In human life, the guru's place is pre-eminent. By keeping utmost faith in Guru alone, everything is obtained.
A devotee's entire strength is due to his guru. Devotion to the guru is superior to devotion to gods and goddesses.
The guru is the supreme being.
సాయి రూపాన్నే ధ్యానిద్దాము, సాయి పాదాలనే పూజిద్దాము !
సాయి మాటలే మన మంత్రాలు, సాయి కృపే మనకు మోక్షము!!


Wednesday, November 9, 2016

అంతర్యామి - గురు గీత



మనం గురు రూపాన్ని ధ్యానించాలి అని పరమశివుడు చెప్పారు. గురువు భూమి మీద ఉన్న చరా చరా లన్నింటిలోను శాంతుడై, పరమాత్మ స్వరూపుడై ఉన్నారని తెలుసుకోవాలి. అలానే వాటన్నింటిలో మనం గురువునే చూడాలి. మనకు ధ్యానమార్గాలు చాలా ఉండచ్చు. కానీ మనం ఏ మార్గంలో పోవాలో ఇక్కడ పరమ శివుడు చెప్తున్నారు. 

శ్రీ గురుం సచ్చిదానందం భావాతీతం విభావ్య చ !
తన్నిదర్శిత మార్గేణ ధ్యాన మగ్నో భవత్సుధీ: !!

సచ్చిదానందుడు, భావాతీతుడు అయిన శ్రీ గురువుని ముందుగా మనస్సులో నిలుపుకొని, విజ్ఞుడైనవాడు గురువు చెప్పిన మార్గంలో ధ్యానంలో ముందుకు సాగుతాడు. 

ఇంతకు ముందు భక్తి పరంగా గురువుని పూజించడం నేర్పారు. గురువుని అనేక గుణాలతో రూపయుక్తంగా భావించడం ఆయనకు ఎలా సపర్యలు చేయడం ఇలాంటి విషయాలను చెప్పారు. ఇప్పుడు జ్ఞానపరంగా గురువుని ధ్యానించడం ఎలానో, నిరాకార మార్గంలో ఆధ్యాత్మికంగా ఎలా ముందుకు సాగాలో చెప్తున్నారు. 

ఇక్కడ బాబా చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకుందాము. నన్ను నిరాకారంగా ధ్యానించండి. ఇది కుదరకపోతే నా ఈ రూపాన్ని మీ హృదయంలో ఉంచి ధ్యానించండి అని చెప్పారు. ఈ విషయాన్నే పరమశివుడు రాబోయే శ్లోకాల్లో చెపుతున్నారు. 

పరాత్పరతరం ధ్యాయేత్ శుద్ధ స్ఫటిక సన్నిభమ్ !
హృదయాకాశ మధ్యస్థం స్వాంగుష్ఠ పరిమాణకమ్ !!

స్పటికంవలె పరిశుద్ధుడు, పరాత్పరుడు అయిన శ్రీ గురువుని మన హృదయాకాశం మధ్యలో బొటన వేలు పరిమాణంగా ధ్యానించాలి. 
ఈ విషయాన్నే మనం మంత్ర పుష్పంలో చెప్పుకుంటాము. మన చేసే ప్రతీ పూజా పూర్తి  అయిన తర్వాత మంత్ర పుష్పము చదివించడానికి కారణము ఇదే. భగవంతుడు అన్నిటా ఉన్నా నీలోనే నువ్వు చూడగలవు అని చెప్పడమే. అందుకే మంత్ర పుష్పంలో ఇలా చెప్పారు. ఈ మంత్ర పుష్పం కృష్ణ యజుర్వేదంలో నుంచి తీసుకోవడం జరిగింది. 

యచ్చ కించిత్ జగత్సర్వం దృశ్యతే శ్రూయతేపివా 
అంతర్బహిశ్చ యత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః !!
పద్మ కోశ ప్రతీకాశగం హృదయం చాప్యధో ముఖం !
అథో నిష్టా వితస్యాంతే నాభ్యాముపరితిష్ఠతి !!

ఈ కనిపించే, వినిపించే సమస్త జగత్తు అంతా, లోపలా బయటా పరమాత్మే వ్యాపించి ఉన్నాడు అని చెప్తూ, మనలను మన లోపలికే తీసుకువెళ్లి,  కంఠానికి క్రింద నాభికి పైన ఉన్న హృదయాకాశ కుహరంలో తామర మొగ్గలాంటి పద్మ కోశంలోనే ఈ జ్ఞాన స్వరూపమైన పరమాత్మ ఉన్నట్లుగా మంత్ర పుష్పం చెపుతుంది. 

మనమే బ్రహ్మము అని జ్ఞానపరంగా వింటూ మళ్లా ఈ గురు ధ్యానం ఎందుకు అని మనకు అనుమానం రావచ్చు. కాని గురువు చెప్పిన దారిలో నడుస్తూ సాధన చేయడం అంత సులభం కాదు. మనము మన అహంకారం వల్ల మన మనసులో కలిగిన భావాలను గురువు చెప్పినవిగా భ్రమ పడి మాయాలో పడిపోతూ ఉంటాము. సరే ఇది ఎలా అర్ధం చేసుకోవడం. గురువు ఎప్పడు మనలను మోక్షానికి, అంటే ఆత్మ సాక్షాత్కారం వైపే తీసుకువెళతారు. మనం వెళ్లే దారి దీనికి బిన్నంగా ఉంటె మనం పక్క దారి పట్టినట్లే. ఇక్కడ మంచి పనులు (అంటే సత్వ గుణంతో కూడుకున్న కార్యాలు) కూడా మనలను దారి తప్పిస్తాయి. ఎందుకు అంటే ప్రతి కర్మకు ఫలితం ఉంటుంది. దాని ఫలితాన్ని అనుభవించాల్సిందే. అందుకని గురువు చెప్పిన మార్గంలోనే నడవాలి. సరే ఈ మార్గం తప్పకుండా ఉండాలి అంటే ఏమి చేయాలి ?

గురువుని మన హృదయాకాశం మధ్యలో ఒక చైతన్య స్వరూపంగా ధ్యానించాలి. ఇలా ధ్యానిస్తూ ఉంటె మనం అనుసరించవలిసిన మార్గం బోధపడుతుంది. మనం ఇక్కడ ఏకాగ్రతో ఉండాలి. ఆలా కాకుండా వేరే దారులన్నీ అనుసరిస్తూ ఈ ధ్యానం చేయాలి అంటే కుదరదు. మళ్ళా మనం తప్పుడు మార్గంలో ప్రయాణం చేయవచ్చు. చాలా మంది నాకు బాబా ఎందుకు దర్శనం ఇవ్వడం లేదు అని అనుకొంటారు. ఒకే ఆలోచనతో, భక్తిభావంతో ఒక్క దేవతనే పూజిస్తే ఆ దేవత తప్పకుండా అనుగ్రహించడం జరుగుతుంది. అలా కాకుండా అన్ని రూపాలను మనసులో ఉంచితే, దేని మీద ఏకాగ్రత ఏర్పడదు. 

ధ్యానం అంటేనే ఒక్క దాని మీద మనసు నిలపి, ఆ వస్తువే మనం అయిపోవడం. ఇలా మనసు నిలపడాన్ని ధారణ అని అంటారు. చాలా సార్లు మనం చేసేది ధారణ మాత్రమే. ఇందులో ముందుకి సాగితే అప్పుడు ధ్యానం చేయగలుగుతాము. ఈ ధ్యానమే మనలను సమాధి అనే స్థితికి చేరుస్తుంది. అందుకే గురువుని మనలో చూడమని పరమ శివుడు గురు గీతలో చెపుతున్నారు. 

  
అంగుష్ఠ మాత్రం పురుషం ధ్యాయత శ్చిన్మయం హృది !
తత్ర స్పురతి యో భావః శృణు తత్ కథయామి తే !!

ఇలా చిన్మయుడు, అంగుష్ఠ మాత్రుడు అయిన శ్రీ గురువును ధ్యానిస్తే ఎలాంటి అనుభవం కలుగుతుందో చెపుతాను విను అని పరమ శివుడు అంటున్నారు. 

విరజం పరమాకాశం ధ్రువమానంద మవ్యయమ్ !
అగోచరం తధాగమ్యం నామ రూప వివర్జితం !
తదహం బ్రహ్మ కైవల్య మితి బోధః ప్రజాయతే !!

నిర్మలము, అనంతము, శాశ్వతము, ఆనంద స్వరూపము, అగోచరము, అగమ్యము, నామరూప రహితము అయిన పరబ్రహ్మము తానే అన్న జ్ఞానం కలుగుతుంది. ఇదే ఆత్మ సాక్షాత్కారము. 



                                                   శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు కి జై !

Wednesday, November 2, 2016

విశుద్ధ జ్ఞానం - గురు గీత




గురు గీతలో కర్మ యోగము, భక్తి యోగాలు మాత్రమే కాకుండా జ్ఞాన యోగం కూడా బోధించడం జరిగింది. జ్ఞానమార్గంలో కూడా గురు ఉపాసన ఎలా చేయవచ్చు అని పరమ శివుడు పార్వతి దేవికి ఉపదేశం చేస్తున్నారు. గురువు కన్నా అధికమైనది ఏది లేదు అని పరమ శివుడు ఒక శాసనంగా చెప్పారు. 

జ్ఞేయం సర్వం విలాప్యేత  విశుద్ధ జ్ఞాన యోగతః !
జ్ఞాతృత్వ మపి చిన్మాత్రే నాన్య: పంథా ద్వితీయకః !!

పరిశుద్దమైన జ్ఞాన యోగంతో జ్ఞేయమైనది అంతా తగులపెట్టి, చిట్ట చివరికి ఆ చిన్మాత్రలో నాకు తెలుసు అనే తన జ్ఞాతృత్వాన్ని కూడా తగులపెట్టాలి. ఇంక రెండో దారి లేదు అని పరమ శివుడు చెప్పుచున్నారు. 

వేదాంత సారం అంతా ఈ శ్లోకంలో ఉందని చెప్పచ్చు. చాలామంది ఎన్నో ఉపాసనలు చేస్తారు. అనేక సిద్దులను కైవశం చేసుకుంటారు.  వారు మహానుభావులుగా, గురువులుగా పూజించబడవచ్చు కూడా.  కానీ గమ్యాన్ని చేరలేరు.

ఇక్కడ పరిశుద్దమైన జ్ఞానం అని చెప్పడం జరిగింది. జ్ఞానంలో మళ్ళా పరిశుద్ధ జ్ఞానం, పరిశుద్ధం కాని జ్ఞానం ఉంటాయా అని మనకు సందేహం రావచ్చు. మనలో ఎన్నో జన్మలనుంచి పేరుకుపోయి ఉన్న దురవగాహనలు తీసివేస్తే కాని మనకు నిజమైన జ్ఞానం అంటదు. చాలామంది శాస్త్రాలమీద ప్రవచనాలు చెప్పచ్చు, గురువులుగా వారు గౌరవించబడవచ్చు. కాని వారికి సత్యం అనుభూతి కాకపొతే ఉపయోగం లేదు. వీరికి పురాణాలు, అనేక శాస్త్రాలు బాగా తెలిసి ఉండవచ్చు. కానీ ఇవన్నీ మనకు ఆత్మ సాక్షాత్కారాన్ని ప్రసాదించవు. 

మనలో ఉన్న చాలా సంకల్పాలు అశుద్ధ జ్ఞానంగా వ్యక్తమవుతాయి. ఇక్కడే సత్వ గుణ ప్రధానమైన ఈ సంకల్పాలు మనలను గమ్యానికి దూరం చేస్తాయి. అంతా చూడడానికి సరియైనదిగానే ఉంటుంది. ఇక్కడే పరమ గురువులు మనకు నిజమైన దారి చూపిస్తారు. మనలో ఉన్న ఈ జ్ఞానం కూడా అవిద్యే. పరమ గురువులు ఒక్కొక్క అవిద్యను తొలిగించడానికి ఒక్కో రకమైన విద్యను నీలో ప్రవేశ పెట్టవలిసి వస్తుంది. ఇది గురువుకి మాత్రమే తెలుస్తుంది. అందుకే ఇక్కడ విశుద్ధ జ్ఞాన యోగతః అని చెప్పారు. 

నాకు జ్ఞానం కలిగింది అనే జ్ఞాతృత్వాన్ని కూడా తగులపెట్టాలి అని పరమ శివుడు చెపుతున్నారు. మనం ఆత్మగా ఉంటె నాకు జ్ఞానం కలిగింది అని చేప్పేదెవరు. అంటే ఇంకా మనసు ఉందా అని మనం ప్రశ్న వేసుకోవాలి. అందుకే గురు గీత ఈ భావాన్ని కూడా వదలాలి అని చెపుతుంది. మనం సరిగా ఉపయోగించుకుంటే ఈ అశుద్ధ జ్ఞానాలు కూడా మనకు ఒక్కొక్క మెట్టు ఎక్కడానికి ఉపయోగపడతాయి. 

సాయి సత్చరితలో నానా చందోర్కర్కు భగవద్గీత శ్లోకం గురుంచి బాబా చేసిన బోధ మనం గుర్తు చేసుకోవాలి.

తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా|
ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః||

గురుచరణాలకు సాష్టాంగ ప్రణామము చేసి, గురుసేవకు జీవితాన్ని అంకితం చేసి గురువును ఆదరంగా ప్రశ్నించే వారికి జ్ఞానులు జ్ఞానార్ధాన్ని ఉపదేశిస్తారు.

సాయి మొదటి సగం శ్లోకానికి ఉన్న అర్ధాన్ని అంగీకరించారు. కాని మిగతా సగం శ్లోకానికి సరైన అర్ధం చెప్పమని నానాని అడగడం జరిగింది. జ్ఞానులు మరియు తత్వదర్శులు జ్ఞానాన్ని ఉపదేశిస్తారు. జ్ఞానమనే శబ్ధానికి నీవు చెప్పిన అర్ధం విన్నాను, కాని దానికి జ్ఞానమని కాకుండా అజ్ఞానమనే పదం వేస్తే పోయేదేముంది. అజ్ఞానం వాక్కుకు సంబంధించిన విషయం, జ్ఞానం వాక్కుకు అతీతమైన విషయం. పైన గురు గీతలో చెప్పిన విషయమే బాబా కూడా చెప్పారు. 

 సాయి తన దగ్గరకు వచ్చిన భక్తుల చిత్తంలో ఏముందో తెలుసుకొని, వారివారి పూర్వకర్మలను బట్టి, వారికి ఏ విధమైన బోధ చెయ్యాలో అది మాత్రమే చేసేవారు. మనలో మనకు తెలియకుండా కొన్ని విక్షేపాలు దాగి ఉంటాయి. అవి గురువు మాత్రమే బయటికి తీయగలరు. బయటకు తీసి వాటిని సమూలంగా నాశనం చెయ్యగల శక్తి ఒక్క గురువుకే ఉంది. మనమందరం కామ, క్రోద మధ మాత్సర్యములకు బానిసలమే. ఈ అరిషట్‌వర్గములు అందరిని లొంగ తీసుకుంటాయి. ఇవె మన అధ్యాత్మిక ప్రగతికి అడ్డుపడతాయి. బాబా మానసిక పరివర్తనకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చేవారు. మనం ఎన్ని గ్రంధాలు చదివినా ఆ సద్గురువుల కృపలేనిదే మనం కొంచెం కూడా ముందుకు వెళ్ళలేము. సాయి కోరిన శ్రద్ధ, సబూరి ఉంటే చాలు పెద్ద పర్వతాలనైన కదిలించవచ్చు. 

అందుకే సాయిని ఒక సిద్దాంతానికి, ఒక మతానికి, ఒక ఆచారానికి చెందినట్లు చెప్పలేము. ఈ సకలసృష్టిలో భిన్నత్వం ఉంది. ఆ భిన్నత్వంలో ఏకత్వం ఉంది. ఈ ఏకత్వాన్ని అర్ధం చేసుకోవడమే మానవజన్మ యొక్క లక్ష్యం. ఇదే విశుద్ధ జ్ఞానం. 

శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు కి జై ! 

Wednesday, October 26, 2016

శివాయ గురవే నమః - గురు గీత




గురు పాదములే మన పూజకు తగిన ఆరాధ్య వస్తువుగా వివరించిన పరమశివుడు ఇంకా ఇలా చెపుతున్నారు. 

సంసారమనే రోగాన్ని పోగొట్టేది, దుఃఖ సముద్రాలను దాటించేది, సర్వ లోకాలను భరించేది అయిన గురు పాదమే నాకు శరణం అని చెపుతున్నారు. సాయి నిరాకార ధ్యానాన్ని చేయమని, ఇది కనుక కుదరక పొతే తన సాకార రూపాన్ని ధ్యానించమని చెప్పారు. గురు గీతలో గురువుని గూర్చి పరమశివుడు పార్వతి ఇలా అంటున్నారు. 

అత్రినేత్ర శివ సాక్షాత్ ద్విభుజశ్చాపరో హరి:!
యో చతుర్వదనో బ్రహ్మ శ్రీ గురుః కథితః ప్రియే !!

పార్వతి! గురువు అంటే 
మూడు కళ్లు లేని శివుడు, నాలుగు చేతులు లేని విష్ణువు, నాలుగు ముఖాలు లేని బహ్మ 
అని శాస్త్రాలు కీర్తిస్తున్నాయి. 

నిత్యాయ నిర్వికారాయ నిరవద్యాయ యోగినే !
నిష్కలాయ నిరీహాయ శివాయ గురవే నమః !!

గురువు నిత్యుడు, వికార రహితుడు, దోష రహితుడు, యోగి, నిష్కలుడు, ఆశలు లేని వాడు, మరియు మంగళప్రదుడు. అలాంటి శ్రీ గురువుకి నమస్కారము.

ఇక్కడ శివాయ గురవే నమః అని వాడడం జరిగింది. ఇక్కడ శివుడు అంటే మంగళ స్వరూపుడు. అంతే కానీ బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో ఉన్న శంకరుడి గురించి కాదు. ఇది పరమాత్మ స్వరూపంగా తెలుసుకోవాలి. ఈ తత్వము త్రిమూర్తులకు అతీతమైనది. 


శిష్య హృత్పద్మ సూర్యాయ సత్యాయ జ్ఞానరూపిణే !
వేదాంతవాక్య వేద్యాయ శివాయ గురవే నమః !!

మన అందరికి ఆధ్యాత్మిక హృదయం కుడి వైపున ఉంటుంది. మనకు తెలిసిన గుండె ఎడం వైపున ఉంటుంది. ఈ ఆధ్యాత్మిక హృదయాన్ని పద్మంతో  పోల్చి చెప్పారు చెప్పారు. వీటిని వికసింప చేసే సూర్యుడే గురువు. జ్ఞానమే ఆయనకున్న వెలుగు. సూర్యుడు పగలు మాత్రమే ఈ పద్మాలను వికసింప చేయగలడు కానీ గురువు యొక్క వెలుగు శాశ్వతమైనది. దీనికి పగలు రాత్రితో సంబంధం లేదు. ఇలా గురు కృపతో విచ్చుకున్నహృదయ పద్మం మళ్ళా ముడుచుకోవడమనేదే ఉండదు. 

మనం ఒక పని చేస్తే దానికి ఒక కారణం వేరుగా ఉంటుంది. అలానే ఒక వస్తువు తయారు అయింది అంటే, ఈ వస్తువుకి కావాల్సిన ముడి సరకు అవసరం ఏంటో ఉంటుంది. కానీ ఈ సృష్టి ఏ వస్తువునుంచి భగవంతుడు తయారు చేసాడు. ఆ వస్తువు భగవంతుడు కన్నా వేరుగా ఉందని చెప్పలేము. మరి ఈ ప్రపంచాన్ని తయారుచేయవలిసిన ముడి సరకు ఎక్కడనుంచి వచ్చింది. దీనికే మన శాస్త్రాలు సాలి పురుగుని ఉదాహరణగా తీసుకున్నాయి. సాలిపురుగు తన గూడు కట్టడానికి తనలోని పదార్ధాన్నే వాడుకుంటుంది. ఎక్కడో బయటినుంచి ఆ దారం రాదు. 

అందుకే గురు గీత ఇలా చెపుతుంది. 

కార్య కారణ రూపాయ రూపారూపాయ తే సదా !
అప్రమేయ స్వరూపాయ శివాయ గురవే నమః !!

దృగ్దృశ్య ధ్రష్ట్రు రూపాయ నిష్పన్న నిజ రూపిణే !
ఆపారాయా అద్వితీయాయ శివాయ గురవే నమః !!

గుణాధారాయ గుణినే గుణవర్జిత రూపిణే !
జన్మినే జన్మ హీనాయా శివాయ గురవే నమః !!


కార్య కారణాలు రెండూ గురువుయొక్క రూపాలే. సాకారుడు నిరాకారుడు కూడా తానే. ఇలా మన ఊహకు అందని స్వరూపముకలవాడే గురువు. 

చూడబడేది, చూచేది మరియు చూపు కూడా గురువే. ఇలా తన స్వస్వరూపంలో నిలిచి ఉండే వాడే గురువు. అపారమైన వాడు అద్వితీయుడు అయిన గురువుకి మనం నమస్కరిస్తున్నాము. 

మనము సాయి హారతిలో ఇలా గానం చేస్తాము. 

సదా స్వస్వరూపం చిదానంద కందం 
జగత్సంభవ స్థాన సంహార హేతుం! 
స్వభక్తేచ్చయా మానుషం దర్శయన్తం 
నమామి ఈశ్వరం సద్గురుమ్ సాయినాథం !!

ఈ శ్లోకంలో పైన చెప్పిన పరమాత్మ తత్వమే ఉంది. 

గురువుకి మొదలు లేదు. అంతం లేదు. అలానే ఆత్మకు మొదలు అంతం లేవు. ఆత్మే గురువు. మనలో ఉన్న ఈ ఆత్మే మన స్వస్వరూపము. ఈ రూపం గురించి తెలుసుకొనే జ్ఞానమే ఆత్మ జ్ఞానము. మాయ అనే తెర ఈ ఆత్మను కప్పి ఉంటుంది. ఈ మాయ గురువు అధీనంలో ఉంటుంది. కానీ జీవులందరూ మాయ అధీనంలో ఉంటారు. 

గురువుకి మాయ లేదు. గురువుకి రూపం లేదు. ఎప్పుడు స్వస్వరూపంలోనే ఉంటారు. అట్టి స్వస్వరూపమైన శివునికి నమస్కారమని గురు గీత గానం చేస్తుంది. 

సాయి మనలోని మాయను తొలగించడానికి ఆయన మరింత మాయను ధరించినట్లు కనిపిస్తారు. మనం ఓర్పుతో సాయి నేర్పిన సత్యాలను అర్ధం చేసుకొని వాటిని అనుసరించాలి. అప్పుడే ఈ మాయను దాటి మనం స్వస్వరూపంలో ఉండగలుగుతాము. ఇదే ఆత్మసాక్షాత్కారమని మన శాస్త్రాలు చెపుతాయి. ఈ బ్రహ్మానుభూతి మనకు కలగాలి అంటే మనకు గురు కృప కలగాలి. గురు కృప కలగాలి అంటే మన చిత్తం శుద్ధి పడాలి. చిత్త శుద్ధి లేని శివ పూజ వ్యర్ధమే. శ్రద్ధ సభూరి లేని సాయి పూజ కూడా మనలను గమ్యానికి తీసుకు వెళ్ళదు. 

కావున సాయి భక్తులారా!

సాయిని భక్తితో గురువుగా పూజిద్దాము. 
సాయి నుంచి ఆత్మ జ్ఞానాన్ని మాత్రమే కోరుకుందాము. 
సాయి కృపకు పాత్రులమవుదాము. 


శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు కి జై ! 




Wednesday, October 19, 2016

గురు రక్ష - గురు గీత


 
సాయి రక్ష

మనకు తెలిసో తెలియకో కొన్ని తప్పులు జీవితంలో చేస్తూ ఉంటాము. మనం చేసే ప్రతి పనికి ఫలితం ఉంటుంది. ఒక్కోసారి ఈ కర్మ ఫలితం ఒక జన్మలోగాని కొన్ని జన్మలలో కానీ అనుభవించాల్సి ఉంటుంది. మనం మంచి మార్గంలో నడిస్తే చాలా వరకు తెలిసి చేసే తప్పులు తగ్గి పోతాయి. కానీ మనకు ధర్మం ఏమిటో తెలియక అంటే రూల్స్ తెలియక చేసే తప్పులు చాలా ఉంటాయి. మరి వీటినుంచి మనలను ఎవరు రక్షిస్తారు. మనకు మంచిది అనిపించింది మనం చేస్తూ ఉంటాము. ఇది కాలానుగుణం మారుతుంది అని పెద్దలు చెప్తారు. మనం మంచిది అనుకున్నది చేసినా కానీ మనకు దుఃఖం తప్పటలేదు. ఒక బిడ్డను చిన్నప్పుడు తల్లితండ్రులు రక్షిస్తూ ఉంటారు.  ఆ బిడ్డకు ఈ దారి మంచిది కాదు అని పెద్దలు చెప్తారు. కానీ ఈ పిల్లలు వారి వాతావరణాన్ని బట్టి వారు ప్రవర్తిస్తారు. ఎందు కంటే వాళ్లకు అది కరెక్ట్ అని అనిపిస్తుంది. పెద్దలకు తెలుసు అది మంచి మార్గం కాదు అని. కానీ నిస్సహాయ పరిస్థితి. ఈ పిల్లలకు పూర్తిగా అర్ధం కాదు కానీ వాళ్లకు తెలిసినంతలో ఆది కరెక్ట్. అలానే మనం అందరం కూడా ఇదే తప్పు చేస్తాము. మన గురువులు, శాస్త్రాలు చెప్పినవి మనం పట్టించుకోము. అందరు చేసేదే మనం చేస్తాము. 

కానీ మన దురదృష్టం ఏమిటి అంటే? పైన చేప్పిన పిల్లలకు మాదిరిగా మనకు కూడా మంచి చెడులు తెలియవు. అందుకే జీవితంలో ఇంత ఇబ్బందులు పడుతూ ఉంటాము. వీటి నుంచి చాలాతేలికగా బయట పడేసే శక్తి కేవలం గురువుకి మాత్రమే ఉంటుంది. అందుకే మనం గురువు యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలి. మన జీవితంలో గురువు ప్రవేశించే అర్హతను సంపాయించాలి. సాయి భక్తులుగా మనం ఎంతో పుణ్యాత్ములము. ఆయనే మనకు గురువు దేవుడు కూడా. 


గురు గీతలో గురు రక్ష గురించి పరమశివుడు పార్వతి మాతతో ఇలా చెప్పారు. 

మునిభ్య: పన్నగేభ్య శ్చ సురేభ్యచ శాపతోపి వా !
కాలమృత్యు భయా ద్వాపి గురూ రక్షతి పార్వతి !!

పార్వతి! పాములు మొదలైన విషజంతువుల నుంచి, మునులు దేవతులు మొదలైనవారి శాపాలనుంచి, కాలమృత్యు భయం నుంచి కూడా గురువు శిష్యులను రక్షిస్తాడు. 

శ్రీ సాయి సత్చరితలో మనం ఎన్నో ఘట్టాలను చూసాము. సాయి తన భక్తులను ఎలా రక్షించారో, వారిని రకరకాల జీవిత సమస్యలనుంచి ఎలా బయటపడేశారో మనం చదువుకున్నాము. నన్ను తలిస్తే చాలు నేను మిమ్మలను రక్షిస్తాను అని సాయి భరోసా ఇచ్చారు. 

మనలను ఈ శరీర పరమైన భాదలనుంచి కాపాడడమే కాకుండా, మనలను సన్మార్గంలో నడిపించి మనకు తెలియని తప్పులనుంచి కూడా మనలను రక్షిస్తారు. మనం చేయాల్సిందల్లా సాయి చెప్పిన దారిలో నడవటమే. 


శ్యామాను పాము విషంనుంచి రక్షించినా, బాలాసాహెబ్ మిరీకర్ను పాము గురుంచి హెచ్చరించి రక్షించినా, బూటీ మహల్సాపతిలను విషసర్పాల గురించి హెచ్చరించినా, మరి ఎలా తన భక్తులను రక్షించినా ఇవన్నీ ఈ శరీరానికి సంబంధించినవే. కాని గురువు తపన కొన్ని జన్మలలో మనలను రక్షించాలి అని, ఈ జన్మలే లేకుండా చేయాలి అని గురువు మనకు అనుగ్రహాన్ని ప్రసాదించటానికి రెడీగా ఉంటారు. 

ఒక మనిషిని ఒక విష జంతువు కరిస్తే ఒక్క సారి మాత్రమే చనిపోవచ్చు. కానీ కామ క్రోధాలనే పాములు మనలను కరిస్తే కొన్ని జన్మలెత్తి చనిపోవాలి. అందుకే గురువు మనలను ఈ చెడు అలవాట్లనుంచి రక్షించడానికి విశ్వ ప్రయత్నం చేయడం జరుగుతుంది. కాని మనము ఈ విషయాలను అర్ధం చేసుకోము. మనకు జరిగేవి అన్ని మనం చేసుకున్న కర్మమూలంగానే అనే సత్యాన్ని అర్ధం చేసుకోవాలి. కాని ఇవన్నీ తెలుసుకోకుండా కోరి కష్టాలను తెచ్చుకొంటాము. ఆ కష్టాలు వచ్చిన తరువాత నాకే ఎందుకు ఈ కష్టాలు రావాలి అని బాధ పడతాము. 


పరమ శివుడు మునులనుంచి దేవతలనుంచి కూడా గురువు రక్షిస్తారు అని చెప్పారు. మరి ఈ కాలంలో మనం మునులను దేవతలను చూడం కదా అని మనము అనవచ్చు. మనం మహానుభావులను గుర్తించలేము అలానే దేవతలను దర్శించలేము. అలా అని వాళ్ళు లేరు అని తీర్మానించగలమా! మన శరీరంలో ఒక వైరస్, బాక్టీరియా ఇలా మనం చూడలేని ప్రాణులన్నీ మనకు హాని చేస్తూ ఉంటాయి. అలానే మనం ఈ ప్రకృతిని నియంత్రిచే శక్తులను గౌరవించము. ఈ శక్తులను మనం అష్ట దిక్పాలకులు, దేవేంద్రుడు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులని పిలుచుకోవచ్చు. లేదా ఈ శక్తిని అమ్మవారు అని అనుకోవచ్చు. మన కోరికలను తీర్చుకోవడానికి మనం వ్రతాలు పూజలతో దేవతలను పూజిస్తాము. ఒక పురోహితుడిని పిలిచి వారి చేత పూజ చేపిస్తాము కాని మనలో ఆ నమ్మకం ఉండదు. మనం మన ఇష్టమొచ్చిన పనులు చేస్తూ, ఆ దేవతకు గౌరవం ఇవ్వకుండా మన పూజా కార్యక్రమాన్ని పూర్తి చేస్తాము. దీనివల్ల మనకు మంచి జరుగుతుందో చెడు జరుగుతుందో తెలియదు. మనం మాత్రం పూజ చేసాము అని అనుకొంటాము. అప్పటికి ఈ దేవతలు మనలను క్షమిస్తారు. కాని కొన్ని సార్లు మనం క్షమించలేని తప్పులు చేయవచ్చు. అప్పుడు మనలను ఎవరు రక్షిస్తారు. కేవలం గురువు మాత్రమే మనలను అన్ని పరిస్థుతలనుంచి రక్షించగలుగుతారు. 

అందుకే గురు గీతలో పరమ శివుడు ఇలా చెప్తారు. 

శివే రుష్టే గురు స్త్రాతా గురౌ రుష్టే న కశ్చన !
తస్మాత్ పర గురుం లభ్ద్వా తమేవ శరణం వ్రజేత్ !!

పరమ శివుడే కోపగిస్తే గురువు రక్షిస్తారు. మరి గురువే కోపగిస్తే ఇక రక్షించే వాడే లేడు. కనుక గురువుని ఆశ్రయించి, ఆయననే శరణు పొందాలి. 

ఇక్కడ గురువు కోపగించుకోవడం అంటే గురువు నిజంగా కోపం తెచ్చుకోవడం కాదు. ఆయన మన జీవితంలో లేక పోవడం. గురువు లేని జీవితం తెగిపోయిన గాలి పటం లాంటిది. ఎటు గాలి వీస్తే ఆటే వెళ్తుంది. ఒక దిశ, అర్ధం లేని జీవితం. సాయి అందుకే ఇలా చెప్తారు. "నా దగ్గర జ్ఞానం కుప్పలు కుప్పలుగా ఉంది కాని ఎవరూ అది అడగరు".  

సాయి భక్తులారా,
మన జీవిత పరమైన కోరికలతో మాత్రమే సాయిని పూజించడం కాకుండా, ఆయనను గురువుగా మన జీవితంలోకి ఆహ్వానిద్దాము. సాయి మనలను జన్మజన్మలకు రక్షిస్తారు. 

"గురు" అంటే అర్ధం గురు గీత ఇలా చెపుతుంది. 
"గు" అంటే అంధకారము 
"రు" అంటే వెలుతురు. 

చీకటి అనే అజ్ఞానాన్ని పారద్రోలి వెలుతురుగా మిగిల్చే పరబ్రహ్మమే గురువు.  

వెలుతురు ఉన్న చోట చీకటి అనేదే ఉండదు. సూర్యుడికి పగలు చీకట్లు అనేవే ఉండవు. ఉన్నదంతా స్వయంప్రకాశమైన వెలుతురు మాత్రమే. అలానే గురువు మన జీవితంలో వెలుగు నింపుతారు. ఈ వెలుగుకి చీకటి ఎలా ఉంటుందో కూడా తెలియదు. అప్పుడు కష్ట సుఖాలనే ద్వంద్వాలు ఉండవు. మనము మన స్వస్వరూపంలో ఉంటాము. ఇదే నిజమైన గురు రక్ష. 
  

 శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు కి జై ! 





Wednesday, October 12, 2016

గురు ధ్యానం - గురు గీత




గురు ధ్యానం గురించి గురు గీతలో ఇలా చెప్పబడింది. 

ధ్యానం అనేది త్రికరణ శుద్ధిగా చేయాలి. ఈ ధ్యానం మనో వాక్కాయ కర్మలన్నింటిలో జరగాలి. 

శ్రీమత్పరబ్రహ్మ గురుం స్మరామి 
శ్రీమత్పరబ్రహ్మ గురుం భజామి !
శ్రీమత్పరబ్రహ్మ గురుం వదామి 
శ్రీమత్పరబ్రహ్మ గురుం నమామి !!

మనము ధ్యానించే వస్తువుకన్నా గొప్పది మరొకటి ఉండకూడదు. లేకపోతె మనసులో సందేహాలు మొదలౌతాయి. సర్వవ్యాపకము, సర్వానికి ఆధారము, ఏకము, అద్వితీయము అయిన పరమాత్మే గురువు. అటువంటి గురువె మన ధ్యేయము కావాలి. అప్పుడు మన మనస్సులో అనుమానాలు తలెత్తవు. 

అటువంటి గురువుని స్మరిద్దాము. 
అటువంటి గురువుని భజిద్దాము, 
అటువంటి గురువుని కీర్తించుదాము. 
అటువంటి గురువుకి నమస్కరించుదాము. 

గురువే పరమాత్మ. గురువే మన ఆత్మగా మనలో కొలువై ఉన్నారు. ఇటువంటి గురువు యొక్క గుణాలు లక్షణాలు ఈ విధంగా గురు గీతలో చెప్పారు. 

బ్రహ్మానందం పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తిం 
ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం !
ఏకం నిత్యం విమల మచలం సర్వధీ సాక్షి భూతం 
భావాతీతం త్రిగుణ రహితం సద్గురుమ్ తమ్ నమామి!! 


పరమాత్మ నిర్గుణము, నిరాకారము మరియు గుణాలన్నిటికి అతీతమైనదిగా చెప్పుకుంటాము. కానీ మనం మాట్లాడుకోవడానికి ఈ విధంగా చెప్పుకోక తప్పదు. 

బ్రహ్మానంద స్వరూపుడు, సుఖప్రదుడు, శుద్ధ జ్ఞాన స్వరూపుడు, ద్వంద్వాలకు అతీతుడు, ఆకాశంలాగా నిర్మలుడు, తత్వమసి అనే వేద వాక్యముల అర్ధముగా భాసించేవాడు, ఏకం (రెండు అనేది లేని వాడు), నిత్యుడు, నిశ్చలుడు, మనో బుద్దులకు అందని వాడు, త్రిగుణ రహితుడు అయిన శ్రీ గురువుకి నమస్కరిస్తున్నాను. 

మనము ధ్యానించే తత్వము పైన చెప్పిన విధంగా ఉండాలి. ఇవన్నీ పరమ గురువుల్లో ఉంటాయి. షిర్డీ సాయి అందుకే కుదిరితే నిరాకార ధ్యానం మంచిది లేక పొతే నన్ను సాకార రూపంలో ధ్యానం చేయండి అని చెప్పారు. ధ్యానం యొక్క ముఖ్య ఉద్దేశం ఆత్మ దర్శనము. 

అందుకే గురువుని ప్రశాంత స్వరూపుడిగా చెప్తారు. గురువు జ్ఞాన స్వరూపుడు. గురువు ఆత్మ జ్ఞాని, యోగి శ్రేష్ఠుడు, సంసారమనే రోగానికి వైద్యుడు. అందుకే గురువుని కేవలం ఆత్మ స్వరూపుడిగా ధ్యానం చేయాలి. ఇదే విషయాలను పరమ శివుడు గురు గీతలో పార్వతి మాతకు చెప్పారు. 

కానీ నిరాకార ధ్యానం అందరికి సాధ్యపడదు. అందుకే గురు గీత కూడా సాకార ధ్యానం గురుంచి కూడా చెపుతుంది. 

హృదంబుజే కర్ణిక మధ్య సంస్థే 
సింహాసనే సంస్థిత దివ్యమూర్తిమ్ !
ధ్యాయేత్ గురుం చంద్రకళా ప్రకాశం 
సత్చిత్సుఖాభీష్ట వరం దదానం !!

 హృదయ పద్మం మధ్యలో, కర్ణిక మీద ఉన్న సింహాసనంలో కూర్చుని, దివ్యమైన రూపంతో చంద్రుని వలె ప్రకాశిస్తు, సచ్చిదానందమనే వరాన్ని ఇచ్చేవాడైన సద్గురువుని ధ్యానించాలి. 

మనము గురువుకి చాలారకాలైన అలంకారాలతో పూజలు చేస్తాము. కానీ వాటివెనక ఉన్న అర్ధాన్ని తెలుసుకోవాలి. లేక పొతే బయట ఉన్న రూపంలోనే ఉండి పోతాము. 

కాషాయము త్యాగానికి ధర్మానికి ప్రతీక. 
తెలుపు జ్ఞానానికి సూచన. 
నీలి రంగు సర్వ వ్యాపకత్వానికి గుర్తు. 

ఇలా ఈ అలంకారాల వెనక ఉన్న తత్వాన్ని అర్ధం చేసుకోవాలి. అలా కాకుండా ఆర్భాటాలకు పొతే మనము మన లక్ష్యానికి దూరం అవుతాము. అలా అని మన గురువుకి అలంకరణ చేయకూడదు అని కాదు. గురువుకి ఏ సేవ అయినా చేయవచ్చు. కానీ అది మనసా వాచా శుద్ధమైనదిగా ఉండాలి. మనం గురువుని పూజించేటప్పుడు అష్టావధానాలూ చేయకూడదు. నోటితో గురువు నామాన్ని చెపుతూ, మనసుని ఎక్కడో వదిలేస్తే ఎలా!

న గురో రధికం  న గురో రధికం 
న గురో రధికం  న గురో రధికం !
శివ శాసనత శివ శాసనత
శివ శాసనత శివ శాసనత:!!

గురువుకన్నా అధికమైనది ఏది లేదు. ఇది శివ శాసనం అని పరమ శివుడు చెపుతున్నారు. 

ఇదే మార్గాన్ని బాబా మనకు చూపించారు. మరి ఇంకా ఎందుకు ఆలస్యం. సాయి చెప్పిన బాటలో నడుద్దాము. సాయిని గురువుగా మన జీవితంలోకి ఆహ్వానిద్దాము. 


శ్రీమత్పరబ్రహ్మ సాయిం స్మరామి 
శ్రీమత్పరబ్రహ్మ సాయిం భజామి !
శ్రీమత్పరబ్రహ్మ సాయిం వదామి 
శ్రీమత్పరబ్రహ్మ సాయిం నమామి !!


సాయినే స్మరిద్దాము 
సాయినే భజించుదాము !
సాయినే కీర్తించుదాము 
సాయికె నమస్కరించుదాము !!
శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు కి జై ! 


Wednesday, September 28, 2016

108 X Sai Ashtotthara Satanamavali chanting



Dear  Sai Devotees,
Our Guru Sri Shirdi Sai Baba left his Mortal body on the Auspicious day- Vijayadasami Oct 15th 1918. 
Sai Baba Punyatithi is observed on Vijaya Dashami every year.

Sri Shirdi Sai Baba's 100 years Punyatithi celebration is on  Thursday  Oct 18th ,2018.

So let us all come together & show our Shradda to our beloved Guru Sri Shirdi Sai by chanting Sai Ashtothara Sathanamavali 100,000 (1 lak) times or more. 

We are planning to start chanting from Oct 6th 2016 till Oct 18th 2018. Starting from Oct 6th 2016 we have 107 Thursdays till Oct 18th 2018.

we are requesting all Sai devotees chant Ashtotharam every Thursday till Oct 18th 2018. (100 years of punyatithi celebration).

If you can't chant on Thursday  you can do it on any other day in that week.
on the last day of our parayan on Oct 18th 2018 we can chant one more time to make our count 108 times.
Please do not miss this opportunity to do Sai Seva.
if you prefer to chant more than once a week you can do so. 

Please spread the word about our group chanting to every one of your family & friends.

Click on the link for the google doc to submit your expected counts that you will chant by Oct 18th 2018.


OM SRI SAI RAM!

Wednesday, September 21, 2016

దైవం మానుష రూపేణ - గురు గీత




గురువే పరమేశ్వరుడు అని, ఆయనే పరమాత్మ అని, సకల చరాచరాలలో ఉన్న చైతన్యం గురువే అని మన శాస్త్రాలు చెపుతున్నాయి. మనలో ఉన్న ఆత్మను తెలుసుకోవాలి అంటే ఈ పంచకోశాలతో ఉన్న ఉపాధిని తొలిగిస్తే కానీ అది సాధ్య పడదు. ఈ శరీరం త్రిగుణాలను కలుపుకొని, పంచ భూతాలు, పంచకోశాలనే ఒరలతో నిర్మితమై ఉంటుంది. పంచకోశాలు అంటే - అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ మరియు ఆనందమయ కోశాలు. కానీ ఈ శరీరానికి ఆత్మ అనే చైతన్యం ఆధారం. కరెంటు అనే విద్యుత్ శక్తి లేక పొతే బల్బ్ వెలగదు. ఈ చైతన్యం లేక పొతే శరీరం వ్యక్తం అవ్వదు.  

చైతన్యం ఉంటె అది శివమ్ అవుతుంది లేకపోతె అది శవం అవుతుంది. అలాంటి చైతన్యం గురించి తెలుసుకోవడమే ఆత్మ జ్ఞానము. అప్పుడే మనం శివమ్ అవుతాము. లేకపోతె ఈ జనన మరణ చక్రంలో పడి కొట్టుకుంటూ ఉంటాము. ఇలా ఈ చక్రంలో నుంచి మనలను రక్షించడానికి గురువు అవతరిస్తారు. ఈ విషయం గురు గీతలో ఇలా చెప్పారు. 

మనుష్య చర్మణా బద్ధ: సాక్షాత్పర శివస్స్వయమ్ !
గురురిత్యభిధామ్ గృహ్ణన్ గూఢ: పర్యటితి క్షితౌ !!

ఆ పరమేశ్వరుడే, ఆ పరమాత్మే స్వయంగా మనుష్య దేహంలోకి వచ్చి గురువునే నామరూపాలను స్వీకరించి, రహస్యంగా ఈ భూమి మీద తిరుగుతున్నారు అని గురు గీత చెపుతుంది. 


గురువు మన స్థాయిలోకి వచ్చి మనకు అర్ధం అయ్యే భాషలో మాట్లాడితే కానీ మనకు ఈ మార్గం బోధ పడదు. మనం ఒక ఆకారాన్ని మాత్రమే అర్ధం చేసుకోగలము. మనకు ప్రతిదీ పంచభూతాత్మకంగా ఉండాలి. కళ్ళతో చూస్తే కానీ నమ్మము. మనం విద్యుత్ ను చూడలేము కానీ మన బుద్దితో తెలుసుకుంటాము. అలానే పరమాత్మను జ్ఞానంతో తెలుసుకోవాలి. కేవలం తెలుసుకుంటేనే సరిపోదు, అనుభూతితో ఆ పరమాత్మే మనము అని తెలుసుకోవాలి. 

ఈ దారిలో చాలా పరీక్షలు ఉంటాయి. ఎందుకంటే ఇది శాశ్వత ఆనందము. దీన్ని పొందాలి అంటే మనం మనలో ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలి. అప్పుడే ఈ ఆత్మ వ్యక్తం అవుతుంది. సరళ భాషలో చెప్పుకోవాలి అంటే, మనలో ఉన్న కామ క్రోధ మద మాత్స్యార్యాలనే శత్రువులను సంహరించాలి. సర్వము ఆ పరమాత్మే అనే భావం స్థిర పడాలి. అన్ని జీవులను, అందరిని ప్రేమ భావంతో చూడాలి. బాబా చెప్పిన సర్వ వ్యాపకత్వం ఇదే. 


శివ వదృశ్యతే  సాక్షాత్ శ్రీగురుః పుణ్య కర్మణామ్ !
నర వదృశ్యతే సైవ శ్రీగురుః పాప కర్మణామ్ !!

పుణ్యాత్ములకు శ్రీ గురువు సాక్షాత్తూ శివుడిగానే కనిపిస్తారు. ఆ గురువే పాపాత్ములకు మనిషిగా కనిపిస్తారు. అందుకే మనకు గురువుని గుర్తు పట్టడం చేతగాదు. మన పాపాలు నశించినప్పుడు మనకు అర్హత కలిగినప్పుడు శ్రీ గురువే మన ముందు ప్రత్యక్షం అవుతారు. 

సాయిని (గురువుని) మనిషిగా చూసే వారు పాపాత్ములు.

సాయిని దేవునిగా ఆరాధించే వారు పుణ్యాత్ములు.

సాయిని గురువుగా పొందిన వారు ధన్యాత్ములు. 


సాయి బంధువులారా !

మనం ఎంతో కొంత పుణ్యం చేసుకుంటేనే ఈ మానవ జన్మ వచ్చింది. 

మనం పుణ్యం చేసుకుంటేనే సాయి భక్తులం అయ్యాము. 

సాయి చూపిన దారిలో నడిస్తే మన మనస్సు శుద్ధి పడుతుంది. 

అప్పుడే సాయిలో ఉన్న గురు తత్వాన్ని మనం అర్ధం చేసుకోగలము. 

ఒక్క సారి సాయిని గురువుగా స్వీకరించామా ఇక మోక్షం ఖాయం. 


 
శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు కి జై !