Wednesday, September 2, 2015

ఆత్మదర్శనము

Play Audio

మనము మన చిత్తాన్ని శుద్ది చేసుకొని, సాధన చతుష్టయాన్ని (అంటే వివేకము, వైరాగ్యము, శమదమాది షట్ సంపత్తి మరియు ముముక్షత్వము) బాగా అలవరుచుకుని, ఈ జ్ఞాన భూమికలలో మొట్టమొదటిది రెండవది అయిన శుబేఛ్ఛ మరియు విచారణలను పెంపొందించుకొని గురువు అనుగ్రహము పొందితే అప్పుడు తురీయస్థితికి చేరాలంటే పరమగురువుల అనుగ్రహం తప్పక ఉండాలి. దానికి ఎంతో కృషి చెయ్యాలి. అదే ప్రతి మానవుని యొక్క ముఖ్య లక్ష్యము. మనలో ఈ బ్రహ్మ జిజ్ఞాస బాగా రావాలి. బాబా ఎప్పుడూ మనలను ఈ దారిలో తీసుకువెళ్ళాలని, మనము దాన్ని తప్ప వేరే ఏదీ కోరుకోకూడదని బాబా ఉద్దేశ్యము. కాని ఆయన మన ప్రాపంచిక కోరికలు కూడా తీరుస్తూ మనల్ని ఒక్కోమెట్టు ఎక్కిస్తూ ఉంటారు.

ఈ బ్రహ్మము గురించి తెలుసుకోవడానికి మనము ఏం చేయాలి అనే విషయాలను బాబా సాయి సచ్చరితలో 16,17 అధ్యాయాలలలో చెప్పడం జరిగింది.

సంపన్నుడు మరియు లోభి అయిన ఒకరు బాబాని బ్రహ్మ జ్ఞానాన్ని ఇవ్వమని అడగటం జరిగింది. ఈ సంఘటనలో బాబా చాలా చమత్కారంగా అయిదు రూపాయల కోసం ఒక కుర్రవాడిని పంపించడం జరుగుతుంది. కాని 5 రూపాయలు దొరకవు. ఈ సంపన్నుడి దగ్గర చాలా ధనం ఉన్నా, ఆయన దానిని ఇచ్చేందుకు సిద్దంగా లేడు. ఇక్కడ బాబా ఆ సంపన్నుని అడ్డుపెట్టుకుని మనందరకు జ్ఞానభోధ చేసారు.

బాబా అడిగిన ఆ అయిదు ఏమిటి ?
1) పంచప్రాణాలు
2) పంచ జ్ఞానేంద్రియాలు మరియు కర్మేంద్రియాలు
3) మనస్సు
4) బుద్ధి
5) అహంకారము.

బ్రహ్మజ్ఞానం లభించే మార్గం కఠినం. అది అందరికీ సులభ సాధ్యం కాదు. సమయం వచ్చినప్పుడు ప్రకటమై అదృష్టమున్న వారికి అది  వెంటనే లభిస్తుంది. కించిత్తయిన విరక్తి లేని వారికి, ఎవరైనా ఈ బ్రహ్మ తత్వోపదేశం చేస్తే మాత్రం ఏం ప్రయోజనం? 

ఉత్తమ అధికారులు బ్రహ్మజ్ఞాన బోధనను గ్రహిస్తారు. కాని సంప్రదాయానికి బద్దులైన  మధ్యమాదికారులకు క్రమక్రమంగా బోధించాలి. ఒక్క ఆత్మజ్ఞానం తప్ప బ్రహ్మప్రాప్తికి శ్రేష్టమైన మార్గం లేదు. అభ్యాసం మరియు శ్రమ తప్పనిసరి. ఎముకలు పుల్లలై పోవాలి. అప్పుడు గురుకృపా ప్రకాశంతో బ్రహ్మజ్ఞానం మెల్లమెల్లగా చేజిక్కుతుంది.

నేనే బ్రహ్మను అనే జ్ఞానం కలిగినప్పుడు జ్ఞాత ఆత్మ స్వరూపంలో విలీనమైపోయినప్పుడు, అదే విశ్వాభాస విసర్జన అని శ్రుతి చెప్తుంది. ఆత్మజాగృతి కాగా అంతఃకరణ వృత్తి బ్రహ్మతో ఏకరూపమైనప్పుడు బ్రహ్మాగ్నిలో విశ్వం ఆహుతియై సృష్టి అంతా భస్మమై పోతుంది.



|| ఓం సాయిరాం ||

No comments:

Post a Comment