Wednesday, March 23, 2016

ఉపాసని బాబా- 2



Play Audio

       
      

ఉపాసనిబాబా షిర్డికి వచ్చి బాబాను కలిసిన తర్వాత తన శ్వాస మామూలు స్థితికి వస్తుంది. చాలా రోజుల తర్వాత ఉపాసని బాబా పూర్తి ఆరోగ్యంతో ఉంటారు. ఒక రోజు గడిచిన తర్వాత బాబా దగ్గరకు వెళ్ళి సెలవు అడుగుతాడు. అప్పుడు బాబా ఇంత తొందరగానా! నువ్వు ఎప్పుడు తిరిగివస్తావు? అని అడుగుతారు. అప్పుడు కాశినాథ్ (అంటే మన ఉపాసనిబాబా) తనింక వెనుకకు రాను అని చెప్తారు.అప్పుడు బాబా నువ్వు ఇక్కడ ఉంటే మంచిది లేదా ఎనిమిది రోజుల్లో తిరిగివస్తావు అని చెప్తారు. బాబా శక్తిని అర్ధం చేసుకున్నవారు అయితే షిర్డి విడిచి వెళ్ళరు. కాని ఉపాసని బాబాకు ఇంటిపై ధ్యాస ఉండటంతో దీన్ని బాబా అనుమతిగా భావించి ప్రయాణం అవుతారు. తను ఇంతవరకు గృహస్థాశ్రమ ధర్మాన్ని నిర్వర్తించ లేదు. ఇంట్లో కొత్తగా పెళ్ళిచేసుకున్న భార్య ఎలాగైనా ఇంటికి చేరాలి అనుకుంటారు. కాని అన్ని అవాంతరాలే. ఎక్కువ దూరం ప్రయాణం చేయకుండానే ఆగిపోతాడు. కోపర్‌గావ్‌లో దత్త ఆలయం దగ్గర ఒక బ్రహ్మచారి కలసి, ఉపాసనిని షిర్డి వెళ్ళవలసిందిగా కోరుతాడు. ఇంతలో కొంతమంది యాత్రికులు షిర్డి ప్రయాణంలో భాగంగా కోపర్‌గావ్‌లో ఆగుతారు. వారు ఉపాసని బాబా పై ఒత్తిడి తెచ్చి వారితో పాటుగా మరల షిర్డికి తీసుకువస్తారు. బాబాను కలిసినప్పుడు ఇప్పుడు ఎన్ని రోజులు అయింది నీవు వెళ్ళి? అని అడుగుతారు. అప్పుడు ఉపాసని "ఎనిమిది రోజులు" అని సమాధానం చెప్తారు. నేను ఇంటికి వెళ్ళాలన్నా వెళ్ళలేక పోయాను, నాకు ఏమి అర్ధం కావడం లేదు. మీరే ఏదో చేశారు. అని అంటారు. సాయి తనతో ఉండి తనపైన సమ్మోహన శక్తిని ప్రయోగించారు అని కాశీనాధుడు అర్ధం చేసుకుంటాడు. ఇక అక్కడ ఉండేందుకు నిశ్చయించి శ్యామాచేత తను ఏంచేయాలో అడిగిస్తారు.  బాబా "తను ఏమిచేయనక్కరలేదు" అని అంటారు. ఇదే బాబా విశిష్టత. ఎవరికి ఏ రకమైన సాధన అవసరమో అదే చేయించేవారు. ఇక్కడ ఉపాసని బాబా ఏమి చేయకుండా ఉండాలి అదే సాధన. ఉపాసని బాబాకు మంత్రజపమో లేదా గ్రంధపఠనం చెయ్యాలి. కాని బాబా వద్దని ఆజ్ఞ వేస్తారు.
  
బాబా కాశినాదుడ్ని ఏకాంతంగా ఉండమంటారు. ఖండోబా ఆలయంలో ఉండాలి అని ఆదేశిస్తారు. కాశినాధుడుకి సంస్కృతంలో మంచి ప్రావీణ్యం వచ్చింది. ఏదో చదవాలి అని తపన, మంత్రజపం చెయ్యాలి అన్న భావన. కాని బాబా ఈ వాసనలు ఉపాసనికి మంచివికావని వీటికి దూరంగా ఉంచుతారు. బాబా ఆయనను తన తనువు మనస్సు ధనము అర్పించవలసినదిగా కోరతారు. ఉపాసనికి తన కొత్త కాపురం మీదనే మనస్సు. బాబా ఉపాసని దగ్గర డబ్బులు లేకుండా దక్షిణ తీసుకుంటూ ఉండేవారు. ఆహారం మొదట్లో దొరికినా తరువాత ఆకలి బాధ తీరేదారులే కనబడలేదు. అయినా ఉపాసనిబాబా దిగులుచెందలేదు. బాబా ఆయనకు అంతర్ నిష్ట నేర్పెందుకు నిశ్చయించుకున్నారు. ఉపాసని బాబా జీవనం అతి భారమైంది. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత దీక్షిత్ ఆయనను ధీక్షిత్‌వాడాలో భోజనం చేయవలసింది అని అడిగితే కొన్ని రోజులు ఆహారం లభించింది. కాని అక్కడ కూడా ఆయన పద్ధతులు నచ్చక కొందరు శత్రువులవుతారు. ఒక రోజున అక్కడి ఉద్యోగి కాశీనాధుని రేపట్నుంచి భోజనానికి రావద్దని ఆదేశిస్తారు. ఇంతటితో ఇది కూడా దక్కకుండా పోతుంది. 3 రోజులు ఉపవాసం ఉంటారు. ఆయనకు ఇదే సమయంలో పైల్సు (మొల్లలు) వ్యాధి వచ్చి బాగా అజీర్ణం చేస్తుంది. ఇదంతా బాబాకు తెలుసుకాని బాబా మౌనం వహిస్తారు. శిష్యునకు ఇదంతా అవసరం. ఈ సాధనలో నుంచే ఉపాసనిని ఒక వజ్రంలా తయారుచేయాలి అని బాబా సంకల్పం. ఇలానే మెల్లగా శ్రద్ధ, సబూరిలను నేర్పడం కూడా బాబా ఉద్దేశ్యం.
  
కాశినాధ్‌కి బాబా ఇచ్చిన అనుభూతులు
పాపపురుషుడు
కాశినాధ్ ఒక రోజు కూర్చుని ఉండగా ఒక అనుభవం కల్గుతుంది. ఆయనకు బాబా వచ్చినట్లు, ఆయన "నీకు ఉపదేశం ఇస్తాను రా!" అని పిలుస్తారు. ఇంతలో కాశీనాధ్ లాగానే ఉన్న ఒక నల్లటి వ్యక్తి వెనుక నుంచి "ఆయన మాట వినద్దు, నా మాట విను" అని చెప్తాడు. అప్పుడు బాబా ఆ వ్యక్తిని పట్టుకుని కట్టెలపై కాల్చివేస్తారు. అప్పుడు కాశీనాధ్ "బాబా నువ్వు కాలుస్తున్నది నన్నె" అని అరుస్తాడు. బాబా అవును నిన్నే కాని నీలో ఉన్న పాపపురుషిడ్ని కాల్చేసాను అని చెప్తారు. నువ్వు ఇప్పుడు అన్ని పాపాల నుంచి విముక్తుడవు అయ్యావు, అని బాబా అంటారు.

              ఇంకోసారి కాశీనాధ్‌కి ఒక కల వస్తుంది. తను నడిచి వెళ్తూ ఉంటే ఒక పెద్ద నల్లని అగాధంలోకి ఎవరో లాగుతున్నట్టు అనిపిస్తుంది. అప్పుడు కాశీనాధ్ "ఎవరు నన్ను లాగేది నన్ను వదలకపోతే సాయిబాబాకి చెప్తా" అని అనగానే కాశీనాధ్ ఆ బంధం నుంచి విముక్తుడవతాడు. ఈ అగాధమే నరకము. దాని దగ్గరకు ఎవరు వెళ్ళినా అది వాళ్ళను మింగేస్తుంది. కాని బాబా తోడు ఉంటే ఆ భక్తుడు బయపడవలసిన పనిలేదు.

బాబా దీపమివ్వడం
ఇంకోసారి కలలో బాబా కనిపించి ఒక దీపం కాశీనాధ్‌కి ఇస్తారు. దాన్ని నువ్వు తీసుకో ఇది నిన్ను రక్షిస్తుంది. నీ జీవితంలో వెలుగు నింపుతుంది. నీకు అడ్డంకులు రావు. నువ్వు వందల మందికి వెలుగును పంచుతావు అని చెప్తారు. కాశీనాధ్ ఆ దీపాన్ని తీసుకుంటాడు.

పుణ్యపురుషుడు
ఒకసారి కాశీనాధ్‌కి బాబా కలలో కనిపించి ఒక విచిత్ర ప్రదేశంకు తీసుకు వెళ్తారు. అక్కడ వెండి రూపాయలు ఒక పెద్ద కుప్పగా పోయబడి ఉంటాయి. ఆ కుప్ప 225 అడుగులు పొడవు, 120 అడుగుల వెడల్పు దాదాపు 4 అడుగుల ఎత్తు ఉంటుంది. దాని మీద ఒక వ్యక్తి చక్కటి పాన్పు పై కూర్చుని ఉంటాడు. ఆ వ్యక్తి చక్కటి ఖరీదైన దుస్తులు ధరించి ఉంటాడు. అప్పుడు కాశీనాధ్ బాబాను చూసి బాబా ఈ వ్యక్తి ఎవరు అని అడుగుతాడు.

బాబా నువ్వు అతనిని గుర్తుపట్టలేదా, ఆ వ్యక్తి ఎవరో కాదు నువ్వే. నీలో ఉన్న పాపపురుషుడు పోయి పుణ్య పురుషుడు మిగిలాడు. ఇక్కడ ఉన్న ఈ ఇళ్ళన్ని రూపాయలతో నిండి ఉన్నాయి అని చూపిస్తారు. ఈ విధంగా బాబా పాపపుణ్యాలకు అతీతమైన ఆధ్యాత్మిక సంపద మనిద్దరిది అని చెప్పడం వాటిని ఒక అనుభూతి రూపంలో చూపించడం కేవలం బాబా లాంటి పరమ గురువులకే సాధ్యం.

కాశీనాధ్‌లో ఉన్న ద్వంద్వాలను దూరంచేసి తను నేర్చుకున్న భక్తి కర్మ, జ్ఞాన సిద్దాంతాలన్ని ఏకం చేసి సరియైన మార్గంలో నడిపించేందుకు బాబా శ్రీకారం చుట్టారు.

 
ఓం శ్రీ సాయి రామ్ !

No comments:

Post a Comment