Tuesday, November 21, 2017

శ్రీ సాయి సత్చరిత అధ్యాయం - 8



మన జీవితం సగం నిద్రతోనే సరిపోతుంది. ప్రతిరోజూ ఉదయాస్తమానాలు అవుతాయి. ఆలా అనేక సంవత్సరాలు వృధాగా గడిచిపోతాయి. మిగిలిన జీవితాన్నైనా సరిగ్గా అనుభవించరు. బాల్యంలో క్రీడలు, వయసులో సుఖభోగాలకై పరుగులు మరియు వృద్ధాప్యంలో వ్యాధిగ్రస్తులై పీడింపబడతారు. శరీర పోషణ మరియు మైథునం ఇవే మానవ శరీరానికి సాధనాలైతే, ఈ జన్మకు పర్యవసానం ఇదే అయితే ఈ నర జన్మ వ్యర్థం అని మన శాస్త్రాలు చెప్తాయి. మనం ఎవరము, ఎక్కడినుండి వచ్చాము ? ఈ మానవ జన్మకు కారణం ఏమిటి ? అన్న రహస్యం అర్ధం చేసుకున్నవారు వివేకవంతులు. బాల్యం, యవ్వనం, వార్ధక్య అవస్థలు జనులందరికి ఉంటాయి.  కాని అవి ఎలా వచ్చి వెళ్ళిపోతాయో ఎవరు తెలుసుకోలేరు. కళ్ళకు కన్పించేది ఏదైనా నశించేదే. ఈ క్షణంలో ఉన్న శరీరం తరువాత ఉండదు. శరీరం మలమూత్రాలు, శ్లేష్మం చీము రక్తాలతో నిండి ఉంటుంది. దీనిని ప్రతీ క్షణం మృత్యువు వెంటాడుతు ఉంటుంది. ఇలాంటి ఈ శరీరమే మనకు పరమేశ్వర ప్రాప్తిని కూడా కలుగచేస్తుంది. క్షణభంగురమైన ఈ శరీరం పుణ్యం సంపాయించే భగవద్ ఆరాధన, శ్లోకాలు, భగవంతుని కథలు వినే సమయమే సార్ధకం అవుతుంది. పరమేశ్వరుని దయతో మనకు కావలసినవన్నీ వచ్చినా ఇంకా మనలో అశాంతే ఉంటుంది. శాశ్వతమైన పరమపదం పొందిన దాకా నిజమైన శాంతి దొరకదు. జీవించడానికి సరిపడా అన్న వస్త్రాలు, తగుమాత్రం ఆలన పాలన చేసి, జనన మరణాలను తప్పించుకోవడమే మానవ కర్తవ్యం అని ఈ అధ్యాయం మనకు చెప్తుంది.


బాబా అందుకే ఈ శరీరాన్ని ఒక అద్దె ఇల్లులాగా చూసుకోమని చెప్పారు. ఇక్కడ ఉన్నంత వరకు దీనిని శుభ్రంగా ఉంచుకొని పరమార్ధం చేరుకోవడానికి తగినంతగా వాడుకొవాలి. మనం ఎన్నో జీవరాశులుగా జన్మలు తీసుకొన్న తరువాత కాని మనకు మానవ జన్మ రాలేదు అని శాస్త్రాలు చెప్తాయి. భగవంతుని పొందే అవకాశాన్ని ఈ జన్మలోనే దక్కించుకునే ప్రయత్నం చేయాలి. మరు జన్మకై ఎదురుచూడకూడదు. ఎందుకంటే మళ్ళా మానవ జన్మ ఎప్పుడు వస్తుందో? అందుకే శంకరాచార్యులవారు "జంతూనాం నరజన్మ దుర్లభం" అని చెప్పారు. మన కర్తవ్యం ఏమిటో చక్కగా అర్ధం చేసుకోవాలి. మనం జీవితం అనే అరణ్యంలో ఎంత పరుగులు తీసినా దైవాన్ని మరువకూడదు. పరమార్ధాన్ని బోధించే శాస్త్రాలను పారాయణ చేయాలి. సత్సంగం చేయాలి. గురువులను ఆశ్రయించాలి. శరీరం పట్ల అంతులేని వ్యామోహం వదలాలి. గురువుల పట్ల శ్రద్ధను పెంచుకోవాలి. ఈ జీవితం క్షణభంగురం. ఎప్పుడు రాలిపోతుందో తెలియదు.  కాలుడు తనపని తాను చేసుకుంటూ పోతాడు. అప్పుడు నాకు ఒక్కరోజు ఎక్కువ ఉంటే బాగుండు అనే బేరసారాలు ఉండవు. ప్రతిక్షణం ఈ గమ్యాన్ని చేరుకోవడానికి ఉపయోగించుకోవాలి. ఈ శరీరంలో ఉన్నంత కాలం ఈ సాధన జరుగుతూ ఉండాలి.

అబేధ జ్ఞానమే తత్త్వం. ఉపనిషత్తులలో ఉన్న బ్రహ్మజ్ఞానం ఇదే. పరమాత్మ ఉపాసన అన్నా ఇదే. భక్తులు భగవంతుడు అన్నా ఇదే. గురువు బ్రహ్మము వేరు కాదన్న అభేదజ్ఞానం కలగడమే భక్తి. ఈ భక్తితో మాయను దాటటం సులభం. యోగ్యులు శ్రద్ధ కలిగిన వివేకవంతులు జ్ఞాన వైరాగ్యాలను సంపాయించుకుంటారు. ఈ ఆత్మా తత్వంలో లీనమైన భక్తులు భాగ్యవంతులు. సాయి మనకు గురువు. ముల్లుని ముల్లుతోనే తీసివేసినట్లు, అజ్ఞానమనే ముల్లును జ్ఞానమనే ముల్లుతోనే తీయాలి. నేను నాది అనేది పోయినదాకా జ్ఞానజ్యోతి తన ప్రకాశం వ్యక్తం చేయదు. సాయి చూపించిన దారిలో నడిస్తే ఈ జ్యోతి తొందరగా వెలుగుతుంది.


 ఈ అధ్యాయంలో బాబా భిక్ష గురించి హేమద్పంత్ ఈ విధంగా వ్రాసారు. ఒక చేతిలో రేకు డబ్బా, రెండవ చేతిలో జోలి తగిలించుకొని, ప్రతిరోజు నియమంగా కొన్ని ఇళ్లకు వెళ్లే వారు. కూర, సాంబారు, పాలు, మజ్జిగ వంటి పలుచని పదార్ధాలు రేకు డబ్బాలో పోయించుకునే వారు. రొట్టె అన్నమును జోలిలో వేయించుకునే వారు. వారి జిహ్వకు రుచిని గ్రహించాలి అన్న ఆశ లేదు. ఇలా తెచ్చిన వాటిని మసీదులోని ఒక మట్టి పాత్రలో ఉంచేవారు. కాకులు, కుక్కలు అందులోనే తింటున్నా ఎప్పుడు వాటిని తరిమేవారు కారు. అక్కడ పనిచేసే ఒక అమ్మాయి అన్నం రొట్టెలు తీసుకు పోయేది. బాబాకు అందరు సమానమే. బాబా మసీదుకు రాకముందు తాత్యా తల్లి బాయజాబాయి బాబా కోసమని రొట్టెల బుట్టను తలపై ఉంచుకొని అడవిలోకి వెళ్ళేది. మైళ్ళు నడచి బాబా ఎక్కడ ఉన్నా వెతికి ఆహారం తినిపించేది. తరువాత బాబా మసీదుకు వచ్చిన తరువాత ఆమెకు తిరిగే అవసరం లేకుండా పోయింది. బాబానే భిక్షకు వచ్చేవారు. ఆమె ఏమి ఆశించకుండా ఈ సేవ చేయడం జరిగింది. కాని బాబా తరువాత తాత్యాను కనిపెట్టుకొని ఉన్నారు. 

తాత్యా, మహల్సాపతి బాబాతో పాటు మసీదులో కొన్నిఏళ్ల పాటు నిద్రించడం వాళ్ళ పూర్వ జన్మ పుణ్యం. వారు ఉత్తరం, తూర్పు మరియు పడమరగా తమ తలలు పెట్టి పాడుకొనే వారు. తాత్యా కనుక కునుకు పెడితే బాబా తన తలను గట్టిగా వత్తిమరీ నిద్ర లేపే వారు. ఈ విధంగా తాత్యా 14 సంవత్సరాలు బాబాతో నిద్రించడం జరిగింది. తరువాత కాలంలో తన తండ్రి చనిపోతే ఇంట్లోనే నిద్రించేవాడు. తాత్యా, మహల్సాపతి ఎంతటి అదృష్టవంతులో చెప్పనక్కరలేదు. అలానే మనం కూడా అజ్ఞానమనే నిద్రలో ఉంటె మన తలకూడా వత్తి జ్ఞానం వైపు తీసుకువెళతారు. ఇక్కడ నిద్రపోవడం అంటే ఆధ్యాత్మిక పధంనుంచి పక్కకు పోవడం. మనలను సరిఅయిన దారిలో పెట్టి అనుగ్రహిస్తారు. 

ఇంకా చివరగా ఈ అధ్యాయంలో రహతా నివాసి అయిన ఖుశాల్ చంద్ అనే ఆయనను బాబా ఎంతో ప్రేమగా చూసే వారు. ఆయనకు కూడా బాబా అంటే అంతే ప్రేమ భక్తి ఉండేవి. బాబా రహతా పొలిమేరలకు రాగానే డోలు సన్నాయి మొదలగు వాద్యాలతో బాబాకు ఆహ్వానం పలికే వారు. మనం కూడా అంత ప్రేమ చూపిస్తే బాబా మన హృదయం అనే రహతాకు వస్తారు. మనతో ముచ్చటించి, మన ఆతిధ్యం స్వీకరించి మనలను అనుగ్రహిస్తారు.

ఈ అధ్యాయం మొత్తం ఒక సారి పరిశీలిస్తే కొన్ని విషయాలు మనం నేర్చుకోవచ్చు. మొట్ట మొదటగా మానవ జీవితం ఎంత విలువైనదో చెప్పారు. మనం ఏంతో పుణ్యం చేసుకుంటే కాని ఈ జన్మ రాదు. తరువాత గురువు యొక్క ఆవశ్యకత చెప్పారు. గురువు భిక్షను స్వీకరించి మన పాపాలను పోగొడతారు. తరువాత బాయజాబాయి సేవ గురించి చెప్పారు. అంటే గురు సేవ నిస్వార్ధంగా ఉండాలి. అప్పుడే మనకు గురువుతో సత్సంగం దొరుకుతుంది. అంటే తాత్యా, మహల్సాపతి లాగా బాబాతో ఉండటం. గురువు మన జీవితంలో ఉంటె మనం ఆధ్యాత్మిక పధంలో సులభంగా నడవగలుగుతాము. మనం విషయ వస్తువుల వైపు పరుగులు తీస్తే ఈ ప్రయాణం ఆలస్యం అవుతుంది. మళ్ళా మనకు మానవ జన్మ వస్తుంది అన్న నమ్మకం లేదు. అందుకే మనం బాబా చెప్పిన దారిలో నడిచి బాబాకు దగ్గర అవ్వాలి. అప్పుడే మనం మన గమ్యం చేరుకోగలుగుతాము. 
  



శ్రీ సాయినాథార్పణమస్తు !

No comments:

Post a Comment