In human life, the guru's place is pre-eminent. By keeping utmost faith in Guru alone, everything is obtained.
A devotee's entire strength is due to his guru. Devotion to the guru is superior to devotion to gods and goddesses.
The guru is the supreme being.
సాయి రూపాన్నే ధ్యానిద్దాము, సాయి పాదాలనే పూజిద్దాము !
సాయి మాటలే మన మంత్రాలు, సాయి కృపే మనకు మోక్షము!!


Telugu Posts


సంసారం


              సాయినాధుడు మానవ జీవితం గూర్చి మరియు దాని ముఖ్య ఉద్దేశ్యము గురించి చాలా సార్లు చెప్ఫారు. మానవ రూపం ఎన్నో కోట్ల జన్మల తర్వాత మనకు లభించినదని శాస్త్రాలు చెప్పాయి. మనము దానిని వృధా చేసుకొనకుండా సద్వినియోగం చేసుకోవాలి.
              మానవ జీవిత లక్ష్యం ముక్తి. ఈ సంసార బంధాలనే సంకెళ్ళను తెంచుకొని ఆ పరమాత్ముడే మనము అని తెలుసుకోవడమే ముఖ్య లక్ష్యము. నానా చందోర్కరుకు సాయి ఇటువంటి బోధచేయడం జరిగింది. దానిని దాసగణు మహారాజు ఒక చోట కూర్చడం జరిగింది. ఆ తరువాత చాలామంది వాటిని మనకి అందించారు.
             ఒక రోజు మహా పుణ్య సంపన్నుడైన నానాసాహెబ్ చదోర్కరు మరియు నానా సాహెబ్ నిమోన్కరులు బాబా ధర్శనార్ధమై షిర్డి గ్రామానికి వచ్చారు. నానా చందోర్కరు బాబా పాదాలపై పడి ఈ విధముగా ప్రార్ధించారు.

నానా : ఓ సాయి మహారాజా! సమర్దా! ఈ సంసారమిక చాలు, శాస్త్రాలన్నీ సంసారం నిస్సారమని వక్కాణిస్తున్నాయి. ఓ ధీనబందు! ఈ ప్రాపంచిక సంబంధాలనే సంకెళ్ళను తెంపివేయి. ఏ సుఖాలకైతే మేము పరిగెడుతున్నమో, అవే చివరకు దు:ఖాలై మమ్మల్ని ఆడిస్తాయి. ఎంత చూసినా ఈ సంసారంలో సుఖమనేది లేదు. ఇక నాకు విసుగెత్తిపోయింది. ఈ సంసార బంధాలిక నాకు అక్కరలేదు.

చందోర్కరు మాటలు విన్న బాబా ఈ విధంగా చెప్పారు.
బాబా: నానా ఈ పిచ్చి ఆలోచనలు నీకెక్కడి నుంచి వస్తున్నాయి. నీవు చెప్పింది కొంత వరకు నిజమే కాని మొత్తం మీద నీవు కొంచెం దారి తప్పావు. ఈ సంసారం నుండి నీవు తప్పించుకోవాలనుకున్నా అది వదలక నీ వెన్నంటే ఉంటుంది. అది ఎవరికీ తప్పదు. ఈ దేహాలలో తగులు కోవడం నాకే తప్పలేదు. ఇక నీవెలా తప్పించుకోగలవు. ఈ సంసారంలో ఎన్నో రూపాలున్నాయి అని అవి నీకు చెప్తాను విను.

సంసారం :
1) కామక్రోధ మదమాత్సర్యలోభ మోహములన్నీ ఒక దానితో ఒకటి కలిసి మోహమవుతుంది.
2) ఈ అరిషడ్ వర్గములు అహంకారంతో కలిసినప్పుడు సంసారబంధం ఏర్పడుతుంది. అదే సంసారమంటే.
3) కళ్ళు వస్తువులను చూస్తాయి. చెవులు ధ్వనిని వింటాయి. జిహ్వ రసాస్వాధన చేస్తుంది. ఇవి కూడా సంసారమే. అది శరీర ధర్మము.
4) ఈ సంసారం సుఖ దు:ఖాలనే రెండు వస్తువుల కలయిక. ఇవి ఎవ్వరిని వదిలి పెట్టవు.
5) ధనము, బార్యాపుత్రులు, వీనినే సంసారమని నీవు అనుకుంటున్నావు. అదే ఇప్పుడు నీకు వెగటు అయింది. భార్య, పుత్రులు, పుత్రికలు, అన్నలు, తమ్ముళ్ళు, బంధుమిత్రాది బంధాలతో నీవెంత విసిగిపోయినా అవి నిన్ను వదలవు. దానికి కారణము దేహప్రారబ్ధమని తెలుసుకో, దాన్ని అనుభవించక మూడు కాలాల్లో ఎవరు తప్పించుకోలేరు.
            ఇక్కడ బాబా దేహ ప్రారబ్దం గురించి చెప్పడం జరిగింది. సంసారమంటే కేవలము భార్యపుత్రులు మాత్రమే కాదు. మనలో ఉన్న వాసనలు, కోరికలు, బంధాలు, మనము చేసే ప్రతీ పని దీనిలో భాగమవుతుంది. ఒక దేశము కాని, సంస్థ కాని, ఏదైనా ఒడిదుడుకులు లేకుండా సాగాలంటే దానికి ఒక శాసనము కావాలి. ఆ శాసనమే మనకు ఇవ్వబడిన శాస్త్రాలు. కర్మ సిద్దాంతమును మనము అర్ధం చేసుకోకుండా ఈ జీవన సమరం సాగించడం చాలా కష్టము.
                                                                                                                           
                         
|| ఓం సాయిరాం ||

సత్యం - జ్ఞానం - అనంతం -బ్రహ్మ





ప్రపంచం నిరంతరం మార్పు చెందుతూ ఉంటుంది. ఈ ప్రపంచంలో భాగంగా మనం కూడా మార్పు చెందుతూ ఉంటాము. రోజూ ప్రొద్దున లేచిన దగ్గరనుండి రాత్రి పడుకునే దాక మనం ఎన్నో కర్మలు ఆచరిస్తాము. ఈ కర్మలన్నిటి నుండి మనం ఏమి ఆశిస్తున్నాము. 

- ఇష్ట ప్రాప్తి 

- అనిష్ట నివారణం 

మనకు ప్రియమైనది ప్రాప్తించాలి, లేదా మనకు ఇష్టం లేనిది జరగకూడదు. ఈ ఆలోచన వినటానికి చాలా బాగుంటుంది. కాని ఎప్పుడూ అలా జరగడం లేదు. మనకు దుఃఖం కలుగుతూనే ఉంది. 


ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వారు ఈ రెండింటిని సమానంగా స్వీకరించేన్దుకు సాధన చేస్తూ ఉంటారు. వీరికి కొంతలో కొంత ఊరట లభిస్తుంది. వారు ఎక్కువ శాతం ప్రశాంతంగా ఉండగల్గుతారు.  వారు ఈ తేడాలకు గల కారణాన్ని వెతుకుతారు. అది ఎక్కడ నుంచి వస్తుందో తెలుసుకోవాలి అని అనుకొంటారు. ఈ వెదికే ప్రక్రియలోనే మామూలు మనుషులుగా మనం తప్పుదోవ పట్టేది. ఈ కారణాన్ని బయట వెదకటానికి ప్రయత్నిస్తాము. బయట ఉండే పరిస్థుతులు, మనుషులే దీనికి కారణంగా భావించడం జరుగుతుంది. కాని ఆధ్యాత్మక మార్గంలో పయనించాలి అనుకొనేవాళ్ళు, ఈ కారణం కోసం తమలో తాము వెతుక్కొవాలి. మన మనస్సు లోతుల్లో ఉన్న ఈ వాసనలను అర్ధం చేసుకొని, అవి ఏ విధంగా మనకు దుఃఖాన్ని కలుగ చేస్తున్నాయో తెలుసుకోవాలి. 


మనం ప్రవచనాలు విన్నప్పుడు, శాస్త్రాలు చదివినప్పుడు అందరూ చెప్పేది ఏమిటి అంటే, నిన్ను నీవు తెలుసుకొ. నువ్వు ఈ శరీరం కాదు, ప్రాణం కాదు, ఇంద్రియాలు కాదు, మనస్సు బుద్ధి నువ్వు కాదు అని చెప్తారు. ఇది వినటానికి బాగానే ఉంటుంది. కాని ఈ సత్యాన్ని అర్ధం చేసుకునే జ్ఞానం మన దగ్గర లేదు. 


ఎలాగో ఈ నిజాన్ని మనసులోకి ఎక్కించుకొని, నేను ఈ శరీరం కాదు అని మొదలుపెడితే, మొదట్లోనే కష్టం ఎదురు అవుతుంది. జబ్బు చేసి మన శరీరంలో బాధ మొదలైనప్పుడు నేను ఈ సరిరం కాదు అనుకొంటే సరిపోతుందా! మనకు నొప్పి లేకుండా పోతుందా. కొంచెం నొప్పి ఎక్కువ కాగానే ఈ సిద్ధాంతం మనకు కాదు అని వదిలేస్తామా !

లేదు, ఇంకా లోతుగా వెళ్లి విశ్లేషణ చేసుకోవాలి. వీటిని అర్ధం చేసుకోవాలి అంటే మనలో ఏమేమి ఉన్నాయో తెలుసుకోవాలి. 

మనలో మూడు శరీరాలు ఉన్నాయి అని మన శాస్త్రాలు చెపుతున్నాయి. 

1) స్థూల శరీరం
2) సూక్ష్మ శరీరం 
3) కారణ శరీరం 

స్థూల శరీరం: రక్తము, రకరకాల రసాలు, మాంసము, మేద, ఎముక, మజ్జ మరియు శుక్లము అనే సప్త దాతువులతో కలిపి స్థూల శరీరం అవుతుంది. 


సూక్ష్మ శరీరం: 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 ప్రాణాలు, మనస్సు, బుద్ధి, చిత్తం మరియు అహంకారము అనే 19 తత్వాలతో కలిసి సూక్ష్మ శరీరం అవుతుంది.


కారణ శరీరం: అనాదిగా ఉన్న అజ్ఞానం ఏది అయితో ఉందొ అదే కారణ శరీరం.

ఈ అజ్ఞానమే ఈ మూడు శరీరాలకు కారణం అవుతుంది. ఈ కారణ శరీరాన్నే ఆనందమయ కోశం అంటారు. ఇది కూడా తెచ్చిపెట్టుకున్న స్థితే. దీన్ని కూడా దాటితే కాని సచ్చిదానంద స్థితి అవగతం కాదు. 


ఈ మూడు శరీరాలు పంచాకోశాలతో అన్వయించి చూస్తే ఇలా చెప్ప వచ్చు. 


స్థూల శరీరం - అన్నమయ కోశం 

సూక్ష్మ శరీరం - ప్రాణమయ, మనోమయ మరియు విజ్ఞానమయ కోశాలు. 
కారణ శరీరం - ఆనందమయ కోశం. 

శ్రీ సాయి సత్చరితలొ బ్రహ్మ జ్ఞానం కథలో బాబా అడిగిన ఐదు మరేమిటో కాదు. ఇవే బాబా అడిగినవి. మన ఉపనిషత్తులు చెప్పిన సత్యం కూడా ఇదే. బాబా ఒక చిన్న సన్నివేశం ద్వారా మనకు తెలియ చెప్పేందుకు ప్రయత్నించారు. మనం ఆ కథలో ఉన్న ఆధ్యాత్మిక తత్వాన్ని అర్ధం చేసుకోవాలి. ఈ పంచాకోశాలను దాటి పరమానంద స్థితికి చేరాలి. ఆ సత్ చిదానందమే మన నిజమైన స్థితి అనే జ్ఞానాన్ని పొందాలి. 


జ్ఞాన ప్రదాయకమైన ఈ అనంత పరబ్రహ్మమే మన నిజ స్వరూపమనే సత్యాన్ని ఎరుక పొందటమే మానవ జీవిత లక్ష్యం. 






 ఓం శ్రీ సాయి రామ్ !




గురు కృపాహి కేవలం



సత్ చిత్ ఆనందం అనే మూడు మిళితం అయి ఉన్న తత్వమే పరతత్వం. సద్వస్తువు ఉన్న చోట జ్ఞానానందాలు తప్పక ఉంటాయి. 

ధర్మ సంస్థాపనకొరకు , మరియు తాపత్రాయాలతో తపించి పోతున్న ఈ లోకాన్ని ఉద్దరించటానికి, నిర్గుణ నిరాకార పరబ్రహ్మ మానవ రూపంలో గురువుగా అవతరిస్తారు. అటువంటి నిరాకార పరబ్రహ్మమే, శ్రీ సాయినాథుని రూపంలో సాకార పరబ్రహ్మగా అవతారం దాల్చింది.

అసలు ధర్మం ఎందుకు స్థాపించాలి?
ధర్మార్ధ కామ మోక్షాలనే పురుషార్ధాలలో మోక్షానికి మూలం అయినది ధర్మము. ధర్మం ఆచరింప బడితే మోక్షం దానంతట అదే వస్తుంది. అందుకే ఎ మతమైన, ఎ శాస్త్రమైన ఈ ధర్మాన్నే బోధించటం జరిగింది. కాని మానవులుగా దాన్ని మనం అర్ధం చేసుకునే విధంగా అర్ధం చేసుకుంటున్నామా, లేక మనకి ఇష్టం వచ్చిన రీతిలో వ్యవహరిస్తున్నామా! ఇలా ధర్మానికి పెడర్ధాలు తీస్తే, మనం మోక్షానికి దూరం అవుతాము. 

సరే ఈ ధర్మం మనకు ఎవరు బోధిస్తారు?
పరమగురువులు మనకు ఈ ధర్మాన్ని వారి వాక్కుల ద్వారా మనకు అందిస్తారు. వారి వాక్కులే మనకు మార్గనిర్దేశంగా నిలుస్తాయి. అలా సాయి నాధుని గళంలో నుంచి వెలువడిన అధ్భుత జ్ఞాన ప్రవాహమే శ్రీ సాయి సచ్చరిత. ఈ జ్ఞాన వాణి మన జీవితాల్లో ఒక కొత్త వెలుగుని నింపుతుంది.  ఇక ముందు కూడా ఇది వెలుగుని నింపుతూనే ఉంటుంది. 

శ్రీ సాయి సచ్చరిత ఎంతోమందిని ఎన్నో విధాలుగా కాపాడింది. వారిని సాయి భక్తులుగా మార్చింది. శ్రీ సాయి దివ్య చరితమనే అమృతాన్ని ఎన్నో లక్షలమంది ఆస్వాదిస్తున్నారు. వారి జీవితాలలో మార్పులను వారే స్వయంగా గమనిస్తున్నారు. మనిషి జీవితంలో మార్పు తీసుకురాలేని ఏ బోధకాని, ఏ శాస్త్రం గాని, ఏ ప్రవచనం గాని  సంపూర్ణం అవ్వదు. ఇది సంపూర్ణం అవ్వాలి అంటే దాని మీద నమ్మకం ఉండాలి. అలా నమ్మిన దాన్ని సభూరితో అనుసరించాలి. అప్పుడే దానికి సార్ధకత. అందుకే శ్రీ సాయి సచ్చరిత నమ్మకమనే పునాదితో మొదలపెట్టి మెల్లగా మన కర్మలకనుగుణంగా మనకు సభూరి నేర్పించి మనందరిని ఆధ్యాత్మిక పథంలో నడిపిస్తుంది.  

మన బాబా చేతల గురువు. అయన ఏది బోధించాలన్నా అనుభవ పూర్వకంగానే నేర్పిస్తారు. ఆయనను గట్టిగా పట్టుకుంటే మనకింక వేరే దారులు అవసరం లేదు. 

సచ్చిదానంద పరబ్రహ్మ శ్రీ సాయి రూపంలో అవతరిస్తే,
శ్రీ సాయిపరమాత్మ తత్త్వం శ్రీ సాయి సచ్చరిత రూపంలో వెలిసింది. 

సద్గురువులు తమ సమాధి అనంతరం కూడా తమ దివ్య వాణి రూపంలో అమరులు అయి ఉంటారు. అందుకే బాబా ఏకాదశ సూత్రాలలో ఇలా చెప్పారు. 
ఈ భౌతిక దేహానంతరము నేనప్రమత్తుడను. 
నా సమాధి నుండియే నేను సర్వ కార్యములను నిర్వహింతును. 
నాయన్దెవరికి దృష్టియో వారి యందే నా కటాక్షము. 

ఇంత ఖచ్చితంగా భరోసా ఇచ్చి, మనలను కాపాడగల్గిన పరమ గురువు మన సాయి. అందుకే అయన మనకు ప్రసాదించిన శ్రీ సాయి సచ్చరిత అనే గ్రంధరాజాన్ని మన హృదయంలో భద్రపరుచుకోవాలి. 

ఇదే మన ధర్మం కావాలి. 

ఈ ధర్మమే మన జీవితం కావాలి. 

ఈ జీవితమే సాయి నాధునికి అంకింతం చెయ్యాలి. 

ఈ అంకిత భావంలోనుంచి అపరంపారమైన భక్తి జనించాలి. 

ఈ భక్తి అనే అమృతంతో సాయికి పూజ అభిషేకాలు జరగాలి. 

అప్పుడు ప్రసాదంగా కేవలం సాయి కృపని మాత్రమే కోరుకోవాలి. 

కేవలం గురు కృప మాత్రమే మానవునిలో ఉన్న మూడు ఆవరణలలో చివరిది అయిన అజ్ఞానమనే ఆవరణను తొలిగిస్తుంది. ఈ అజ్ఞానం వీడితే సాయిపరబ్రహ్మ స్వస్వరూపంగా వ్యక్తమవుతారు. 


సదా స్వస్వరూపం  చిదానంద కందం 
జగత్సంభవ స్థాన సంహార హేతుం ! 
స్వభక్తెచ్చయా  మానుషం దర్శయన్తమ్ 
నమామి ఈశ్వరం  సద్గురుం సాయి నాధమ్  !!


 ఓం శ్రీ సాయి రామ్ !

వర్తమానం (The Present) - నిజ జీవితానికి సాయి బోధలు


మానవులుగా మనకు జీవితములో ఎన్నో ఒడిదుడుకులు ఎదురుఅవుతూ ఉంటాయి. ఒక్కోసారి మనకు వచ్చిన కష్టాలలోనుంచి బయటపడతామా లేదా అన్న నిరాశ మనలను ఎంతగానో బయపెడుతుంది. సరే ఇది మనకు చాలతేలికగా అర్ధం అయ్యే విషయం. 

కాని ఇంకో కష్టం ఉంది. 

ఈ కష్టం మనకు తెలియకుండా మింగేస్తుంది. మనకు బాధ కలిగినట్లు కూడా తెలియదు. కాని చాలా నష్టం జరిగి పోతుంది. 

అది ఏమిటి అంటే, మాయ. 

ఈ మాయ ఏ రూపంలో అయినా రావచ్చు. దీనికి కారణం అహంభావన. ఈ అహంలోనుంచే చాలా కష్టాలను కోరి తెచ్చుకుంటాము. ఇది మొట్టమొదట మంచిదే అనిపిస్తుంది కాని మనకు తెలియకుండా ఊభిలోకి కూరుకు పోయేట్లు చేస్తుంది. మనం చాలా మంచి పనే చేస్తున్నాము అని అనుకుంటాము. మనకు దైవ అనుగ్రహం కూడా ఉండచ్చు.  అయినా ఇక్కడ కూడా ఈ మాయ మనలను వదలదు. కాని ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. మనలో మనస్తాపం కలుగుతుంది అంటే మనం మాయలో పడ్డట్టే. 

మన గమ్యం మనకు తెలిసినప్పుడు,

మనము బాబానే మనకు సర్వం అని భావించినప్పుడు,

ఆయనమీద పూర్తిగా భారమంతా  వేసినప్పుడు,

ఆయనే మన దైవమని నమ్మినప్పుడు,

ఆ పరమగురువే  మన సద్గురువుగా సాక్షాత్కారించినప్పుడు,

అయన అనుగ్రహమే మనకు లభించినప్పుడు,

ఇక చింత ఎందుకు?
ఇంక భయం దేనికి ?
మరి దిగులు అవసరమా!

బాబా ఈ మాయ గురుంచి ఈ విధంగా చేప్పారు. 
"నేను ఇల్లు వాకిలి లేని ఫకీరుని, ఏ బాధలు లేకుండా ఒక చోట స్థిరంగా కూర్చున్నాను. అయినా తప్పించుకోలేని  ఈ మాయ నన్ను కూడా వేధిస్తుంది. నేను మరిచిపోయినా అది నన్ను మరవకుండా నిరంతరం పెనవేసుకొని ఉంది. అది హరి యొక్క ఆది మాయ. బ్రహ్మాదులను కూడా ఎగరకొట్టేస్తుంది. మరి నేనెంత? హరి ప్రసన్నుడు అయితే అది విచ్ఛిన్నం అవుతుంది. అఖండ హరి భజన లేకుండా మాయ నిరసనం కాదు". 

ఇట్లా చెప్పి సాయి మరి కొన్ని విషయాలను కూడా చెప్పారు. 

ఎల్లప్పుడూ "సాయి! సాయి !" అని స్మరించే వారిని సప్త సముద్రాల అవతల ఉన్నా రక్షిస్తాను. 
ఈ నా మాటలయందు విశ్వాసం ఉంచితే తప్పక మేలు కలుగుతుంది. నాకు పూజా సామగ్రి కాని, అష్టోపచార, షోడశోపచార పూజలు కాని అవసరం లేదు. అపరిమితమైన భక్తి యున్న చోటే నా నివాసం". 

ఈ మాటలు ఎంతటి వారికైనా ఊరట కలిగిస్తాయి. 

ఇక్కడ మనకు బాబా నేర్పించాలనుకున్నది ఏంటి?
మనం సృష్టి, స్థితి, లయల గురించి విన్నాము. బ్రహ్మ అనే మనసు సృష్టి చేస్తే, విష్ణువనే స్థితి దాన్ని వర్తమానంలో ఉంచితే, శంకరుడు లయ కారుడు అయి దాన్ని అంతం చేయాలి. 

మనం ఒక ఆలోచనుకు ప్రాణం పోస్తాము, దానికి ఒక కార్య రూపం ఇస్తాము.  కాని దాని పర్యవసానం మనం అనుకున్నట్లుగా లేక పొతే మనకు బాధ కలుగుతుంది. మన పురాణాలు పరిశీలిస్తే మనకు చాలా స్పష్టంగా అర్ధం అయ్యే విషయం ఏమిటి అంటే దేవుళ్ళు కూడా చాలా వ్యతిరేక పరిస్తితులను ఎదురు కోవాల్సి వచ్చింది. వాటిని వాళ్ళు కూడా మానవరూపంలోనే అనుభవించి మనకు ఆదర్శప్రాయులు అయ్యారు. 

బాబా కూడా ఒక శరీరంలో ఉండి ఈ మాయను ఎలా అధిగమించాలొ మనకు నేర్పారు. అయన నన్ను కూడా మాయ పట్టుకుంది అని చెప్పారు. అయన పరబ్రహ్మ స్వరూపము. ఆయన మాయకు అతీతుడు. ఆయన మన స్థాయికి వచ్చి మాట్లాడితే తప్ప మనకు అర్ధం కాదు. ఒక్కో సారి సాయి నేను ఇది చేసాను, అట్లా ఉన్నాను అని చెప్తారు. అయన నిరాకారుడు, నిర్గుణుడు, మరియు సచ్చిదానంద స్వరూపుడు. ఆయన చెప్పినవన్నీ మన కోసం. 

ఇక్కడ బాబా హరిని తలుచుకోమని చెప్పడంలో అర్ధం ఏమిటి? 

హరి అంటే స్థితి కారుడు - స్థితి అంటే వర్తమాన కాలం. 

మనం కష్టాలలో ఉన్నప్పుడు మనం దేవుడ్ని తలుచుకుంటాము. ఇది మనకు కొంత ఊరట కలిగిస్తుంది. కాని మనం వర్తమానంలో ఉండము. దీని వల్ల మన ఆశాసౌధాలు కూలిపోయాయని బాధపడ్తాము. అంటే జరిగిపోయిన కాలం లోకి జారుకుంటాము. ఇంతే కాక భవిష్యత్తులో మనం అనుకున్నవిధంగా జరగకపోవచ్చని దిగులు చెందుతాము. కాని హరి అనే వర్తమానంలో ఉండము. వర్తమానం మనలను కార్యోన్ముఖులను చేస్తుంది. వర్తమానంలో ఉండి ఆలోచిస్తే మనకు దారి దొరుకుతుంది. ఒక్కో సారి ఈ కష్టం మనలను మింగేస్తుందా అని అనిపించవచ్చు. కాని ఈ సృష్టిలో ప్రతి దానికి లయం ఉంటుంది. ఏది శాశ్వతం కాదు.  అలాగే కష్టాలు కూడా. 

ఈ చిన్న ప్రవచనంలో బాబా ఎంతో చక్కటి నిగూడ అర్ధాన్ని వివరించారు. అందుకే ఆయన చేతల గురువు. మాటల గురువు కాదు. సద్గురువులు ఎప్పుడూ తమ శిష్యుల ఉన్నతిని మాత్రమె కోరుకుంటారు. వారిని ప్రతి జన్మలో రక్షిస్తూనే ఉంటారు. 





ఓం శ్రీ సాయి రాం!

మానసిక పరివర్తన



మన జీవితంలో మార్పు రావాలని మరియు మన నడవడిక  మారాలని బోధించే వారు బాబా. 
ఒక సారి దీక్షిత్కు బాబా ఈ విధంగా చెప్పారు.

 "నువ్వు వేరే వాళ్ళ గురుంచి చెడుగా మాట్లాడినా లేక వాళ్ళ తప్పులు ఎంచినా, నాకు అమితమైన బాధ కలగుతుంది" అని బాబా అనే వారు. 

అప్పట్లో దీక్షిత్ కు కూడా కోపం ఉండేది. తరువాత  కోపాన్ని నియంత్రించాడు. ఒక సారి వాడాలో క్రిస్టియన్ మతం 
గురుంచి మాట్లాడుతూ వారిని  విమర్శించాడు  దీక్షిత్. అదే రోజు బాబా దగ్గరకు వెళ్ళినప్పుడు, దీక్షిత్ తో బాబా మాట్లాడ లేదు. దీక్షిత్ తన తప్పు తెలుసుకొని, బాబా ను క్షమించమని మనసులోనే ప్రార్ధిస్తాడు.
అప్పుడు బాబా "ఎవరిని నిందించ వద్దు" అని ప్రేమతో చెప్తారు.

ఒకసారి  దీక్షిత్ రోజు తను చేసుకునే  పూజ చేసుకొని బాబాకు తాంబూలం ఇవ్వడం మరిచాడు. తరువాత బాబా దగ్గరకు వెళ్ళితే, బాబా వెంటనే "నాకు ఈ రోజు తాంబూలం ఇవ్వ లేదు " అని అంటారు. అప్పుడు దీక్షిత్ కు
సాయి యొక్క సర్వజ్ఞత అర్ధం అవుతుంది. ఇక నుంచి నేను మనస్పూర్తిగా బాబాకు పూజ చెయ్యాలి అని అనుకొంటాడు. ఎక్కడ పూజ చేసినా బాబానే స్వయంగా ఎదురుగా ఉన్నారు అన్న భావనతో ప్రార్ధన చేసేవాడు.

సాయి బంధువులారా! 
చూసారా దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. 

యద్భావం తద్భవతి అని అంటారు. సాయి ఎప్పుడూ మనలను ఒక కంట కనిపెట్టి  ఉంటారు. మనలో నమ్మకం దృడంగా ఉండాలి.

అలానే దీక్షిత్ కూతురు చనిపోయినప్పుడు, బాబా చావు పుట్టుకల గురించి చెప్పి, తనలో వ్యామోహం పోగొట్టారు. 

ఇంకోసారి దీక్షిత్  ఒక కేసు గెలిచి దాదాపు 1000 రూపాయలు ఒక ట్రంకు పెట్టెలో తెచ్చి, బాబాకు ఇదంతా నీదే బాబా అని చెప్పాడు. అప్పుడు బాబా ఆ డబ్బంతా క్షణాల్లో పంచి పెట్టారు.
కాని  దీక్షిత్ లో ఎటువంటి వ్యామోహం కనిపించదు. 

ఇలా బాబా ఒక్కో విషయంలో దీక్షిత్ లో మానసిక పరివర్తన తెచ్చి, మెల్లగా తనను ముక్తి పధం వైపు నడిపించారు. తరువాత అతనికి బాబా ఒక కఫిని కూడా ఇచ్చారు.  దీక్షిత్ ఆ కఫినీని షిర్డిలో ఉన్నప్పుడు ధరించేవాడు. 

మనం బాబాను పూర్తిగా నమ్మితే మనలో కూడా ఈ మానసిక పరివర్తన వస్తుంది.


        ఓం శ్రీ సాయి రాం



సత్సంగమే మహాభాగ్యం


సత్సంగ మహిమ గురించి శ్రీ సాయి సచ్చరితలో (మూలంలో) ఈ విధంగా చెప్పబడింది.

సత్పురుషుల చరిత్రలు మనలను సన్మార్గంలో ఉంచుతాయి. మన గురువైన శ్రీ సాయినాథుల చరిత్రను శ్రవణం, మననం, అధ్యయనం, నిధి ధ్యాసనం చేస్తే మనలో పవిత్రత పెరుగుతుంది. 

సాయిని శరణు వేడితే, ఆ సాయి మన మీద అనుగ్రహ వర్షం కురిపించినప్పుడు మనలో ఈ శ్రవణ లాలస పెరుగుతుంది. గురు కథా శ్రవణం అనే సత్సంగాన్ని ఆశ్రయించి మనం ఈ ప్రాపంచిక బాధలనుంచి దూరం కావచ్చు. ఇదే మన జీవితానికి సార్ధకతను చేకూర్చే సాధనం. 

మనస్సులో ఏ సందేహాలను ఉంచుకోకుండా సాయిని ప్రేమించాలి. మన మనస్సే సాయి నిలయం అయిపోవాలి. 

మన మనస్సు సాయి ప్రేమతో నిండాలి అంటే!

ఎల్లప్పుడూ సాయి స్మరణ చేస్తూ ఉండాలి. 

సాయి తత్వాన్ని అర్ధం చేసుకోవాలి.

సాయి చెప్పిన బోధలను మననం చేసుకుంటూ, వాటిని ఆచరిస్తూ మన జీవితంలో వెలుగును నింపుకోవాలి. 

ఆ సాయి అనే వెలుగు మనకు దారి చూపిస్తూ మనలో ప్రేమను నింపుతుంది. 

ఈ ప్రేమే మనకు బాబా చెప్పిన తత్వాన్ని మరింత బోధపడేట్లు చేస్తుంది. 

ఈ స్థితి ఎల్లప్పుడూ ఉండాలి అంటే మనకు సత్సంగం చాలా అవసరం. 

చెడు సావాసం అంత మంచిది కాదు. ఇక్కడ చేడుసావాసం అంటే చెడ్డ వాళ్ళతో తిరగడం అనే అర్ధం మాత్రమె కాదు. మన లాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళతో, అలానే బాబా కోసం పరితపించే వాళ్ళతో మెలగడం అలవాటు చేసుకోవాలి. అప్పడు మనలో మానసిక పరివర్తన వస్తుంది. 

సృష్టిలోని రూపాలు కళ్ళలో నిండినప్పుడు బాహ్య సౌందర్యాన్ని ఆపేక్షించే మనస్సు దానితో రమిస్తుంది. ఆ దృష్టి అంతర్ముఖం అయితే అది సత్సంగంలో రంజిల్లుతుంది. సత్సంగం యొక్క మహిమ అటువంటిది. అది శారిరాభిమానాన్ని సమూలంగా అణిచివేస్తుంది. అందువల్ల సత్సంగం కంటే మరో సాధన లేదు. అందుకే బాబా నిత్యం సత్సంగం చేయండి అనే చెప్పేవారు. మంచి వారితో ఉండండి అనే వారు. ఇతర సాంగత్యాలు దోషపూరితం అయినవి. శరీరం అంతటినీ నిర్మలం చేసేది, ఏ దోషాలు లేనిది సత్సంగం ఒక్కటే.

సత్సంగం శరీరం పైన ప్రీతిని, అభిమానాన్ని తొలగిస్తుంది. ఒక్క సారి దాని పట్ల శ్రద్ద కలిగితే, దాని బలవత్తర శక్తి వల్ల 
తప్పక సంసారం నుండి విముక్తి కలుగుతుంది. 

బాగ్యవశాత్తు సత్సంగం లభించిందా ఉపదేశాలను సహజంగా గ్రహించవచ్చు. చెడు వాసనలన్నీ పోయి మనసు నిర్మలమైన స్థితిలో రమిస్తుంది. 

పరమార్ధంలో ప్రవేశించడానికి విషయసుఖాల యందు విరక్తి ఒక్కటే ఉపాయం. సత్సంగాన్ని ఆశ్రయించకుండా ఆత్మ స్వరూపాన్ని తెలుసుకోలేము. 

సుఖాల వెంట దుఖాలు, దుఖాల వెంట సుఖాలు వస్తుంటాయి. జీవుడు ఎప్పుడూ సుఖాలనే ఆశిస్తూ దుఖాలకు విముఖంగా ఉంటాడు. సుఖ దుఖాలనే ఈ రెండు అనుభవాలనుంచి విముక్తిని కలిగించేది, సత్పురుషుల సాంగత్యం ఒక్కటే. 

సత్సంగం వలన జనన మరణాలు ఆగిపోతాయి. అప్పుడే మనం ఆ పరమాత్మను అనుభవ పూర్వకంగా తెలుసుకోగల్గుతాము. 

మనం అందరం సాయిని ఆ సత్సంగ భాగ్యం కలిగించమని వేడుకుందాము. ఆ సత్సంగం లభించిన తరువాత దాన్ని వదులుకోకుండా ఉండే శక్తి మనకిమ్మని ఆ సాయిని మనసా వాచా కర్మణా ప్రార్దించుదాము. 





ఓం శ్రీ సాయి రాం!

మంచిని పెంచు - నిజ జీవితానికి సాయి బోధలు


మనస్సు అంటే ఏమిటి ?

వాసనలతో కూడిన ఆలోచనల తరంగమే మనస్సు.

ఈ వాసనలు మన జీవితాన్ని సుడిగుండాలుగా మారుస్తాయి. మన మానసిక పరిస్థితి వీటిమీదే ఆధారపడి ఉంటుంది. 

మంచి ఆలోచనలు మనలో ప్రశాంతతను పెంచుతాయి. 

చెడు ఆలోచనలు మనలను కష్టాలపాలు చేస్తాయి. 

మనం రోజు నిద్రపోయే ముందు మన మనస్సు ఆలోచనల మయం అవుతుంది. వాటిలో కొన్ని మంచి ఆలోచనలు మన జీవితాన్ని మార్చేవి కూడా ఉంటాయి. వాటిని తప్పకుండా ఆచరణలో పెట్టాలి అని అనుకోని నిద్ర పోతాము. ప్రొద్దున్నే లేవగానే ఈ జీవనమనే అరణ్యంలో కొట్టుకుపోతాము. ఎవరెవరో మన జీవితాన్ని నిర్దేశిస్తారు. మన ప్రమేయం లేకుండా రోజంతా గడిచిపోతుంది. ఇంటిపనులు, పిల్లలు, వృత్తి మరియు కుటుంబ వ్యవహారాలతో అలసి పోతాము. ఈ బడలికతో నిద్రకు ఉపక్రమిస్తాము. కాని మళ్ళా అవే ఆలోచనలు. మన జీవితం మన అధీనంలో లేదన్న నిస్పృహ. ఇలా ఒక రకమైన బాధ, కోపం మరియు దైన్య స్థితి ఏర్పడుతుంది. 

బాబా అందుకే ఇలా చెప్పారు. "నీ మనస్సులో ఏదన్నా మంచి ఆలోచన వస్తే, దాన్ని పరిశీలించు, ప్రొద్దున్నే లేచి దాన్ని ఆచరణలో పెట్టు. ఇదే జ్ఞానానికి తోలి మెట్టు. ఇది నీ జీవితంలో శాంతిని ఇస్తుంది". 

ఇలా మంచి ఆలోచనలను ఆచరణలో పెట్టమని బాబా తన భక్తులను ఎంతో ప్రోత్సహించే వారు. బద్దకం అనేది వదిలించుకొమని చెప్పేవారు. చాలాసార్లు మనం చేసే పనులకు మనమే అడ్డుగా నిలుస్తాము. మనలోని న్యూనతే దీనికి కారణము. దీన్ని అధిగమించవలసిన బాధ్యత మన మీదే ఉంది. 

అందుకే మంచి ఆలోచనను వెంటనే అమలు చెయ్యాలి. దాన్ని రేపటికి వాయిదా వెయ్యకూడదు. వీటిని మనము బాగా పరిశీలిస్తాము. వాటిమీద మంచి అవగాహన కూడా వస్తుంది. కాని దాన్ని అమలు చేయడానికి వెనుకాడతాము. దీనికి మన పక్కన ఉన్న వాళ్ళను అడ్డుగా భావిస్తాము. దాని వల్ల దుఃఖం మరింత ఎక్కువ అవుతుంది. ఒక్కోసారి మన కుటుంబ సభ్యులు మరియు మన స్నేహితులు నిస్సహాయులు. కాని వారిని నిందిస్తాము. వారివలనే మనకు ఈ కష్టం కలిగినదని భావిస్తాము. 

మనకు మనమే చేసుకోలేనప్పుడు ఇతరులు ఎలా చేస్తారు. మన జీవితాన్ని మనమే సరిదిద్దుకోవాలి. 

మన మనస్సే మన ప్రపంచం. 

మనస్సుతో మనం ఎలా చూస్తామో, అలానే ఈ ప్రపంచం కనిపిస్తుంది. 

మాయ అనే పొర కప్పినప్పుడు మన ఆలోచనా విధానం సరిగ్గా ఉండదు. 

మనం ఎన్నో జన్మలగా ఈ మనస్సులోని వాసనలకు బానిసలం అయ్యాము. వాటినుంచి బయటపడలేము. 

మన మనస్సు, అందులో చెలరేగే ఆలోచనలు, వాటినుంచి ఉద్భవించే ప్రేమానురాగాలు, ద్వేషం మొదలైనవన్ని మన జీవితాన్ని నిర్దేశిస్తాయి. 

ఆలోచనలు మాటల రూపంలో బయటకు వస్తే అదే మనం మాట్లాడే భాష  అవుతుంది.  ఈ భాష మనకు ఒక వ్యక్తిత్వాన్ని ఆపాదిస్తుంది. ఇది ఒక అలవాటుగా మారి అదే మన జీవన విధానం అవుతుంది. ఈ విధానం మంచిది అయితే మనలో మంచి మార్పులు కలుగుతాయి. లేకపోతే అధోపాతాళానికి తొక్కేస్తాయి. 

ఒక మంచి ఆలోచన మనలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. 

చెడు ఆలోచనలు ఈ శక్తిని తగ్గిస్తాయి. 

మరి ఏది కావాలో మనమే నిర్ణయించుకోవాలి. 

వ్యతిరేక భావనలతో మనము మన జీవితాన్ని నాశనం చేసుకోకూడదు. 

అన్నింటిలో మంచిని చూస్తూ మన మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోవడమే మన జీవితం యొక్క పరమావధి. ఇది ఎప్పుడు అలవాటు చేసుకుంటామో అప్పుడు బాబా మనకు నేర్పాలనుకున్న సర్వవ్యాపకత్వం మనకు అర్ధం అవుతుంది.




ఓం సాయి రామ్! 

జ్ఞాన జ్యోతి - నిజ జీవితానికి సాయి బోధలు


షిర్డీ సాయి సాకారుడిగా శరీరంలో ఉన్నప్పుడు ఎన్నో చమత్కారాలు చేసి మన మనస్సులను మార్చే ప్రయత్నం చెసారు. సాయి నిరాకారుడుగా మన అందరి హృదయాలలో ఉండి మనకు ఎన్నో అనుభూతులను, చమత్కారాలను చూపిస్తూనే ఉంటారు. ఈ సత్యాన్ని మనం ఎప్పటికి మరవకూడదు. 

మనకు కష్టం వచ్చినప్పుడు మాత్రమే సాయిని తలవటం కాదు, మన మనస్సే సాయి నిలయం కావాలి. అప్పుడు కష్టం గురుంచిన ఆలోచనే మనకు రాదు. ఒక వేళ వచ్చినా అది అంతగా మనలను బాధ పెట్టదు. మనం ఈ కష్టాల వలయం వద్దని కోరుకుంటాము, కాని మనం ఆ వలయంలోనే జీవించి ఉండాల్సి ఉంది. మనము ఈ క్షణికమైన జీవితాన్ని, ఈ వలయాన్ని దాటి పరమాత్మ తత్త్వం అనే సత్యాన్ని అర్థం చేసుకోవాలని సాయి తపన పడుతూనే ఉంటారు. శ్రద్ధ సహనాలనే మంత్రాలతో ఈ సత్యాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలని మనకు బోధ చేసారు. 

బాబా చేసిన చమత్కారాలలో ఉండే ఆధ్యాత్మిక బోధలను మనం అర్ధం చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి. వాటిని అర్థం చేసుకుంటే మానవ జన్మ లక్ష్యం ఏమిటో మనకు అవగతం అవుతుంది. ఈ లక్ష్యాన్ని చేరటానికి కావాల్సిన సాధనాసామాగ్రిని మనకు ఇచ్చి, బాబా మన దగ్గరే ఉండి మనలను అనుగ్రహిస్తారు. అటువంటి ఆధ్యాత్మిక అర్ధం ఉన్న చమత్కారమే నీటితో దీపాలను వెలిగించిన సన్నివేశం. కాని దీన్నీ ఒక చమత్కారంలాగా మాత్రమె చూడకుండా దాన్లో ఉన్న అర్ధాన్ని గ్రహించాలి.

ఈ నీటి దీపాల గురించి సాయి సచ్చరితలో ఇలా చెప్పబడింది. 

మొదట్లో సాయి సమర్ధులకు దీపొత్సవమ్ అంటే చాలా ప్రీతి. అందుకోసం వారు స్వయంగా దుఖాణదారుల వద్దకు వెళ్లి నూనెను అడిగేవారు. రేకు డబ్బా పుచ్చుకొని నూనె తెచ్చి దీపాలను వెలిగించెవారు. అలా కొన్ని రోజులు ఆగకుండా ఈ ప్రక్రియ సాగింది. దీపారాదన అన్నబాబాకు బహుప్రేమ. దీపావళి వలె దీపోత్సవాన్ని చేసేవారు. చింకి గుడ్డలతో వత్తులు చేసి మసీదులో దీపాలను వెలిగించేవారు. 

రోజూ ఉచితంగా నూనె అడిగి తెచ్చేవారు. దాంతో వ్యాపారుల మనస్సులో దురాలోచన కలిగింది. అందరూ కలిసి బాబాకు నూనె ఇవ్వకూడదని అనుకోని బాబా వచ్చినప్పుడు నూనె లేదని చెప్తారు. బాబా మౌనంగా తిరిగి వస్తారు. అప్పుడు బాబా ఏమిచేస్తారో అని వాళ్ళందరు వింతగా చూడసాగారు. బాబా మసీదులో ఉన్న రేకు డబ్బాను తీసుకోని దాంట్లో ఉన్న కొంచం నూనేను తాగేశారు. ఆ విధంగా బ్రహ్మాఅర్పణ చేసి ఒట్టి నీటిని ప్రమిదలలో పోశారు. తరువాత ఆ నీటిలో పొడి వత్తులను తడిపి అగ్గిపుల్లను గీచి దీపాలను వెలిగించారు. నీటితో దీపాలు వెలగటం చూసి వర్తకులు ముక్కు మీద వేలు వేసుకున్నారు. మేము బాబాతో అబద్దం చెప్పామని వారిలో వారు అనుకున్నారు. కొంచమైన నూనె లేకుండా నీటితో దీపాలు రాత్రంతా వెలగటం చూసి వర్తకులు సాయి అనుగ్రహానికి పాత్రులు కారని అందరు అనుకొన్నారు. బాబా యొక్క సామర్ద్యం తెలియక తప్పు చేసామని వర్తకులు పశ్చాత్తాప పడ్డారు. కాని బాబా మనసుని జయించిన వారు. వారికి రాగద్వేషాలు ఉండవు. వారికి శత్రువులు మిత్రులూ అంటూ లేరు. వారికి అన్ని ప్రాణులు సమానమే. 

ఈ సన్నివేశం లోని అర్థం


ఈ కథలోని అర్ధాన్ని మనం అర్ధం చేసుకోవాలంటే మనం కాకడ ఆరతి గుర్తు చేసుకోవాలి. మనం ఈ అరతిలో ఈ విధంగా పాడుకొంటాము. 

కాకడ ఆరతి కరీతో సాయి నాథ దేవా!చిన్మయ రూపా దాఖవి ఘేవుని బాలక లఘు సేవా!!

హే సాయి ప్రభూ: నీకు కాకడ హారతి అర్పిస్తున్నాను! పసివాడను అయిన నా సేవను ప్రేమతో స్వీకరించి, నీ చిన్మయరూపం నాకు ద్యోతకం అయ్యేటట్టు చేయి దేవా!!





కామ క్రోధ మద మత్సర - ఆటుని కాకడ కెలా!
వైరాగ్యాచే తూప కాడుని మీతో బిజవీలా!  
సాయి నాథుని గురు భక్తి జ్వలినేతోమీ పేటవిలా! 
తద్ వృత్తి జాలునీ గురునే - ప్రకాశపాడిలా!! 

ద్వైతతమా నాసునీ- మిళవీ తత్స్వరూపి జీవా!!!

అరిషడ్ వర్గాలతో ఉన్న నా మనస్సును ఒత్తిగా చేసి,
వైరాగ్యం అనే నేతితో తడిపి, 
నీ ఫైనున్న అనన్య భక్తి అనే జ్యోతిని వెలిగించాను. 
ఆ కాంతిలో నా గురు దేవుడు ప్రకాశవంతంగా కనిపించారు. 
ద్వైతభావం నశించి, తత్స్వరూపిగా జీవుడు మిగిలాడు.  


ఆధ్యాత్మిక భావం

సాయి మనలను అడుగుతున్నది ఏమిటి?

ఈ జీవన వ్యాపారం చేసే వర్తకులం అయిన మననుంచి సాయి అడిగే తైలం ఏమిటి?

ఈ కథలో లాగా మనమందరమూ నూనె వర్తకులమే. ఇక్కడ నూనె అంటే వైరాగ్యము.

బాబా అడిగేది శ్రద్దా సబూరి మాత్రమే. కాని మనం కూడా ఆ వ్యాపారుల లాగా బాబా అడిగిన దాన్ని ఇవ్వము. 

కాకడ అరతిలో చెప్పినట్లుగా కామ క్రోధ లోభ మోహ మద మాత్స్యర్యములను అరిషడ్ వర్గములను వదులుకోలేము. ఈ ఆరింటిని ఒక వత్తిలాగా చేసి, వైరాగ్యం అనే నేతిలో ముంచి, భక్తి అనే భావనతో ఉన్నప్పుడు సాయి సమర్ధులు ఈ దీపాన్ని వెలిగిస్తారు. ఈ దీపం వెలిగించితే, ఇక అజ్ఞానమనే అంధకారం తోలిగిపోతుంది. అప్పుడు మన జీవితం జ్ఞానవంతం అవుతుంది. అప్పుడు జీవుడికి ద్వైత భావన తొలిగిపోయి తనే పరమాత్మననే అనుభూతిలో ఉండిపోతాడు. 

మనం బాబా అడిగిన శ్రద్ద సబూరిలను ఇవ్వక పోయినా సాయి మనలను ఎప్పుడూ క్షమిస్తూనే ఉంటారు. 

ఆయన అపర దయామూర్తి. 

అయన కరుణా పూర్వకమైన చూపులే చాలు మనలను జాగృతం చేయడానికి. 

అయన మనలను అనుగ్రహించే ప్రక్రియలో చూపించే సహనం అద్వితీయం. 

ఒక్కసారి మనం కనుక అయన అడిగింది ఇవ్వడం ప్రారంబిస్తే ఇక సాయి అనుగ్రహానికి అంతే ఉండదు. 
సాయి మనలను మన గమ్యానికి చేర్చిందాక వదలరు. 

సాయి ఎలాగైతే నీటితో దీపాలను వెలిగించారో అలానే ఏ అష్టాంగ సాధనల అవసరం లేకుండా  మనకు ఆత్మసాక్షాత్కారం కలగ చేస్తారు. మనకు కావాల్సిందల్లా సాయిఫై అపారనమ్మకం. 

మనలో ఆ తైలం కాస్తంత తగ్గినా, లేకపోయినా కేవలం నీటితోనే మనలో ఆ దీపాన్ని వెలిగిస్తారు. 

అటువంటి నమ్మకాన్ని మనం కలిగిఉందాము. 

ఎన్ని అడ్డంకులు వచ్చినా ఈ గురు మార్గంలోనే నడుద్దాం. 

సాయి అనే తారక మంత్రాన్ని గట్టిగా పట్టుకుందాం. 




ఓం శ్రీ సాయి రామ్ !      

ఈశావాశ్యం - నిజ జీవితానికి సాయి బోధలు


ఒకసారి దాసగణు మహారాజు గారు ఈశావాశ్య ఉపనిషత్ మీద చక్కటి భాష్యం వ్రాయాలని సంకల్పించి, చందోబద్ధంగా ఓవిలతో వ్రాసారు. దానిని చాలామంది ఆమోదించి గౌరవించారు. అతని కోరిక నెరవెరినది. కాని అతనికి ఒక సందేహం తీరలేదు. దానిని అతడు పండితుల ముందు ఉంచాడు. చాలా చర్చలు జరిగినా అతని సందేహం తీరలేదు. ఆ తరువాత అతడు షిర్డి రావడం జరిగింది. బాబాను దీని అర్థం బోధించమని ప్రార్ధించాడు. 

అప్పుడు బాబా "దీనిలో కష్టం ఏముంది! నీవు ఎక్కడనుంచి వచ్చావో అక్కడికి మరల వెళ్ళినప్పుడు కాకా పని మనిషి నీ సందేహాన్ని తీరుస్తుంది" అని చెప్పారు. పని పిల్ల దీనికి అర్థం చెప్పడం ఏమిటి? సాయి పరిహాసం చేస్తున్నారు అని అక్కడ ఉన్న వారు అనుకొన్నారు. కాని దాసగణుకు బాబా చెప్పినది సత్యం అని తెలుసు. 

ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమంటే? మనలో భావన ఎలా ఉంటే ఫలితం అలా ఉంటుంది. గురువు చెప్పిన ప్రతి మాట బ్రహ్మ లిఖితమే. వారు ఉపయోగం లేకుండా ఏమీ చెప్పరు. 

సరే ఆ తరువాత గణు కాకా ఇంటికి వెళ్తాడు. తను నిద్రలో ఉండగా ఒక మధురగానం వినిపించింది. ఆ గానం ఆ ఇంట్లో పని చేసే ఒక నౌకరు యొక్క చెల్లెలుది . ఆ అమ్మాయికి ఎనిమిది ఏళ్ళు ఉంటాయి. తను ఒక చినిగిన గుడ్డ ముక్కను నడుముకు కట్టుకొని నారింజ చీర అందాన్ని వర్ణిస్తూ పాటపాడుతూ ఉంది. తినటానికి తిండి లేదు, కట్టుకోవడానికి సరిపడా బట్ట లేదు, ఐనా ఆమె ఎంతో సంతోషంగా ఉంది. 

ఆపిల్ల యొక్క స్థితిని చూసి, ప్రధాన్ గారి చేత ఒక కొత్త చీర ఇప్పించారు. మరునాడు ఆ అమ్మాయి ఆ చీర కట్టుకొని ఆనందంతో గంతులు వేసింది. తరువాతి రోజు కొత్త చీరను దాచుకొని మరల చినిగిన గుడ్డ కట్టుకొని పనిలోకి వచ్చింది. ఆ అమ్మాయిలో అదే ఆనందం. కొత్తచీర కట్టుకోలేదు అన్న బాధ ఎక్కడా కన్పించలేదు. ఇదంతా చూసిన దాసగణు మహారాజుకి  ఈశావాశ్య ఉపనిషత్ యొక్క అర్థం బోధపడింది. 

ఇక్కడ దాసగణు మహారాజుకు అర్థం అయిన విషయాలు ఏమిటి? ఈ విషయాలు బాబానే స్వయంగా షిర్డీలోనే చెప్పిఉండవచ్చుకదా! కానీ బాబా అలా చేయలేదు. బాబా ఎప్పుడూ అనుభవపూర్వకముగానె నేర్పిస్తారు. 

ఈశావాశ్య ఉపనిషత్లో 18 మంత్రాలు ఉన్నాయి. 

ఈశ అంటే ఈశ్వరుడు, వాశ అంటే అంతా వ్యాపించి ఉన్నవాడు అని అర్థం. 

బాబా షిర్డీలోనే ఈ విషయాన్ని నేర్పించవచ్చు. అంతటా నేనే ఉన్నా, పని పిల్లలో కూడా నేనే ఉన్నా, అని ఆమె ద్వారా నేర్పించడం అనేది ముఖ్యమైన విషయం. 

భగవంతుడు సర్వవ్యాపి, పూర్ణుడు అని మొట్ట మొదటి మంత్రంలో చెప్పబడింది. ఈ ప్రపంచమంతా పరమేశ్వరుడు వ్యాపించి ఉన్నప్పుడు ఆయన లేని స్థలం ఉంటుందా. 

పరమాత్మనుంచే పూర్ణ జగత్తు వచ్చింది. 

పనిపిల్ల యొక్క పేదరికం ఈశ్వరుని అంశం. 

చినిగిన చీర కూడా ఈశ్వరుని అంశమే.

దాత, దానం, దేయం; ఇవన్నీ కూడా ఈశ్వరునిలో భాగాలే.

నేను నాది అన్న భావనను పారద్రోలి ఎప్పుడూ నిరభిమానంగా ఉంటూ సుఖాలను త్యాగపూర్వకంగా అనుభవించాలి. 

ఇక్కడ పని పిల్ల మంచి చీర కట్టుకున్నప్పుడు, అది లేనప్పుడూ ఆనందంగానే ఉంది. ఇదే బాబా మనకు నేర్పించాలనుకున్న సత్యం. ఈ భావం "తేన త్యక్తేన భుంజీధా" అనే మంత్రంలో చెప్పబడింది. దీన్నే బాబా మనకు సులభంగా నేర్పించారు. ఈ ప్రాపంచిక సుఖాలను త్యజించడం చాలా కష్టం. మనకి అంతర్ దృష్టి కలగడం కూడా కష్టమే. అందుకే "త్యక్తేన భుంజీధా" అని అన్నారు. సుఖాలను త్యాగపూర్వకంగా అనుభవించాలి. 

ఈ వస్తువులన్నీ పరమాత్మకు చెందినవి. ఆయనే మనకు వాటిని ప్రసాదించాడు. ఈ లోకంలో వేటిని మనం వెంట తెచ్చుకోలేదు, చనిపోయినప్పుడు దేన్నీ వెంట తీసుకువెళ్ళలేము. మనం ఇక్కడకు వచ్చేటప్పడికి అన్ని తయారుగా ఉన్నాయి. నీరు, గాలి, భూమి, అగ్ని, ఆకాశం, వెలుగు, చెట్లు మరియు నదులు ఇట్లా అన్ని తయారుచేసి మనకు ఇచ్చారు. వాటిని మనం పరమాత్మ ప్రసాదంగా అనుభవించాలి. ఇదే మన మనస్సుకు హత్తుకోవాల్సిన విషయం. 

ఈ సృష్టిలో మనందరి అవసరాల కోసం భగవంతుడు అవసరం అయినంత వరకు ఇచ్చాడు. అందులో మన వాటా మనం అనుభవించాలి. అప్పుడు ఇతరులు తమ వాటా తాము అనుభవించగలుగుతారు. కాని కొందరు స్వార్ధంతో అధికభాగాన్ని అన్యాయంగా లాక్కుని మరి కూడబెడ్తారు. ఇట్లా చేసిన వారి గతి ఏమిటి? వారు ఏ లోకాలకు వెళ్తారు అనే విషయాన్ని కూడా ఈ ఉపనిషత్ చెప్తుంది. 

ఇక్కడ త్యజించి అనుభవించడం అంటే మనం అరటి పండు తొక్క తీసేసి లోపల ఉన్న దాన్ని తింటాము. అలానే ఈ నామరూపాత్మకం అయిన జగత్తులో ఉన్న తొడుగు తీసేస్తే అప్పుడు మనకు పరమాత్మ కన్పిస్తారు. 

మన కథలో పని పిల్ల, చిరిగిన చీర, కొత్త చీర, దానం ఇట్లా చాల విషయాలు ఉన్నాయి.

పరిస్తితులు ఎట్లా ఉన్నా మన పని చేస్తూ ఆనందంగా ఉండటమే పరమాత్మ తత్త్వం. 

బాబా ఈ విషయాలను నోటితో చెప్పవచ్చు, కాని దాసగణు మహారాజుకి ఈ దివ్యానుభవం ద్వారా ఆయన అనుమానాలన్నీ తీర్చారు. అంతేకాకుండా ఆయనకు పరమ ఆనందానుభూతిని కలుగచెసారు. 





ఓం శ్రీ సాయి రామ్!

దీపస్తంభములు - నిజజీవితానికి సాయి బోధలు





మన జీవితంలో ప్రతిరోజూ ఉదయాస్తమానాలు అవుతాయి. అలాగే అనేక సంవత్సరాలు వృధాగా గడిచిపోతాయి. సగం జన్మ నిద్రావస్థలో గడిచిపోతుంది. మిగిలిన జీవితాన్ని ఐనా సరిగ్గా అనుభవించము. బాల్యం అంతా క్రీడలతో సరిపోతుంది. యుక్త వయసులో విషయ వాసనలు అలరింపచేస్తాయి. వృద్ధాభ్యంలో జరాగ్రస్తులు అయి ఎప్పుడూ వ్యాధులతో పీడింపబడుతూ ఉంటాము. 

పుట్టడం, బాగా పుష్టిగా పెరగటం, గాలిని పీలుస్తూ వదులుతూ చాలా కాలం బ్రతకటం, వీనితో జన్మ సార్ధకం ఐనట్లా? మానవ జన్మ కర్తవ్యం పరమార్ధ ప్రాప్తి. ఇదే సత్యం. 

పంచభూతాత్మకము అయిన ఈ నశ్వర శరీరం ద్వారా మాత్రమే మనము ఆ భగవంతుడిని తెలుసుకొగలము. జననమరణాలు ఎప్పుడూ వెంటే ఉంటాయి. వీటినితలుచుకుంటేనే దారుణ భయం కలుగుతుంది. అకస్మాత్తుగా ప్రాణం వెళ్లిపోతుంది. పగలురాత్రులు ఎంతమంది వస్తున్నారో మరిఎంతమంది వెళ్ళిపోతున్నారో ఎవరు గమనిస్తున్నారు?

క్షణభంగురం అయిన ఈ శరీరంలో, పుణ్యం సంపాదించి పెట్టే భగవంతుని గూర్చి తెలుసుకొనే సమయమే సార్ధకం అవుతుంది. మిగతాకాలం అంతా వ్యర్ధం. దీనిని బాగా నిశ్చయంగా తెలుసుకోవటమే ఈ జన్మకు సార్ధకం. కాని ఎవరికైన అనుభవం లేకుండా విశ్వాసం కుదరదు. ఈ అనుభవానికి బాగా అభ్యాసం చేయాలి. అప్పుడే శాశ్వతం అయిన ఆనందాన్ని ఆశించే జీవుడు ఈ వైభవాన్ని సాధించగలడు. 

కలియుగంలో నామస్మరణే మనలను పరమార్దానికి దగ్గర చేస్తుందని మన శాస్త్రాలు చెప్తాయి. అలానే సాయి నామము మనలను ఆ లక్ష్యానికి చేరువ చేస్తుంది. అందుకే హేమాద్పంత్ శ్రీ సాయిసత్చరితలో ఈ విధంగా తెలపడం జరిగింది. 

సముద్రంలో ఓడలు సుడిగుండాలలో చిక్కుకుపోకుండా, పెద్ద రాతి బండలు కొట్టుకోకుండా, నిరాటంకంగా సాగిపోవడానికి, అపాయాలను సూచించే ఎర్రటి దీపస్తంభాలను (లైట్ హౌసెస్) నిర్మిస్తారు. ఈ దీపపు స్తంభాలు ఆ నావలు ఓడ్డుకు చేరటానికి ఉపయోగపడ్తాయి. చీకటిలో వాటికి దారి చూపిస్తాయి. 

సాయినాథుని మధురమైన కథలు అమృతం సహితం సిగ్గుపడేలా, దుస్తరం అయిన భవసాగర మార్గాన్ని అతి సులువుగా దాటింపచేస్తాయి.

సాయి కథలు ధన్యం. 

వారి కథలు శ్రవణం ద్వారా హృదయంలోకి ప్రవేశించి శరీరాభిమానాన్ని బయటకు నేట్టివేస్తాయి. 

సుఖదుఖాలనే ద్వంద్వాలు ఉండవు. 

సాయి కథలను హృదయంలో భద్రపరుచుకుంటే మనసులోని వికల్పాలు నలు దిక్కులా పారిపోతాయి. 

బాబా యొక్క నిర్మలమైన యశస్సును వర్ణిస్తే, ప్రేమతో శ్రవణం చేస్తే భక్తుల కల్మషాలు దహించుకు పోతాయి. 

సాయి చరిత్ర మనకు జ్ఞానాన్ని ప్రసాదించి, అహంభావాన్ని నశించేటట్లు చేస్తుంది. అహం నశిస్తే ఆత్మసాక్షాత్కారం కల్గుతుంది 



సాయి బంధువులారా! 

మనం జీవనమనే సముద్రంలో సుడిగుండాలలో పడకుండా ఉండాలంటే సాయి మంత్రం అనే నావ కావాలి.

మనము సాయి అనే దీపస్తంభాన్ని ఆధారంగా చేసుకొని, పూర్తి శ్రద్ధా సబూరిలతో తీరాన్ని చేరుకుందాము.

సాయినాధులు చూపించిన గురు మార్గాన్నే ఎంచుకుందాము.

మరే దిక్కుకు వెళ్ళే ఆలోచనకూడా చేయద్దు.
  
ఆయనే మనలను రక్షిస్తూ గమ్యానికి చేరుస్తారు.

సాయిఫై పూర్తి నమ్మకం ఉంచుదాము. 



ఓం శ్రీ సాయిరాం!               

నిజజీవితానికి సాయి బోధలు - కోరికలు



మానవుడు పుట్టిన దగ్గరనుంచి చనిపోయేదాకా కోరికల వలయంలో పడి సతమవుతూ ఉంటాడు. ఈ కోరికల్లో మనకు సుఖం లభిస్తూ ఉంటే, మరి మనకు దుఃఖం ఎందుకు కలుగుతోంది?

కోరికలు ఉండటం తప్పా!


కోరికలు తీర్చుకోవడం మంచిదా ! కాదా !


అలానే కోర్కెలు అణుచుకోవడం సరియైనదేనా !


అసలు వీటిగురించి ఎందుకు ఆలోచించాలి? అందరిలాగా జీవితం ఎందుకు గడపగూడదు ?


ఇక్కడ సమస్య ఏమిటి అంటే, కోరికలు కావాలి కానీ, వాటివల్ల మనకు దుఃఖం కలుగకూడదు. 


ఒక వస్తువుని మనం పొందాలి అంటే, అందుకు మనకు అర్హత కావాలి. ఈ అర్హత అనేది మనకు లేనప్పుడు, మరియు మనము సరియైన ప్రయత్నం చేయనప్పుడు, మనకు ఆ వస్తువు దక్కదు. మనం అనుకున్నది జరుగనప్పుడు మన మనసుకి కష్టం కలుగుతుంది. 


మన శాస్త్రాలన్నీ, కోరికలను నియంత్రించమని, వాటిని అదుపులో ఉంచమని చెప్తాయి. కానీ సామాన్యమానవులకు ఇది చాలా కష్టతరం అయినది. 


అందుకే బాబా ఇలా అనేవారు.


"నా భక్తులు రకరకాల కోరికలతో నా దగ్గరకు వస్తారు. మొట్టమొదట వారి కోరికలు తీర్చుతూ వారిని సక్రమమార్గములో నడిపిస్తాను.  వారికి విషయవాసనలమీదే మనస్సు ఉంటే, వాళ్ళు మామిడి పూతలాగా రాలిపొతారు".


మనము ఈ కోరికల వలయము నుండి బయట పడాలి. బాబా మనకు ఇవ్వాలి అనుకున్నఖజానాని మనం పొందాలి. భగవంతుని పట్ల శ్రద్ధతో ఉండి, బాబా చూపిన మార్గములో నడిస్తే మనకు ఈ కొరికలవల్ల కలిగే దుఃఖమునుండి విముక్తి కలుగుతుంది. 


కోరికలను నియంత్రించే మార్గము - అర్థం చేసుకోవాల్సిన విషయాలు:

విషయములందు ఆసక్తి :

మనం వస్తువుల గురించి ఆలోచిన్చేకొలది, వాటిమీద ఆసక్తి పెరుగుతుంది. ఆసక్తివలన ఆ విషయములను పొందాలని అనిపిస్తుంది. ఈ విషయాన్నే భగవద్గీత సాంఖ్య యోగంలో భగవానుడు మనకు చెప్పడం జరిగింది. 

కోరిక కర్మకు దారి తీస్తుంది:

మనము ఒక వస్తువు గురించి ఆలోచించగా, ఆలోచించగా, దాని మీద ఆసక్తి కలిగితే, మనస్సులో నానా విధములు అయిన సుఖాల ప్రాప్తి కొరకు ఇచ్ఛలు ప్రబలమగును. ఈ కోరిక తీరడానికి మనము ఏది అయిన చేయడానికి సిద్ధపడతాము.                   

కోరికలోనుంచే కోపం పుడ్తుంది:
మన కోరిక ప్రబలం అయినప్పుడు, ఆ కోరిక తీరనప్పుడు, మనము కారణాలకోసం వెదుకుతాము. ఈ కారణము ఒక పరిస్థితి వల్ల కాని, లేదా ఒక వ్యక్తి ద్వారా కాని సంభవిస్తే, మనకు చాలా క్రోధము కల్గుతుంది.

కోపము వలన మనలో వివేక శక్తి నశిస్తుంది. అప్పుడు మంచి చెడ్డల గురుంచి ఆలొచించము. ఇటువంటి పరిస్తితుల్లో మనల్ని మనము నియత్రించుకోలేము. దీనివల్ల కష్టాలను కొనితెచ్చుకుంటాము. ఈ జన్మలో అనుభవించేదే కాకుండా, వచ్చే జన్మలో కూడా దీని ఫలితం అనుభవించాల్సి ఉంటుంది. ఆ తరువాత అయ్యో నాకే కష్టాలు ఎందుకు వస్తున్నాయి అని బాధ పడతాము.

కోరికలను హృదయముతో అర్థం చేసుకోవాలి:
కోరికలు కలగడం సహజం. బాబా వాటిని అడగద్దు అని చెప్పలెదు. కానీ వాటిని తీర్చుకొనే ముందు, వాటిని నాకు సమర్పించు, అప్పుడు ఆ కోరిక నువ్వు తీర్చుకోవచ్చా లేదా అన్న విచక్షణ నీలో కల్గుతుంది అని చెప్పారు. 

మనము ఒక కోరిక గురుంచి ఆలోచించినప్పుడు, లేదా దాన్ని అనుభవించినప్పుడు మన మానసిక పరిస్థితి ఏమిటీ అన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. 

నము విషయసుఖాలను ఇంద్రియాలద్వారా అనుభవించడానికి అలవాటుపడ్డాము. కాని ఇక్కడ ఒక మెట్టు ఫైకి ఎక్కి, వాటిని హృదయంతో ఆస్వాదించటం నేర్చుకోవాలి. 

మామూలుగా మనము ఈ సుఖాల తరంగాలను వస్తువుల వైపు పోనిస్తాము. దానివల్ల పూర్తి ఆనందాన్ని అనుభవించలేము. ఇలా మనము సుఖాల వైపు పరుగులు తీస్తూనే ఉంటాము. ఒక కోరిక చాలా కోరికలకు మూల కారణం అవుతుంది. కోరిక ఎప్పటికీ తీరదు.  అందుకే, ఈ తరంగాలను హృదయం వైపు త్రిప్పాలి. వాటిని నిజంగా అర్థం చేసుకున్నప్పుడు వాటి మీద వ్యామోహం తగ్గుతుంది. 

బాబా చెప్పిన సులభమైన మార్గం ఏమిటి?


"విషయ సుఖాలను నాకు అర్పించి అనుభవించు" అని చెప్పారు. 


మనము  సాయిని స్మరించకుండా యే వస్తువును పంచ ఇంద్రియములతో అనుభవించరాదు.     

ఇలా చేయడం వల్ల మనకు విచక్షణా శక్తి వస్తుంది. 


ఆ కోరికవల్ల ప్రాప్తించిన సుఖంయొక్క విలువ తెలుస్తుంది. 


ఆ విలువను మనం అర్థం చేసుకున్నప్పుడు, దానిపట్ల ఆసక్తి తగ్గుతుంది. 


అప్పుడు అరిషడ్వర్గాలు అదుపులో ఉంటాయి. మనస్సుకు శాంతి లభిస్తుంది. 


శాంతి కలిగితే, మనకు గురువు పట్ల శ్రద్ధ కుదురుతుంది. 


దీనివల్ల మనము బాబాను ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటాము. మనకు బాబా ద్యానము ఎన్నో రెట్లు  వృద్దిపొందును. బాబా సగుణ స్వరూపము మన కండ్ల ఎదుట నిలుచును. అప్పుడు భక్తి, వైరాగ్యం, మోక్షము మన వశమవును.     
 

సాయి బంధువులారా!

కోరికలను అర్థం చేసుకుందాము.
వాటి అవసరం మనకు ఎంతవరకు ఉందో తెలుసుకుందాము.

మనకు అక్కరలేని వాటికోసం పరుగులు ఆపేద్దాం.

మన దృష్టిని సాయి వైపు మరల్చుదాము.

సాయి అనుగ్రహాన్ని పొంది, మామిడి పూతలాగ రాలిపోకుండా ఆయన బాటలో నడుద్దాం. 



ఓం సాయి రాం !       

        

No comments:

Post a Comment