Wednesday, August 5, 2015

మాయ


బాబా చైతన్యం గురించి వివరించిన తర్వాత నానా నమ్రతతో ఈ విధంగా అడిగాడు,

బాబా! మీరు చైతన్యం మాయ కలిసి ఉన్నాయన్నారు. ఈ మాయ ఎట్లా పుట్టింది? ఎక్కడ నుంచి వచ్చింది? అని బాబాను వేడుకున్నాడు. అప్పుడు బాబా ఇలా చెప్పారు.

చైతన్యంలో ఉన్న శక్తే మాయ. ఈ మాయ చైతన్యంలో కలిసిపోయి ఉంది. దానిని వేరు చేద్దామంటే సాధ్యం కాదు. బెల్లం నుండి తీపిదనాన్ని వేరు చేయలేము. సూర్యుని నుండి కిరణాలను వేరు చేయలేము. అలాగే మాయ మరియు బ్రహ్మము ఒకదానిలో ఒకటి కలిసిపోయి ఉన్నాయి. కాని మాయకు అంతము ఉన్నది. చైతన్యమునకు అంతము లేదు. మాయ వల్లనే ఈ సంపూర్ణ జగత్తు ఉద్భవించింది.

మనము సాధన చతుష్టయము అలవరచుకొని, భక్తితో గురుసేవలో మునిగినప్పుడు ఆ గురువు మనపై కృప చూపి జ్ఞానాన్ని ప్రసాదిస్తారు. మనలో వైరాగ్యము, ముముక్షత్వము, బాగా పరిపక్వం చెందినప్పుడు మాత్రమే మనకి జ్ఞానం సిద్దిస్తుంది. మనం ఎంత వెదికినా గురువు కంటే మరో గొప్పదాత ఎవరూ ఉండరు. గురువు భక్తులకు ఆశ్చర్యం కలిగేలా మనసుకోరని దానిని ఇస్తారు. ఆత్మస్థితిని వారు తప్ప ఎవరు ప్రసాదించగలరు.

ఎవరైతే ఆత్మదర్శనము అనే గుహలోకి వెళ్తారో, వారు అజ్ఞానంలోకి మరల చేరరు. వారు ఆనందసాగరంలో మునిగిపోతారు. వారే ఆ గుహ అయిపోతారు.

నేను, నాది అనేదే మాయ. ఇది సత్యాన్ని అసత్యంగా, అసత్యాన్ని సత్యంగా చూపిస్తుంది. అందరూ ఈ మాయాజాలంలో పావులుగా మారిపోతారు.

మనకు కనిపించే వస్తువులన్నీ, నిజం కాదు. కాని మాయ వల్ల ఆ వస్తువులు మనల్ని భ్రమింపచేస్తాయి. ఆత్మ ఒక్కటే సత్యం. ఇది తెలుసుకోవడమే మానవ జీవితలక్ష్యం. ఇలా బాబా నానాకు ఈ మాయ గురించి బోధించాడని దాసగణు మనకు తెలియచేసారు.



|| ఓం సాయిరాం ||

No comments:

Post a Comment