Wednesday, August 19, 2015

బ్రహ్మజ్ఞానం





ఆత్మస్థితి లేక బ్రహ్మస్థితి అంటే ఏమిటి?
బ్రహ్మము సత్యము. ఏదైతే అన్ని కాలాలకు అతీతంగా ఉందో, దేనికైతే ఆద్యంతములు లేవో, ఏదైతే మార్పు చెందదో అంటే దేశకాల పరిస్థితులకు మార్పు చెందదో అదే బ్రహ్మము. ఈ బ్రహ్మము మనమే అని అనుభవ పూర్వకంగా తెలుసుకొని, పంచకోశములు  (అన్నమయ. ప్రాణమయ, మనోమయ, బుద్ధిమయ, ఆనందమయ కోశములు) మనము కాము అని తెలుసుకొని, సచ్చిదానందస్థితి మాత్రమే మన నిజస్వరూపమని తెలుసుకొని, ఆ స్థితిలో ఉండటమే బ్రహ్మస్థితి.

జ్ఞాన భూమికలు: జ్ఞాన మార్గంలో 7 భూమికలు చెప్పబడతాయి. ఆత్మ దర్శనానికి ఈ జ్ఞాన భూమికలు మెట్లు లాంటివి. 

1) శుభేఛ్ఛ : ఇది మొట్టమొదటి భూమిక. ఈ భూమిక మనలోని మాలిన్యాన్ని కొంతవరకు తొలగించి, కొంతలో కొంత వైరాగ్యాన్ని ప్రసాదిస్తుంది.

2) విచారణ : మన గురించి మనము అర్ధం చేసుకోవడం, అంటే ఆత్మవిచారణ బాగా జరగాలి.

3) తానుమానసి : వస్తువులు పట్ల వ్యామోహంతో పాటు, అసంగ భావన ఏర్పడుతుంది.

పై మూడు భూమికలు జాగ్రత్ స్థితిలో ఉంటాయి. ఎవరైనా ఈ స్థితిలో అంటే అసంగ భావన స్థితిలో చనిపోతే వారు తరువాత జన్మలో జ్ఞానిగా అవతరిస్తారు.

4) సత్వపత్తి : ఈ భూమిక అన్ని వాసనలను అంతం చేస్తుంది. ఈ జగత్తులో ఎన్నో క్లిష్టమైన విషయాలు బోధపడతాయి. ఇవి అశాశ్వతం అని అనిపిస్తుంది. అన్నింటిని సమదృష్టితో చూడడం జరుగుతుంది.

5) అసంశక్తి : ఇక్కడ ఉపాధి భావన నశిస్తుంది. లోకంలో ఉంటూ లోకంతో ఏ సంబంధం లేకుండా ఉంటారు.

6) పదార్ధ భావన : ఇది సత్యము, అనంతమైన జ్ఞాన భూమిక.

7) తురీయస్తితి లేక తురీయాతీత స్థితి : ఇక్కడసలు సంకల్పము వుండదు. ఇది గుణాతీతమైన స్థితి. మనోవాక్కులకు అందనటువంటి స్థితి. విదేహముక్తి ఈ తురీయాతీత స్థితి.


బ్రహ్మజ్ఞానం - అర్హత

బ్రహ్మజ్ఞానము (ఆత్మసాక్షాత్కారము) నకు యోగ్యత.
బాబా అందరూ తమ జీవితములో బ్రహ్మమును చూడలేదు అని చెప్తున్నారు. దానికి కావలసిన యోగ్యతలు ఇక్కడ చెప్పడం జరిగింది.

1) ముముక్షత : ఎవరయితే తాను బద్దుడనని గ్రహించి బందనముల నుండి విడివడుటకు కృతనిశ్చయుడై శ్రమపడి ఇతర సుఖములను లక్ష్యపెట్టక దానిని పొందుటకై ప్రయత్నించునో వారే ఆధ్యాత్మిక జీవితమునకు అర్హుడు.

2) విరక్తి లేదా ఇహపర సుఖములందు విసుగు చెందుట : ఈ లోకములోని సుఖాలయందు , పరలోక సుఖాలయందు, అంటే స్వర్గాదిసుఖములందు ఆసక్తి లేకుండా ఉండటమే నిజమైన విరక్తి.

3) అంతర్ముఖత : మనకు (ఇంద్రియాలకు) బాహ్యమైన వస్తువులను చూచుటకే ఎక్కువ ఆసక్తి ఉంటుంది. కనుక మానవులెప్పుడు బయటనున్న వానినే చూచును. కాని మనము ఆత్మసాక్షాత్కరము కోరుకుంటే మన దృష్టిని లోపలకు పోనిచ్చి లోనున్న ఆత్మను ఏకధ్యానముతో జూడవలెను.

4) పాపవిమోచన పొందుట : మానవుడు దుష్ట కర్మల నుండి మనస్సును మరలించలేనప్పుడు, తప్పులు చేయుట మాననప్పుడు, మనస్సును చలింపకుండ నిలబెట్టలేనప్పుడు జ్ఞానము ద్వారా కూడా ఆత్మసాక్షాత్కారమును పొందలేడు.

5) సరియైన నడవడి : మనము ఎప్పుడూ సత్యము పలుకుచూ, తపస్సు చేయిచూ, అంతర్‌దృష్టితో బ్రహ్మచారిగా నుండిన గాని ఆత్మసాక్షాత్కారము లభించదు.

6) ప్రియమైన వాటి కంటే, మనకి ఏది మంచిదో దాన్ని కోరుకోవడం ఎంతో ముఖ్యం.

7) మనస్సును, ఇంద్రియాలను స్వాధీనమునందుంచుకొనుట : శరీరం రధం, ఆత్మ ఆ రధమును నడుపు సారధి, మనస్సు- కళ్ళెము, ఇంద్రియములు - గుఱ్ఱములు, ఇంద్రియ విషయములు వాని మార్గములు. ఎవరికి గ్రహించు శక్తి లేదో, ఎవరి మనస్సు చంచలమయినదో, ఎవరి ఇంద్రియములు స్వాధీనములో లేవో, అట్టి వాడు గమ్యస్థానము చేరలేడు. ఎవరయితే వీటన్నింటిని ఆధీనములో నుంచునో వారు తప్పక గమ్యస్థానము చేరుకుంటారు.

8) మనస్సుని పావనము చేయుట :  మానవుడు ప్రపంచంలో తన విధులను సక్రమంగా నిర్వర్తించితే మరియు ధర్మమార్గంలో ప్రయాణించితే కాని అతని మనస్సు పావనము కాదు. మనస్సు పావనము కానిదే అతడు ఆత్మ సాక్షాత్కారము పొందలేడు.

9) గురువు యొక్క ఆవశ్యకత : ఆత్మజ్ఞానము చాలా సూక్ష్మము అయినది. మనంతట మనము దానిని పొందలేము. దీనికి గురువు యొక్క అవసరం ఎంతైనా ఉంది. ఆ గురువు ఆత్మసాక్షాత్కారము పొందినవారై యుండాలి. గురువుకు దానిలో ఉన్న లోటుపాట్లు తెలుసు. అందుకే వారు మనలను సరియైన మార్గములో నడిపించగలుగుతారు.

10) భగవంతుని కటాక్షము : "ఆత్మ ఎవరిని ధరించునో వారే దానిని పొందుదురు" అని కఠోపనిషత్తు చెప్పుచున్నది. భగవంతుని కటాక్షము లేనిదే వివేక వైరాగ్యములు కలగవని బాబా ఇక్కడ బోదించడం జరిగింది.

బాబా ఈ పది యోగ్యతలను బోధించి మనందరిని ఉద్దరించారు. వీటన్నింటిని మనము మన నిజజీవితంలో అన్వయించటం నేర్చుకోవాలి.



|| ఓం సాయిరాం ||


No comments:

Post a Comment