Wednesday, February 24, 2016

ఖపర్డె - దాదాసాహెబ్ -1



Play Audio



శ్రీ సాయి సచ్చరిత ద్వారా మనకు బాబా గురించిన విషయాలు చాలా తెలుస్తాయి. ఖపర్డె గారు వ్రాసిన డైరి సాయి భక్తులందరకు ఒక గొప్ప వరం. ఎందుకంటే ఆయన బాబా దైనందిన కార్యక్రమం మరియు బాబా చూపిన కరుణ, దయ మొదలగు అంశాలను ఉన్నది ఉన్నట్లుగా వర్ణించారు. బాబా చెప్పిన కథలను యధాతధంగా చెప్పారు. ఖపర్డె గారు సంస్కృత మరియు ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగిన వ్యక్తి. ఆయన భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో బాలగంగాధర్ తిలక్ గారికి కుడి భుజం లాగా వ్యవహరించారు. ఆయన యొక్క ఆశయాలకు రూపకల్పన చేసి అవసరం అయినప్పుడు తన న్యాయవాద వృత్తితో అందరికి సహాయపడ్డారు. ఖపర్డె గారు బాబా గురించి విని షిర్డి రావడం జరిగింది. ఆయనను బ్రిటిష్ ప్రభుత్వం ఒక విప్లవకారుడిగా పట్టుకోవాలని చూస్తారు. కాని షిర్డిలో బాబా రక్షణలో కొన్ని రోజులు ఉంటారు. బాబా తన భక్తులను ఎట్లాంటి పరిస్థితుల నుంచైన కాపాడతారు.

                   ఖపర్దెగారి పూర్తిపేరు గణేశ్ శ్రీ కృష్ణ ఖపర్డె. ఆయన ఆగస్టు 27, 1854వ సంవత్సరంలో ఇంగ్రోలి అనే ఊరిలో జన్మించారు. అప్పట్లో ఇది బెరార్ అనే ప్రదేశంలో ఉండేది.  ఆ తరువాత ఈ ప్రాంతం మహరాష్ట్రలో కలిసింది. దీన్ని నిజాం రాజులు కూడా పాలించారు. ఖపర్డె తండ్రి గారు పేరు శ్రీ కృష్ణ నరహరి. ఖపర్డె గారు వినాయక చవితి రోజు జన్మించారు. అందుకే ఆయనకు గణేశ్ శ్రీ కృష్ణ ఖపర్డె అని నామకరణం చేసారు.
    
                 ఖపర్డె గారి విద్యాబ్యాసం నాగపూర్ మరియు అమరావతిలో జరిగింది. ఆయనకు సంస్కృత భాష అంటే చాలా మక్కువ. అకోల అనే ఒక చిన్న గ్రామంలో ఒక పండితుడి దగ్గర ఖపర్డె సంస్కృతం నేర్చుకున్నారు. అట్లానే ఇంగ్లీషులో కూడా ఆయనకు మంచి పట్టు ఉంది. కొన్నాళ్ళు ఎల్ఫిన్‌స్టన్ కాలేజీలో టీచర్‌గా పనిచేసి, 1884లో లా చదివి డిగ్రీ సంపాదిస్తారు. తరువాట క్రిమినల్ లాలో మంచి ప్రాక్టీస్‌తో ప్రముఖ న్యాయవాదిగా పేరు సంపాదిస్తారు. కపర్డె ఆదాయం ఆ రోజుల్లోనే దాదాపు సంవత్సరానికి లక్ష రూపాయలు ఉండేది.
               
ఖపర్డె గారికి ముగ్గురు కుమారులు. ఖపర్డె గారికి డైరి వ్రాయడం చాలా ఇష్టం. ఆయన వ్రాసిన డైరీలను నేషనల్ మ్యూజియంలో ఉంచడం జరిగింది. బాబా ఆయనను దాదాసాహెబ్, సర్కార్ అనే పేర్లతో పిలిచేవారు. ఆయన శ్రీమతి కూడా మంచి సంస్కారంతో తన ధర్మాన్ని నిర్వర్తించేది. ఆమె కూడా బాబాను సేవించడం జరిగింది. ఆమె పేరు లక్ష్మీబాయి ఖపర్డె. ఆమె పెద్దగా చదువుకో పోయినా మంచి సదాచార సంపన్నురాలు. ఆమెకు రామాయణ, మహభారతాలు మరియు కీర్తన కారులు గురించి, పాండవ ప్రతాపము మరియు శివలీలామృతము అనే గ్రంధాలపై ఆమెకు మంచి పట్టు ఉంది. అప్పట్లో ఖపర్డె గారి ఇల్లు చాలా మందితో కళాకళాలాడుతూ ఉండేది. దాదాపు ఇంట్లో 50 మంది దాకా మనుషులు ఉండేవారు.  ఖపర్డె గారి ముగ్గురు పుత్రులు, వారి భార్యలు, పిల్లలు, వేరే 3 కుటుంబాలు, 12-15 మంది చదువుకునే విద్యార్ధులు, ఇద్దరు వంటవాళ్ళు, వారి కుటుంబాలు, ఇద్దరు గుమస్తాలు, గుర్రాల దగ్గర పనిచేసే పనివాళ్ళు, 2 ఎద్దులబండ్లు, వాటిని నడిపేవారు, ఇలా ఎంతో మంది ఆ ఇంట్లో నివసిస్తూ ఉండేవారు. ఎప్పుడు ముగ్గురు అతిధులకు తక్కువ లేకుండా ఆ ఇల్లు కళకళలాడుతూ ఉండేది. మరి ఇవన్ని చూసుకోవాల్సిన బాధ్యత శ్రీమతి ఖపర్డె గారి పైన ఉంది. ఆమె ఎవరి మధ్య భేదము లేకుండా అందరిని ప్రేమతో చూసుకొనేవారు. ఇంతమంది పనివాళ్ళు ఉన్నా ఆమె స్వయంగా వంటచేసి పిల్లలందరికి తినిపించేవారు.

                 ఒకసారి తమ ఇంట్లో చదువుకునే నీల్‌కరి అనే విద్యార్ధికి ఒక కురుపు వచ్చి బాగా జ్వరం వస్తుంది. ఆ కుర్రవాడికి ఆసుపత్రిలో ఉండి సేవచేసిన విధానము ఆమె వ్యక్తిత్వాన్ని చాటిచెప్పింది. ఆ కుర్రవాడు "లక్ష్మీబాయి అమ్మగారు చేసిన సేవ మా అమ్మకూడా చెయ్యగలిగేది కాదు. ఆమె లేకపోతే నేను చనిపోయి ఉండేవాడిని" అని చెప్పాడు. ఆమె ఎవరికి లేదనకుండా ఇచ్చేవారు. ఖపర్డెకు చిన్నవయసులోనే పెళ్ళి జరిగింది. పెళ్ళి అయిన తరువాత ఆయన లా చదవడం జరిగింది. ఖపర్డె తండ్రిగారు తహసిల్దార్ పనిచేసారు. ఇలా వారి కుటుంబం ఎంతో ధనవంతులైన, సంస్కారాన్ని ఎన్నడూ వదలలేదు.
 
                 ఖపర్డె గారు చాలా మంచి వక్త, ఆయనకు తిలక్ గారి సిద్దాంతాలు బాగా నచ్చాయి. వీరు చాలా మంచి మిత్రులై ఖపర్డె గారు బాల గంగాధర్ తిలక్ గారికి ముఖ్యమైన అనుచరుడుగా ఉన్నారు. జూన్ 24, 1908లో తిలక్ గారిని బ్రిటిష్ ప్రభుత్వం అరెస్టు చేసి జైలులో పెడతారు. ఆయనకు ప్రజలను రెచ్చకొట్టినందుకు 6 సంవత్సరాలు శిక్ష
విధించారు. అప్పుడు ఖపర్డె గారు లండన్ వెళ్ళి మరి ఈ విషయం మీద అప్పీలు చేసారు. ఈ ప్రయత్నంలో తన సొంత డబ్బు చాలా ఖర్చుచేసారు. ఆయన దాదాపు 2 సంవత్సరాల 82 రోజులు ఇంటికి దూరంగా ఉన్నారు.  జాతీయ కాంగ్రెస్‌లో ముఖ్యమైన లాలా లజపతిరాయ్, బిపిన్ చంద్రపాల్ వంటి ప్రముఖులతో మంతనాలు చేసేవారు. పోరాటాన్ని చాలా గుప్తంగా బ్రిటిష్ ప్రభుత్వంకు తెలియకుండా సమాచారాలు చేరేటట్లు చేసేవారు. జాయింట్ పార్లమెంటరి కమిటీలో సభ్యుడుగా 1919 - 20లో లండనులో సమావేశానికి వెళ్ళారు. ఇలా ఎన్నో బాధ్యతలను నిర్వర్తిస్తూ తిలక్ గారు నడిపిన స్వాతంత్ర పోరాటానికి సూత్రదారులయ్యారు. 

సాయితో మొదటి కలయిక
దాదాసాహెబ్ ఖపర్డె గారు మొత్తం 5 సార్లు షిర్డికి రావడం జరిగింది. మొట్టమొదటి కలయిక డిసెంబర్ 5, 1910లో జరిగింది. ఆయన 7 రోజులు షిర్డిలో ఉన్నారు. ఈ కలయిక గురించి ఆయన తన డైరీలో వ్రాసుకున్నారు.

                 ఖపర్డె గారు పూనాకు వెళ్ళి, బొంబాయికి వచ్చి తన పెద్ద కుమారుడైన బాలకృష్ణతో కలిసి డిసెంబర్ 5, 1910 న మొట్టమొదట షిర్డిలో కాలుపెట్టారు. వారిని సాఠె వాడలో ఉంచి, శ్యామా అతిధి మర్యాధలు చేసాడు. అదే సమయంలో తాత్యాసాహెబ్ నూల్కర్ గారి కుటుంబం మరియు బాబాసాహెబ్ సహస్ర బుద్దె గారి కుటుంబం వాడాలో ఉన్నారు. వెంటనే అందరూ కలసి బాబాను దర్శించేందుకు మసీదుకు వెళ్ళారు. బాబాకు నమస్కరించి వారు తెచ్చిన పండ్లను బాబాకు సమర్పించారు.

                 బాబా వారి దగ్గర నుంచి కొంత దక్షిణ అడిగి తీసుకుంటారు. అప్పుడు బాబా ఇలా చెప్పారు. రెండు సంవత్సరాలకు నాకు బాగుండలేదు. నేను బార్లి మరియు మంచినీరు మాత్రమే తీసుకున్నాను. ఈ కాలు మీద పుండు ఉంది. అది ఒక చిన్నతీగ పాము ద్వారా వచ్చింది. దాన్ని తీయటానికి ప్రయత్నించినప్పుడు కొంచెం తీగ లోపల ఉండిపోయింది. తరువాత మళ్ళీవచ్చింది. అది నా సొంత ఊరికి వెళ్ళిందాకా ఉంటుంది. నేను లెక్క చేయకుండా అందరి కోసం శ్రమిస్తున్నాను. కాని అందరు నాకు బాగా కష్టం కలిగిస్తున్నారు అని చెప్పి అందరిని ఆ రోజుకు వెళ్ళమన్నారు.
   
                 ఇలా ఖపర్డె డిసంబర్ 5న 1910 జరిగిన సంఘటనలను తన డైరిలో వ్రాసారు. ఖపర్డె గారి డైరి చదివితే మనము నిజముగా సాయి సన్నిధిలో ఉన్న భావన కలుగుతుంది. ఆయన సాయి మాటలను ఆయన వ్యవహరించిన తీరును యధాతధంగా వ్రాసారు. బాబా చెప్పిన కథలను చెప్పినట్లుగానే వ్రాసారు. బాబా మాటలు, నవ్వు, కరుణ, దయ మరియు ఆయన కన్నులలో నుంచి వచ్చే శక్తి మొదలగు అంశాలను మనకు కళ్ళకు కట్టినట్లు చూపించారు. ఆయన 1894 నుంచి 1938 వరకు దాదాపు 45 డైరీలు వ్రాయడం జరిగింది. ఇవన్ని భారతప్రభుత్వం నేషనల్ ఆర్త్కెవ్స్‌లో జాగ్రత్తగా భద్రపరిచింది.

                 ఖపర్డె గారు డిశంబర్ 5, 1960 నుంచి డిశంబర్ 12 వరకు షిర్డిలో ఉన్నారు. ఆ తరువాత బాబా నుంచి అనుమతి తీసుకొని వెళ్ళడం జరిగింది. ఆ ఏడు రోజుల్లో బాబా చాలా విషయాలు మాట్లాడారు. కొన్నింటిని మనము పరిశీలిద్దాము.

                 ఒకసారి బాబా ఇలా అన్నారు "నేనిక్కడ 1000 ఏళ్ళ క్రితమే ఉన్నాను. ఈ ప్రపంచం వింతైనది. అందరూ నావాళ్ళే అందరూ నావాళ్లే, అందరూ నాకు సమానమే కాని కొందరు దొంగలయ్యారు. వాళ్ళకు నేనేం చేయగలను? చావుకు దగ్గరగా ఉన్నవాళ్ళు, అవతలి వాళ్ళను చంపాలనే ప్రయత్నంలో ఉంటారు. వాళ్ళూ నన్ను చాలా బాధ పెడ్తున్నారు. కాని నేనేం అనను, మౌనం వహిస్తాను ".  భగవంతుడు గొప్పవాడు, ఆయనకు పనిచేసే అధికారులు అంతట ఉన్నారు. వాళ్ళు చాలా శక్తివంతులు. ఎవరికివారు వారికున్న దాంతో తృప్తిపడాలి. భగవంతుడు ఆ స్థితిని వాళ్ళకు కల్పించడం జరిగింది. నేను చాలా శక్తివంతుడిని, నేను 8000-10000 సంవత్సరాల క్రితమే ఇక్కడ ఉన్నాను, అని బాబా తన ప్రసంగాన్ని ఆపారు.

                 అలానే ఖపర్డె గారు బాబా చూపిన కరుణ ప్రేమ ఆప్యాయత గురించి ఇలా వ్రాసారు. డిశంబర్ 9, 1910న ఇంటికి వెళ్ళాలని అనుకున్నారు, సాయి మహరాజ్ దగ్గరకు వెళ్ళారు. ఖపర్డె కొడుకు సాయిని వెళ్ళడానికి అనుమతి కోరతాడు. నిజంగా వెళ్ళాలా? అని అంటారు. అప్పుడు ఖపర్డె మీరు అనుమతి ఇస్తేనే అని సమాదానం చెప్తారు. నువ్వు రేపు గాని తరువాత రోజు కాని వెళ్ళు అంటారు. ఇది నీ ఇల్లే ఈ వాడా కూడా మనదే నేనిక్కడ ఉండగా ఎవరైన ఎందుకు భయపడాలి? ఇది నీ ప్రదేశంగానే భావించి ఉండు అని ఆప్యాయంగా చెప్తారు. తరువాత తన కొడుకుకి, సాయిని అలా ఎప్పుడూ అడగవద్దు, ఆయనకు అన్ని తెలుసు. మనము ఆయన ఆజ్ఞ పాటించడమే మనకు మంచిది అని చెప్తారు. ఇలా ఖపర్డె గారి మొదటి కలయిక జరిగింది. ఆయన డైరి ద్వారా మనకు ఎన్నో విషయాలను తెలియచేసారు. 

ఓం శ్రీ సాయి రామ్ !

No comments:

Post a Comment