In human life, the guru's place is pre-eminent. By keeping utmost faith in Guru alone, everything is obtained.
A devotee's entire strength is due to his guru. Devotion to the guru is superior to devotion to gods and goddesses.
The guru is the supreme being.
సాయి రూపాన్నే ధ్యానిద్దాము, సాయి పాదాలనే పూజిద్దాము !
సాయి మాటలే మన మంత్రాలు, సాయి కృపే మనకు మోక్షము!!


Wednesday, August 31, 2016

తస్మై శ్రీ గురవే నమః - గురు గీత


  


గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః !
గురు రేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః !!

మనం చిన్నప్పటినుంచి చదువుకున్న, మరియు అందరికి బాగా తెలిసిన శ్లోకం ఇది. ఈ శ్లోకం గురు గీతలోనిది. గురువే బ్రహ్మ, విష్ణువు, గురువే మహేశ్వరుడు, గురువే పరబ్రహ్మము. అలాంటి శ్రీ గురువుకి నమస్కారము అని ఈ శ్లోకం చెపుతుంది. 

గురు గీత తస్మై శ్రీ గురవే నమః అని కొన్ని శ్లోకాలతో  గురువుకి మనం ఎందుకు నమస్కరించాలో చెప్పడం జరిగింది. 

సంసార వృక్షం ఎక్కి నరకమనే సముద్రంలో పడుతున్న లోకాలన్నిటినీ ఉద్ధరించే శ్రీ గురువుకి నమస్కారము. 

ఇక్కడ సంసారం అంటే ఏమిటి?
మనకు సంసారం అంటే ఈ శరీరమే. మనం చేసే పనులన్నీ ఈ శరీర భావనతోనే జరిగిపోతూ ఉంటాయి. అసలు సంసారం అంటే, మనం పుట్టడం, చనిపోవడం మరల పుట్టడం. ఇలా జన్మజన్మలలో ఈ సుఖ దుఃఖాలను అనుభవించడం. ఇలా అనుభవించడమే స్వర్గ నరకాలు. దీన్ని చెట్టుతో ఎందుకు పోల్చారు అంటే, దానికున్న కొమ్మలు, ఆకులు లాగా మన జీవితాలుకూడా అంతులేకుండ సాగి పోతూ ఉంటాయి. ఎన్ని ఆలోచనలు, ఎన్ని బంధాలు, ఎన్ని ఆశలు, ఎన్ని సుఖాలు మరియు ఎన్ని దుఃఖాలు. ఇలా అంతులేని సముద్రంలాగా లోతులో కూరుకుపోయి ఉంటాము. దీన్నుంచి మనలను రక్షించేది శ్రీ గురువు ఒక్కరే. అందుకే శ్రీ గురువుకి నమస్కారము అని గురు గీత బోధిస్తుంది. 

అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం !
తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః !!

ఈ శ్లోకం కూడా గురుగీత లోనిదే. ఇక్కడ పరమశివుడు అతి ఉన్నతమైన జ్ఞానాన్ని బోధించారు. 
తత్వమసి అనే మహావాక్యంలో ఉన్న ఈ "తత్" అనే పరమాత్మ తత్వాన్ని చెపుతూ, అఖండమై, బ్రహ్మాండ మండలాకారమై సమస్త జీవులలోను వ్యాపించి ఉన్న పరబ్రహ్మను నాకు దర్శింప చేసిన శ్రీ గురువుకి నమస్కారము. 

షిర్డీ సాయి సర్వ జీవులలో ఉన్న ఈ పరమాత్మ తత్త్వం మనకు అనుభవంలోకి రావాలి అని, అయన అన్ని జీవుల రూపంలో ఉన్న తనను చూడమని చెప్పారు. అలాగే సాయి ఏ దేవత రూపంలో దర్శనమిచ్చినా ఈ భావాన్ని మనకు అర్ధం అయ్యేలాగా చెయ్యడానికే అని మనం తెలుసుకోవాలి. 

ఇంకా గురు గీత ఇలా చెపుతుంది. 

చైతన్యం శాశ్వతం శాంతం మాయాతీతం నిరంజనం !
నాదబిందు కలాతీతం తస్మై శ్రీ గురవే నమః !!

చైతన్యం అంటే పరమాత్మ. ఇది మొదలు చివరలు లేనిది. శాంతమైనది. మాయకు అతీతమైనది. అది నిరంజనము. నాద బిందు కళలకు అతీతమైనది. అట్టి చైతన్య స్వరూపుడు అయిన శ్రీ గురువుకి నమస్కారము. 

వేదములు ఆయన పాదాలకు నమస్కరిస్తున్నాయి. వేదములను శ్రుతులు అని కూడా అంటారు. ఈ శృతి రత్నాల కాంతులు ఈ శ్రీ గురువు పాదాలపై పడి నీరాజనం ఇస్తూ ఉంటాయి అని గురు గీత చెపుతుంది. అంటే ఈ వేదాలు చెప్పే జ్ఞాన సిద్ధికి గురు శరణాగతి, మరియు గురువు అనుగ్రహం కన్నా మరో మార్గం లేదు. 

గురువు గారిలో ఉన్న పరమ ఆనందమే ఈ లోకంలోని కదిలే వస్తువులలో, కదలని వస్తువులలో ఉన్న చైతన్యంగా కన్పిస్తుంది. ఈ ఆనందాన్ని మన అనుభవంలోకి తెప్పించగల శ్రీ గురువుకి నమస్కారము. 

అందుకే సాయి గురు మార్గమే సరి అయిన దారిగా చెప్పారు. మనం ఎంత పూజలు చేసినా అవి అన్ని మన మనస్సు శుద్ధి పడడానికే. ఇవి మనకు ఈ ఆత్మసాక్షార అనుభవాన్ని ఇవ్వవు అని మన వేదాలు చెపుతున్నాయి. మనలను మనం తెలుసుకుని, మనమే ఈ చైతన్యమని అనుభవపూర్వకంగా గ్రహించినప్పుడు ఈ సత్యం మనకు బోధపడుతుంది. ఇందుకు గురు కృప ఏంతో అవసరం. వేరే ఎన్ని మార్గాలు ఉన్నా సాయి ఈ మార్గమే సులభమని చెప్పారు. 

జ్ఞాన శక్తి స్వరూపాయ కామితార్ద ప్రదాయినే !
భుక్తి ముక్తి  ప్రదాత్రే చ తస్మై శ్రీ గురవే నమః !!

జ్ఞాన స్వరూపుడు, శక్తి స్వరూపుడు అయి కోరిన కోరికలన్నీ తీర్చే వాడు, భుక్తి ముక్తి దాత అయిన శ్రీ గురువుకి నమస్కారము. 

ఇక్కడ శ్రీ గురువు అంటే కేవలము మోక్షాన్ని ఇచ్చే వాడే కాదు, మన ఈ ధర్మ కర్మ మార్గంలో నడవడానికి అవసరం అయిన వాటిని మనకు ఇచ్చే వాడు అని. అందుకే బాబా మన సంసార పరమైన కోర్కెలు తీర్చి, వాటిలోని నిస్సారత్వాన్ని తెలియ చెప్పి మనలను ఈ ముక్తి మార్గంలో తీసుకువెళ్తారు. 

జ్ఞానమనే అగ్నిచే కోట్లాది జన్మలనుంచి వచ్చిన కర్మలను కాల్చివేసే శ్రీ గురువుకి నమస్కారము.  ఒక్క సారి గురువు మన జీవితంలో ప్రవేశిస్తే, ఇక మనకు కావాల్సిందల్లా ఆ గురువు పట్ల శ్రద్ధ. 

న గురో రధికం తత్త్వం న గురో రధికం తపః !
న గురో రధికం జ్ఞానం తస్మై శ్రీ గురవే నమః !!

గురువుని మించిన తత్త్వం లేదు. గురువుని మించిన తపస్సు లేదు. 
గురువుని మించిన జ్ఞానం లేదు. అట్టి శ్రీ గురువుకి నమస్కారము. 

గురువే అన్నిటికి ఆది. ఆయనే అనాది.
గురువే పరదేవత. అటువంటి సాటిలేని గురువుకి నమస్కారము. 

మనకు కష్టాలు వచ్చినప్పుడు నిజమైన బంధువు గురువు ఒక్కరే. ఆయన కరుణా సముద్రుడు. ఆయనకు ఇవ్వడమే కానీ ఆయన కోరికలకు అతీతుడు. 

మనము సాయిని గురువుగా ఆరాధించాలి. అప్పడు ఆయన మనలను ప్రతి జన్మలోను రక్షిస్తారు. మనం చిన్న చిన్న కోరికలకు లొంగి పోగూడదు. ఆయనతో శాశ్వత సంబంధాన్ని కోరుకోవాలి. 

గురు మధ్యే స్థితం విశ్వం  విశ్వమధ్యే స్థితో గురుః !
విశ్వరూపో విరూపోసౌ తస్మై శ్రీ గురవే నమః !!

ఈ ప్రపంచమంతా గురువులో ఉంది. విశ్వమంతటిలోను గురువు ఉన్నారు. ఆయన విశ్వరూపుడు. ఆయన రూపరహితుడు. అట్టి శ్రీ గురువుకి నమస్కారము. 

  
అందరిలో సాయిని చూద్దాము. 

అన్ని జీవులకు ప్రేమను పంచుదాం. 

సాయిఫై నమ్మకాన్ని పెంచుకుందాము. 

సహనం అనే రుద్రాక్షను ఎప్పుడు మెడలోనే ఉంచుకుందాము. 


అంతా (పరమ గురువైన) సాయి మయం.


  














Wednesday, August 24, 2016

గురు ఆరాధన - గురు గీత






గురు గీతలో గురువు గొప్పతనం గురించి చెప్పటం జరిగింది. అలానే గురువంటే ఎవరు, గురువు అనే పదానికి అర్ధం, గురువు గారిని ఎలా ధ్యానం చేయాలి అనే చాలా విషయాలు చెప్పారు. ఇవన్నీ సాక్షాత్తు పరమ శివుని ద్వారా పార్వతి మాతకు విన్పించడం జరిగింది. గురువె పరబ్రహ్మ అని మనము చిన్నతనం నుంచి నేర్చుకుంటూనే ఉన్నాము. గురువు పాదాలలోనే అన్ని క్షేత్రాలు ఉన్నాయి అని కూడా తెలుసుకున్నాము. గురువు నివాస స్థలమే కాశీ క్షేత్రమని గురు గీత చెపుతుంది. వారి పాదోదకమే పరమ పవిత్రమైన గంగ. పరబ్రహ్మమైన కాశి విశ్వేశ్వరుడు  సాక్షాత్తూ గురువే. ఇక్కడ శివుడు అంటే మంగళ స్వరూపము. బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమే పరమ శివుడుగా మనం అర్ధం చేసుకోవాలి. ఆ శివ స్వరూపమే నారాయణ తత్వము. అందుకే గురు గీత ఇలా చెపుతుంది. 

గురు పాదాంకితం యత్ర గయా సాధోక్ష జోద్భవా !
తీర్థరాజ: ప్రయాగోసౌ గురు మూర్తయే నమో నమః !!

గురువు పాద ముద్రలు పడిన చోటే విష్ణు పాదాంకితమైన గయా క్షేత్రం. గురువున్న ప్రదేశమే గయా తీర్ధం. అలాంటి గురుమూర్తికి నమస్కారము. 

ఇలా  శివ తత్వానికి మరియు నారాయణ తత్వానికి బేధం లేదని పరమ శివుడు చెప్పారు. ఏ శక్తి అంతటా వ్యాపించి ఉన్నదో అదే ఈ తత్వము. 

గురువు గారి పాద రేణువులు సంసారమనే సముద్రానికి వంతెన కట్టడానికి సరిపోతాయి అని గురు గీత వక్కాణించి చెపుతుంది. మరి అలాంటి గురువుని ధ్యానించకుండా ఎలా ఉండగలం!
సంసార సాగరం అంటే ఈ జనన మరణ చక్రమే. అందుకే షిర్డీ సాయి ఈ గురు మార్గాన్నే బోధించారు. ఇదే సులభమైన మార్గం. 

గురుమూర్తిం స్మరేన్నిత్యం  గురొర్నామ సదా జపేత్ !
గురో రాజ్ఞామ్  ప్రకుర్వీత  గురో రస్యం న భావయేత్ !!

మనం ఎల్లప్పుడూ గురువు గారి రూపాన్నే స్మరించాలి. గురు నామాన్నే జపించాలి. గురువు ఆజ్ఞనే పాలించాలి. వేరే ఏది భావించరాదు. 

ఒక్క సారి గురువు గారిని చేరిన తర్వాత వేరే విషయాలు అంత ముఖ్యం కాదని తెలుసుకోవాలి. గురువు మనకు ఏది మంచిదో అదే చేస్తారు. ఇక్కడే మనం శ్రద్ధ అనే మంత్రాన్ని వాడుకోవాలి. ఈ నమ్మకమే మనలను రక్షిస్తుంది. గురువుపై ఉన్న నమ్మకం వలెనే మనకు జ్ఞానం లభిస్తుంది. పుస్తకాలు చదివితేనో, ఉపన్యాసాలు వింటేనో వచ్చేదో కాదు ఈ విద్య అనే జ్ఞానము. కానీ గురువు మనకు ఎప్పుడు ఏది నేర్పించాలో అప్పుడు ఎదో ఒక రూపంలో నేర్పిస్తారు. అది అనుభవం ద్వారా కానీ, శాస్త్ర రూపంలో కానీ లేదా ఎవరి ద్వారా కానీ జరుగుతుంది. అలానే బాబా దాసగణు మహారాజ్ గారికి ఒక పని పిల్ల ద్వారా ఈశావాస్యోపనిషత్ అర్ధం అయ్యే లాగా చేశారు. 

మనం చేయవలిసిందల్లా సాయి నామాన్ని ఎల్లప్పుడూ తలుచుకోవడమే మనం చేయవలిసిన పని. ఇలా గురువుని తలవడమే అన్నింటికన్నా మంచి మార్గమని పరమ శివుడే చెపుతున్నారు.

అనన్యా శ్చింతయంతో యే ధృవం తేషామ్ పరం పదమ్ !
తస్మాత్ సర్వ ప్రయత్నేన గురో రారాధనం కురు !!

వేరే ఏ చింతనే లేకుండా గురువునే ధ్యానించే వారికి ఆ పరమ పదం తప్పకుండా లభిస్తుంది అని చెపుతూ, అన్ని విధాలా గురు ఆరాధన చేయమని గురు గీత చెపుతుంది. 

మనకు చేతనైనంత వరకు మనం గురు సేవ చేయాలి. ఎన్ని రకాల సేవ చేయగలం అన్న విషయాన్ని గురుంచి మనమే ఆలోచించుకోవాలి. గొప్పల కోసం ఈ సేవను చేయకూడదు. మనం గురు సేవ చేసేది మనలోని అహంకారాన్ని పోగొట్టుకోవడానికి అని మనం అర్ధం చేసుకోవాలి. మనలోని కామ క్రోధాలు తొలిగిపోనిదే గురువుగారు ద్వారా లభించే జ్ఞానం మనకు బోధపడదు. అసలు గురు సేవలో అర్ధమే మనో శుద్ధి. ఎలాగైతే మనం భూమిని దున్ని విత్తనాలు నాటతామో అలానే ఈ మనసు అనే భూమి శుభ్రంగా లేకపొతే జ్ఞానమనే విత్తనం మనలో మొలకెత్తదు. మనం చేసే పూజలు, మంచి పనులు, దానాలు వ్రతాలు అన్ని ఈ మనసు అనే భూమిని దున్నడమే. నామ జపం కూడా మన మనస్సుని శుద్ధి చేస్తుంది. 

శుద్ధమైన మనస్సు అంటే తరంగాలు లేని ఆత్మ అని తెలుసుకోవాలి. ఈ ఆత్మే పరమాత్మ అని గురువు మనకు అనుభవ పూర్వకంగా అర్ధం అయ్యేలాగా చేస్తారు. 

గురో రారాధనం కార్యం స్వజీవత్వం నివేదయేత్ !!

సాయి ఆరాధన ఎలా ఉండాలి అంటే, మన జీవత్వాన్నే నివేదనగా సమర్పించాలి. అంటే ఒక మనిషిగా, జీవిగా మనకు ఉన్నదంతా గురువుకే అర్పించాలి. అలాగే నేను జీవుడిని అనే భావాన్నే ఆయనకు నివేదన చేసి, నేను సాక్షాత్ ఆ చైతన్య మూర్తిని, సత్ చిదానంద స్వరూపిని అనే బ్రహ్మ స్థితిలో ఉండాలి అని గురు గీత మనకు బోధిస్తుంది. ఇదే నిజమైన గురు ఆరాధన.  ఇదే బాబా చెప్పిన నిర్గుణ సేవ. 




శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు కి జై ! 













Wednesday, August 17, 2016

గురు పాదోదకం- గురు గీత






గురువు గారి కుడి పాదంలో సర్వ తీర్థాలు ఉన్నాయి అని మన శాస్త్రం చెపుతుంది. ఇక్కడ తీర్ధాలు అంటే పుణ్య నదులు, పుణ్య క్షేత్రాలు అని అర్ధం చేసుకోవాలి. అందుకే ఇలా చెప్పబడింది.

తీర్ధాని దక్షిణే పాదే  వేదా స్తన్ముఖ మాశ్రిత :  !
పీయూషభాజనం హంహో సద్గురో: కరనేత్రయో:!!

ఆయన ముఖమే వేదం అని చెప్పారు. ఆ ముఖాన్ని ధ్యానం చేస్తే అన్ని వేదాలు పారాయణ చేసిన ఫలితం కలుగుతుంది. ఆయన కళ్ళు చేతులు ఇలా సర్వాంగములు అమృతమయాలు. సద్గురు కరస్పర్శ వల్ల, ఆయన చూపు వల్ల యోగామృతం మనలోకి ప్రవహిస్తుంది. మనం సంపూర్ణంగా గురువుగారి రూపాన్ని ధ్యానించాలి.

గురువు గారి పాదాల్లో సర్వ తీర్ధాలు ఉన్నాయి అని బాబా ఒక సారి తన లీలను చూపించారు. 

ఒక విశేష పర్వదినాన దాసగణు మహారాజుకి ప్రయాగ తీర్థంలో స్నానం చేయాలి అన్న సంకల్పం కలిగి బాబా అనుమతి కోసం షిర్డీ వస్తారు. అప్పుడు బాబా దాని కోసం అంత దూరం వెళ్లాలా, ఇదే నీ ప్రయాగ తీర్థం. నీ మనసులో దృఢమైన విశ్వాసం ఉంచు అని చెప్పారు. దాసగణు బాబా పాదాల మీద తన శిరస్సుని ఉంచగానే వారి రెండు బొటన వేళ్ళ నుండి గంగా యమునల నీరు ప్రవహించింది. ఆ చమత్కారాన్ని చూచి దాసగణు గగుర్పాటు చెందాడు. బాబా యొక్క అనుగ్రహానికి అతని కళ్ళనుండి అశ్రుధారలు కారాయి. అతనిలో ప్రేమ ఉప్పొంగి బాబా యొక్క అఘటిత లీలను, అగాధ శక్తిని వర్ణించి తృప్తి చెందాడు. 

దాసగణు ఇలా బాబాలీలను వర్ణిస్తూ ఇలా అంటారు. ప్రజలు తమ పాపాలను పోగొట్టుకోవడానికి గంగ మొదలగు నదులలో స్నానం చేస్తారు. కానీ గంగ మాత్రం సత్పురుషుల చరణాలను ఆశ్రయిస్తుంది. అందువలన ఈ సాయి సత్పురుషుని పవిత్రాచరణాలను వదిలి గంగా గోదావరి తీర్థ యాత్రలకు వెళ్లవలిసిన అవసరం లేదు. 

అందుకే గురు గీతలో పరమశివుడు పార్వతికి ఇలా చెప్పారు. 

గురో : పాదోదకం పీత్వా  ధృత్వా శిరసి పావనమ్ !
సర్వ తీర్థావగాహస్య  సంప్రాప్నోతి ఫలం నరః !!  

గురువుగారి పాదోదకాన్ని త్రాగినా, శిరస్సున ధరించినా   సర్వ తీర్థాలలోను స్నానం చేసిన ఫలం వస్తుంది. 

కామక్రోధ మద మాత్సర్యాలతో  కూడిన మనం పరిశుద్ధం కావాలి అంటే మామూలు స్నానాల వల్ల కలుగదు. అందుకే గురువు గారి పాదోదకాన్ని భక్తితో , గురువుగారి అనుగ్రహంతో తాగినప్పుడు మనం పరిశుద్దులం అవుతాము. 

పార్వతి మాతతో పరమశివుడు ఇంకా ఇలా చెపుతున్నారు.

శోషణం పాప పంకస్య  దీపనం జ్ఞాన తేజసః !
గురో : పాదోదకం దేవి సంసారార్ణవ తారకం !!

దేవీ! గురు పాదోదకం "పాపాలు" అనే బురదను యెండగొడుతుంది. జ్ఞానమనే వెలుగును వెలిగిస్తుంది. సంసార సముద్రాన్ని దాటిస్తుంది.


అవిద్యా మూల నాశాయ జన్మ కర్మ నివృత్తయే !
జ్ఞాన వైరాగ్య సిధ్యర్ధం గురు పాదోదకం పిబేత్ !!

అజ్ఞానం పూర్తిగా తొలిగిపోవాలన్నా, జన్మలకు కారణమైనా కర్మలు నశించాలి అన్నా, జ్ఞాన వైరాగ్యాలు సిద్ధించాలన్నా గురు పాదోదకం త్రాగాలి. 

గురు పాదోదకం పానం గురొరుచ్చిష్ట భోజనం !
గురుమూర్తే స్సదా ధ్యానం గురుస్తోత్రం పరో జపః !!

గురువుగారి పాదోదకమే మనకు పానీయం కావాలి . గురువుగారి ఉచ్ఛిష్టమే నీకు భోజనం కావాలి. 
నిరంతరంగా సర్వకాల సర్వావస్థలయందు గురుమూర్తిని ధ్యానించాలి.  గురు స్తోత్రమే ఉత్తమ జపంగా ఆచరించాలి . 

 ఈ సత్యాలు మనం సాక్షాత్తు పరమశివుని ద్వారా విన్నాము. ఇంతకన్నా మనకు ఏ ఆధారం కావాలి. 

సాయి బంధువులారా 

ఆలోచించండి ! 

మేలుకోండి ! 

మన సాయిని పరమగురువుగా గుర్తించండి. 

గురువుగా ఆరాధించండి. 

మనం రోజు సాయి పూజకు తీర్థంగా పెట్టే నీటిని సాయి పాదాలకు తాకించి స్వీకరించండి. 
అదే సాయి పాదోదకం. మనం ఎప్పుడు మంచి నీరు తీసుకున్నా అది సాయి పాదోదకంగా భావించి తీసుకుందాము. 

మనం ఏ ఆహారం తీసుకున్నా అది సాయి ఉచ్ఛిష్ఠంగా భావించి తీసుకుందాము. 

కేవలం సాయి నామాన్నే స్మరిద్దాము. 

"సాయి! సాయి!" అంటే చాలు అయన మనలను ప్రతి జన్మలోను రక్షిస్తారు.  
  


సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు కి జై ! 























Wednesday, August 10, 2016

గురు తత్వము - గురు గీత




గురు తత్వాన్ని అందరు బోదించవచ్చు, కానీ ఆచరించి చూపించినవారు చాలా తక్కువమంది. గురువే మార్గమని, గురువే సర్వమని, గురువుని సదా స్మరిస్తే పరమార్ధం లభిస్తుంది అని షిర్డీ సాయి నాధులవారు చెప్పారు. ఆయన ఆ మార్గాన్నే అనుసరించి చూపించారు. ఆ గురువు పట్ల శ్రద్ద కలిగి ఉండడమే ఉత్తమ సాధనగా వర్ణించారు. 

"గురు" అనే పదమే ఒక దివ్య మంత్రం. గురువుగా సాయిని మనమందరము పూజించుదాము. సాయిపై నమ్మకాన్ని పెంచుకొందాము. ఊరికినే నమ్మకం అనే పదంతో సరిపెట్టుకోకుండా ఆ నమ్మకమే మనమవ్వాలి.  మన జీవితమే ఒక నమ్మకంగా మారాలి. మనం చేసే ప్రతి పనిలో ఆ శ్రద్ధ ఇమిడి ఉండాలి. అప్పుడే ఆ నమ్మకాన్ని శ్రద్దా అని అంటారు. ఇలా ఉన్నప్పుడే బాబా చెప్పిన శ్రద్ద అనే పదానికి న్యాయం జరుగుతుంది. 

గురువు అంటే పరమాత్మ. గురువే సృష్టి, స్థితి మరియు లయము. అందుకే గురు బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ ధేవో మహేశ్వరః అని మనం చెప్పుకుంటాము. ఆ పరమాత్మకు ఒక ఆకారం ఆపాదిస్తే, ఒక తత్వాన్ని వ్యక్తం చేస్తే బహిర్గతం అయ్యే వ్యక్తిత్వమే గురువు. 

జగత్తు అంటే ఎప్పుడు మారుతూ ఉండేది. నామరూపాలే ఈ జగత్తు. విశ్వమంతా గురువుయొక్క ఆకారమే. మనం ఒక చిన్న విగ్రహం పెట్టుకొని, ఇదే నా దేవుడు, ఇదే నా గురువు అంటే సరిపోతుందా? అన్ని దేహాలలో గురువే ఉన్నారు. కదిలేవి కదలనివి, ఇలా అన్ని జీవులలో గురువే చైతన్యమై ఉంటారు. అందుకే సాయి ఇలా చెప్పారు. "ఈ మూడు బారల శరీరం మాత్రమే నేను కాదు, షిర్డీలో మాత్రమే నేను ఉన్నాను అనే అనుకొంటే ఎలా". 

నానా సాహెబ్ తెచ్చిన ప్రసాదంపై ఈగగా ఉన్నా, లక్ష్మిభాయి ఆహారాన్ని కుక్కగా స్వీకరించినా, రకరకాల రూపాలతో వచ్చి తన భక్తులను అనుగ్రహించినా, ఏమి చేసినా ఈ సర్వవ్యాపకత్వాన్నే నేర్పించారు. అదే పరమాత్మ తత్వము. ఇదే నిజమైన గురు తత్వము. 

ఈ గురు తత్వాన్ని బాగా అర్ధం చేసుకోవాలి అంటే మనం ఏమి చేయాలి?

మనం మొట్టమొదట సాయిని గురువుగా స్వీకరించాలి. గురువుగా కొలవడం నేర్చుకోవాలి. దేవుడు మనం అడిగిన వరం మాత్రమే ఇస్తాడని అంటారు. కానీ గురువు మనలను జన్మజన్మలకు రక్షిస్తారు. 

నమామి సద్గురుం శాంతం   ప్రత్యక్ష శివ రూపిణం !
శిరసా యోగ పీఠస్థం   ముక్తి కామ్యార్ధ సిద్ధయే !! 

గురువు ప్రశాంతుడు. ప్రత్యక్ష శివ రూపి. ఇక్కడ శివ రూపి అంటే పరమాత్మ. యోగ పీఠమందున్న వాడు. యోగ  పీఠమంటే మనలోని చైతన్యము. మన శిరస్సులోని సహస్రార పద్మము లేదా మన హృదయము అనే అర్ధం కూడా చెప్పుకోవచ్చు. అలా ఉన్న సద్గురువుకి మోక్ష సిద్ధికోసమై తలవంచి నమస్కరిస్తున్నాను. 

ఎవరికి పూజ చేస్తే మాయలు మొహాలు నశిస్తాయో, రజో తమో గుణాలు నశించి ప్రశాంత చిత్తం ఏర్పడుతుందో వారే "గురువు". అందుకే ఆయనను ప్రశాంతుడు అని అన్నారు. మనలోనే ఆ గురువు కొలువై ఉన్నాడని, ఆయనే మన హృదయకమలంలో ఉన్నారని, ఆయనే మన సహస్రార పద్మంలో ఉన్నారని భావన చెయ్యాలి. ప్రతిరోజూ మనం ధ్యానం చేసేటప్పుడు ఇలా భావన చేస్తూ, ఆయన అద్భుతమైన రూపానికి అభిషేకం చెయ్యాలి. ఆయనకు చేయించే స్నానం, అభిషేకం మన తల మీదనుంచి, అంటే ఆయన శరీరం మీదనుంచి, మన శరీరంలోని ఒక్కో భాగం మీద పడుతూ, మన అంగాలలోని మాలిన్యాన్ని తొలిగిస్తున్నట్లు భావించాలి. ఇలా ఈ నిరాకార - సాకార పూజ చేస్తే మన జన్మ ధన్యం అవుతుంది. మన పాపాలన్నీ దగ్దమై మనలో జ్ఞాన బీజం మొలకెత్తుతుంది. 

గురువు పాదం మొదలు శిరస్సు వరకు మనోనేత్రంతో దర్శించడం అలవాటు చేసుకోవాలి. మొట్టమొదటగా గురువు పాదాల మీద మన దృష్టి నిలపాలి. అప్పుడే గురువు యొక్క చూపులు మన శిరస్సుపై పడతాయి. ఇదే దృష్ఠి పాతంగా మనలోని అజ్ఞానాన్ని దూరం చేస్తుంది. అప్పుడు మనం జ్ఞానమయంగా ఉండిపోతాము. ఇలా మనం సదా గురువుని సేవిస్తూ ఉండాలి. ఈ శరీరం ఉన్నంతవరకు మన గురువుని మనం పూజించాలి. అంతా సాయి మయం కావాలి. అందరిలో ఆ చైతన్యమే ఉందని గ్రహించాలి. 

గురు తత్వమే - సాయి తత్వము

సర్వ వ్యాపకత్వమే - సాయి తత్వము

సత్ చిత్ ఆనందమే - సాయి తత్వము 





సమర్ధ సద్గురు సాయినాధ మహారాజ్ కి జై !





   

Wednesday, August 3, 2016

స్థితి కారుడు-సాయి హరి




మానవులుగా మనకు జీవితములో ఎన్నో ఒడిదుడుకులు ఎదురుఅవుతూ ఉంటాయి. ఒక్కోసారి మనకు వచ్చిన కష్టాలలోనుంచి బ యటపడతామా లేదా అన్న నిరాశ మనలను ఎంతగానో బయపెడుతుంది. సరే ఇది మనకు చాలతేలికగా అర్ధం అయ్యే విషయం. 

కాని ఇంకో కష్టం ఉంది.
 

ఈ కష్టం
 మనకు తెలియకుండా మింగేస్తుంది. మనకు బాధ కలిగినట్లు కూడా తెలియదు. కాని చాలా నష్టం జరిగి పోతుంది. 

అది ఏమిటి అంటే, మాయ.
 

ఈ మాయ ఏ రూపంలో అయినా రావచ్చు. దీనికి కారణం అహంభావన. ఈ అహంలోనుంచే చాలా కష్టాలను కోరి తెచ్చుకుంటాము. ఇది మొట్టమొదట మంచిదే అనిపిస్తుంది కాని మనకు తెలియకుండా ఊభిలోకి కూరుకు పోయేట్లు చేస్తుంది. మనం చాలా మంచి పనే చేస్తున్నాము అని అనుకుంటాము. మనకు దైవ అనుగ్రహం కూడా ఉండచ్చు.
  అయినా ఇక్కడ కూడా ఈ మాయ మనలను వదలదు. కాని ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. మనలో మనస్తాపం కలుగుతుంది అంటే మనం మాయలో పడ్డట్టే. 

మన గమ్యం మనకు తెలిసినప్పుడు,


మనము బాబానే మనకు సర్వం అని భావించినప్పుడు,

ఆయనమీద పూర్తిగా భారమంతా  వేసినప్పుడు,

ఆయనే మన దైవమని నమ్మినప్పుడు,


ఆ పరమగురువే
  మన సద్గురువుగా సాక్షాత్కారించినప్పుడు,

అయన అనుగ్రహమే మనకు లభించినప్పుడు,


ఇక చింత ఎందుకు?

ఇంక భయం దేనికి ?
మరి దిగులు అవసరమా!

బాబా ఈ మాయ గురుంచి ఈ విధంగా చేప్పారు.
 
"నేను ఇల్లు వాకిలి లేని ఫకీరుని, ఏ బాధలు లేకుండా ఒక చోట స్థిరంగా కూర్చున్నాను. అయినా తప్పించుకోలేని  ఈ మాయ నన్ను కూడా వేధిస్తుంది. నేను మరిచిపోయినా అది నన్ను మరవకుండా నిరంతరం పెనవేసుకొని ఉంది. అది హరి యొక్క ఆది మాయ. బ్రహ్మాదులను కూడా ఎగరకొట్టేస్తుంది. మరి నేనెంత? హరి ప్రసన్నుడు అయితే అది విచ్ఛిన్నం అవుతుంది. అఖండ హరి భజన లేకుండా మాయ నిరసనం కాదు". 

ఇట్లా చెప్పి సాయి మరి కొన్ని విషయాలను కూడా చెప్పారు.
 

ఎల్లప్పుడూ "సాయి! సాయి !" అని స్మరించే వారిని సప్త సముద్రాల అవతల ఉన్నా రక్షిస్తాను.
 
ఈ నా మాటలయందు విశ్వాసం ఉంచితే తప్పక మేలు కలుగుతుంది. నాకు పూజా సామగ్రి కాని, అష్టోపచార, షోడశోపచార పూజలు కాని అవసరం లేదు. అపరిమితమైన భక్తి యున్న చోటే నా నివాసం". 

ఈ మాటలు ఎంతటి వారికైనా ఊరట కలిగిస్తాయి.
 

ఇక్కడ మనకు బాబా నేర్పించాలనుకున్నది ఏంటి?

మనం సృష్టి, స్థితి, లయల గురించి విన్నాము. బ్రహ్మ అనే మనసు సృష్టి చేస్తే, విష్ణువనే స్థితి దాన్ని వర్తమానంలో ఉంచితే, శంకరుడు లయ కారుడు అయి దాన్ని అంతం చేయాలి. 

మనం ఒక ఆలోచనుకు ప్రాణం పోస్తాము, దానికి
 ఒక కార్య రూపం ఇస్తాము.  కాని దాని పర్యవసానం మనం అనుకున్నట్లుగా లేక పొతే మనకు బాధ కలుగుతుంది. మన పురాణాలు పరిశీలిస్తే మనకు చాలా స్పష్టంగా అర్ధం అయ్యే విషయం ఏమిటి అంటే దేవుళ్ళు కూడా చాలా వ్యతిరేక పరిస్తితులను ఎదురు కోవాల్సి వచ్చింది. వాటిని వాళ్ళు కూడా మానవరూపంలోనే అనుభవించి మనకు ఆదర్శప్రాయులు అయ్యారు. 

బాబా కూడా ఒక శరీరంలో ఉండి ఈ మాయను ఎలా అధిగమించాలొ మనకు నేర్పారు. అయన నన్ను కూడా మాయ పట్టుకుంది అని చెప్పారు. అయన పరబ్రహ్మ స్వరూపము. ఆయన మాయకు అతీతుడు. ఆయన మన
 స్థాయికి వచ్చి మాట్లాడితే తప్ప మనకు అర్ధం కాదు. ఒక్కో సారి సాయి నేను ఇది చేసాను, అట్లా ఉన్నాను అని చెప్తారు. అయన నిరాకారుడు, నిర్గుణుడు, మరియు సచ్చిదానంద స్వరూపుడు. ఆయన చెప్పినవన్నీ మన కోసం. 

ఇక్కడ బాబా హరిని తలుచుకోమని చెప్పడంలో అర్ధం ఏమిటి?
 

హరి అంటే స్థితి కారుడు - స్థితి అంటే వర్తమాన కాలం. 

మనం కష్టాలలో ఉన్నప్పుడు మనం దేవుడ్ని తలుచుకుంటాము. ఇది మనకు కొంత ఊరట కలిగిస్తుంది. కాని మనం వర్తమానంలో ఉండము. దీని వల్ల
 మన ఆశాసౌధాలు కూలిపోయాయని బాధపడ్తాము. అంటే జరిగిపోయిన కాలం లోకి జారుకుంటాము. ఇంతే కాక భవిష్యత్తులో మనం అనుకున్నవిధంగా జరగకపోవచ్చని దిగులు చెందుతాము. కాని హరి అనే వర్తమానంలో ఉండము. వర్తమానం మనలను కార్యోన్ముఖులను చేస్తుంది. వర్తమానంలో ఉండి ఆలోచిస్తే మనకు దారి దొరుకుతుంది. ఒక్కో సారి ఈ కష్టం మనలను మింగేస్తుందా అని అనిపించవచ్చు. కాని ఈ సృష్టిలో ప్రతి దానికి లయం ఉంటుంది. ఏది శాశ్వతం కాదు.  అలాగే కష్టాలు కూడా. 

ఈ చిన్న ప్రవచనంలో బాబా ఎంతో చక్కటి నిగూడ అర్ధాన్ని వివరించారు. అందుకే ఆయన చేతల గురువు. మాటల గురువు కాదు. సద్గురువులు ఎప్పుడూ తమ
 శిష్యుల ఉన్నతిని మాత్రమె కోరుకుంటారు. వారిని ప్రతి జన్మలో రక్షిస్తూనే ఉంటారు. 


ఓం శ్రీ సాయి రామ్ !