహాలు ఉండడం చూసి, మహల్సాపతిని ఇలా అడిగారు. విగ్రహాలు పోయాయని చెప్పారు. మరి విగ్రహాలు ఉన్నాయి కదా! షిర్డికి రాగానే విగ్రహాలు వాటంతట అవే ప్రత్యక్షం అవడం బాబా లీల కాక ఇంకేమయి ఉంటుంది. అని అందరు అనుకున్నారు.

            ఇలా బాబా ఎన్నోసార్లు మహల్సాపతి వెన్నంటే ఉండి ఒక రక్షణ కవచంలాగా రక్షించడం జరిగింది. మనము ఎప్పుడైతే బాబాకు శరణాగతి చేస్తామో, అప్పుడు బాబాతో మనకి రుణానుబంధం ఏర్పడుతుంది. బాబా తన భక్తులను రక్షించడంలో తన శరీరాన్ని కూడా లెక్క చేయని ఘటనలు కూడా మనము చూశాము.
  
            బాబా త్రికాల జ్ఞాని. మహల్సాపతి తన రెండో కొడుకు పుట్టిన తరువాత (1899) బాబా దగ్గరకు వెళ్ళి, పిల్లవానికి నామకరణము చేయమని అర్ధించాడు. అప్పుడు బాబా భగత్, నీవు ఈ పిల్లాడిని 25 సంవత్సరాలు పోషించు అది చాలు ఈ విషయం మహల్సాపతికి అప్పట్లో  అర్ధంకాలేదు. ఆ తరువాత మహల్సా రెండవ కొడుకు  25 సంవత్సరాలు మాత్రమే బ్రతికి ఉన్నారు.

            ఒకసారి మహల్సాపతి బాబా దగ్గర ఉన్నప్పుడు బాబా ఇట్లా చెప్పారు. "అరె భగత్ ఇంకా కొద్ది రోజులలో నేను ఒక చోటికి వెళ్తున్నాను. ఆ తరువాత నీవు రెండు నుంచి నాలుగు సంవత్సరాలు ఇక్కడ నిద్రకు వస్తావు." బాబా మాటలు సరిగ్గా అర్ధం కాలేదు మహల్సాపతికి. అట్లానే మహల్సాపతి 1918 బాబా మహాసమాధి తరువాత, 1922 దాకా రాత్రిపూజ నిర్వహించడం జరిగింది. బాబా మహాసమాధి అయినప్పుడు మహల్సాపతి కనీసం 13 రోజుల వరకు ఏమీ తినకుండా ఉండటం జరిగింది. మరి మహల్సాపతి 40 సంవత్సరాలు బాబాతో నిద్రించి ప్రతి పనిలో బాబాకి సహకరించిన తీరు మనకు తెలిసినదే. మహల్సాకు ఇది ఎంతటి కష్టమైన విషయమో మనము వేరే చెప్పవలసిన పనిలేదు.

            అటువంటి మహానుభావుడుకి మరణించిన తరువాత సద్గతి కలుగకుండా ఎందుకు ఉంటుంది. మన సాయినాధుని అపారకృపకు పాత్రుడు కాకుండా ఎందుకు ఉంటాడు. అందుకే ఆయన దేహత్యాగము భాద్రపద శుద్ధఏకాదశి సోమవారం దేహాన్ని వదలడం, అది కూడా పూర్తి స్పృహతో, రామనామ జపం వింటూ ప్రాణం వదలడం అనే భాగ్యం ఎంతమందికి కలుగుతుంది. అది సెప్టెంబర్ 11, 1922 వ సంవత్సరం ఆ రోజున తన తండ్రికి శ్రాద్ధకర్మలు నిర్వర్తించి వచ్చిన వారికి భోజనాలు పెట్టి తన బంధుమిత్రులతో కూర్చుని ఉన్నారు. తాంబూలం వేసుకుని బాబా ఇచ్చిన కఫిని ధరించి కూర్చున్నారు. అక్కడ ఉన్న తన స్నేహితులైన బాలా గురవ్ మరియు రామచంద్రకోతె లాంటివారిని రామనామ జపం చేయమని అడిగారు. అప్పుడు తన కొడుకును పిలిచి తన దగ్గర ఉన్న చిన్న కర్రను ఇచ్చి ఈ విధంగా చెప్పారు. "ఎప్పుడూ ధర్మ మార్గంలో జీవించు. భక్తియే ఉత్తమ మార్గము, నేను చెప్పింది అంతా జరుగుతుంది."


            అందరూ రామ భజన చేస్తూ ఉంటే అది వింటూ, తనూ రామ! అనే శబ్ధాన్ని పలుకుతూ తన చివరి శ్వాస వదిలి ప్రాణాన్ని వదిలేశారు. ఆయన బాబా కృపతో ఎంతో సునాయాసమైన మరణాన్ని పొందటం జరిగింది. అదియును కాక ఆయన ముందుగానే నేను స్వర్గానికి వెళ్తున్నాను అని అదేరోజు అక్కడ ఉన్నవారికి కూడా చెప్పారు. ఆయన చేసిన సేవ, నడిచిన ధర్మమార్గము, అత్యంత భక్తి ఆయన్ని పరమపథానికి చేర్చాయి.


ఓం శ్రీ సాయి రామ్ !

No comments:

Post a Comment